పాపన్నపేట, మార్చి 1 : సమైక్య రాష్ట్రంలో అప్ప టి పాలకులు ఏడుపాయల ఆలయ అభివృద్ధిని విస్మరించారని, ఇక్కడ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీమాత జాతర మంగళవారం ప్రారంభం కాగా, సతీసమేతంగా అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు దేవాదాయశాఖ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర ఏటా పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర, ప్రాముఖ్యత ఉందన్నారు. ఏడుపాయల ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏటా కోటి రూపాయలు జాతర కోసం కేటాయిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి కోసం ఇటీవల సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు ఏడుపాయలతో పాటు ఏ ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఏడుపాయల ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఈ ఆలయ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.
మంత్రి, ఎమ్మెల్యేలకు గొర్రె పిల్లతో సన్మానం
అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు శ్రీహరియాదవ్ నాయకత్వంలో యాదవ బృందం సభ్యులు మంత్రిని సన్మానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి పద్మాదేవేందర్రెడ్డిని గొల్లరుమాలు కప్పి గొర్రె పిల్లలతో సత్కరించారు. జిల్లా నాయకులు తూప్రాన్ గండి మల్లేశ్యాదవ్, ఎల్లాపూర్ గొల్లకృష్ణయాదవ్ ఉన్నారు.