మెదక్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీల కేసులపై తక్షణమే స్పందించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెం టనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. త్వరితగతిన కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమికంగా 25 శాతం నష్టపరిహారం ఇప్పించాలని సూచించారు. కేసును 60రోజుల్లో పరిష్కరించకపోతే బలహీనపడే అవకాశం ఉందన్నారు. చార్జిషీట్ దాఖలు చేసి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.
ఎస్పీ అందరికీ అందుబాటులో ఉన్నారని, ఏ సమస్య వచ్చినా కమిటీ సభ్యులు తెలుపవచ్చన్నారు.
అనంతరం మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ దాడులకు సంబంధించి 2019 నుంచి ఇప్పటి వరకు 125 కేసులు నమోదు కాగా, అందులో 104 కేసులపై చార్జిషీట్ దాఖలు చేయగా, వివిధ కారణాలతో 21 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. తూప్రాన్లో 17, మెదక్లో 4 కేసులు పెండింగ్లో ఉన్నాయని, త్వరితగతిన చర్య తీసుకోవాలని డీఎస్పీలకు సూచించారు. 125 కేసుల్లో 121మంది బాధితులకు ఇప్పటి వరకు కోటి 61 లక్షల 76 వేల నష్టపరిహారం అందించామన్నారు. ఇటీవల కొల్చారం మండలం రంగంపేట వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో విచా రం వ్యక్తం చేశారు.
పాఠశాలల వద్ద ప్రమాదాలు జరుగకుండా స్పీడ్ బ్రేకర్లు, స్లడ్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రోహిణిప్రియదర్శిని మాట్లాడుతూ బాధితులు, ప్రత్యర్థుల ఫిర్యాదులు స్వీకరించి, న్యాయం ఉన్న వైపు చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న 21 కేసులను ఈ నెలలో క్లియర్ చేయాలని ఆదేశించారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏడేండ్లలోపు పనిష్మెంట్ ఉంటే 41 సీఆర్పీ కింద నోటీసు ఇవ్వాలన్నారు. పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వస్తే రిసెప్షన్ కౌంటర్ నుంచే పంపిస్తున్నారని సభ్యులు బాల్రాజ్ ఎస్పీ దృష్టికి తీసుకురాగా, సీసీ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నామని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, డీఎస్పీలు సైదులు, యాదవరెడ్డి, డీటీవో చిన్న సాయిలు, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.