తెలంగాణ జానపద కళలకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో ఎన్నో జానపద కళలు, చిత్ర కళలు అవతరించాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా చేర్యాల పెయింటింగ్స్ (నకాషీ) నిలుస్తున్నది. చేర్యాలలో ఆవిర్భవించిన ఈ కళ అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతిని పొందిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని దశాబ్దాల క్రితం పుట్టిన ఈచిత్రకళకు ఇప్పటికీ చేర్యాలలో నాగిల్ల గణేశ్, పసుల మల్లేశం కుటుంబ సభ్యులు (కళాకారులు) జీవం పోస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పలు ఎగ్జిబిషన్లు, మేళాల్లో తమ కళను ప్రదర్శించడంతో పాటు అవార్డులు పొందారు.
చేర్యాల, జూలై 3 : జానపద కళకు తెలంగాణ పుట్టినిల్లు. ఈ ప్రాంతం నుంచి ఎన్నో జానపద కళలు, చిత్రకళలు అవతరించాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా చేర్యాల పెయింటింగ్స్ (నకాషీ) చిత్రకళ చేర్యాల ప్రాంతంలో ఆవిర్భవించి, అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతిని పొందిందంటే అతిశయోక్తి కాదు. గతంలో చిత్రకళలు, జానపదులకు ఘనమైన కీర్తి ఉన్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణగా వాటి ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాల క్రితం పుట్టిన ఈ చిత్రకళకు ఇప్పటికీ చేర్యాలలో కళాకారులు జీవంపోస్తున్నారు. అతికష్ట సాధ్యమైన చిత్రకళను చూపరులకు ఇట్టే అర్థమయ్యేలా బొమ్మలను తయారు చేయడం నకాషీ కళాకారులకే సాధ్యపడుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో వీరి చిత్రకళకు ఆదరణ ఉన్నది. పెద్దపెద్ద నగరాల్లోని భవంతులు, హోటల్స్, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో స్థానిక కళాకారులు వేసిన చిత్రాలనే అందమైన వస్తువులుగా అలంకరించుకుంటున్నారు.
దీంతో ఈ కళ పొరుగు రాష్ర్టాలతో పాటు విదేశాలకు సైతం పాకింది. మొదట కళను ప్రారంభించిన స్వర్గీయ దనాలకోటి చంద్రయ్య విదేశాల్లో ప్రదర్శించి భారతకీర్తిని నలుదిశలా వ్యాపింపచేయడంతో అప్పటి రాష్ట్రపతి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం పొందడంతో పాటు అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం చంద్రయ్య వారసులతో పాటు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుశిష్య పరంపర ట్రైనింగ్ స్కీం ద్వారా శిక్షణ పొందిన నాగిల్ల గణేశ్, పసుల మల్లేశం కుటుంబ సభ్యులు చిత్రకళను కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
‘కర్ర ముక్క, కర్ర పొట్టు కాదేది కళకు అనర్హం’ అన్న చందంగా కళాకారులు పొలికె కర్ర, చింతగింజలు, కర్రపొట్టు, అంబలి, రంగుల పౌడర్లను ఉపయోగిస్తూ బొమ్మలను అత్యంత రమణీయంగా తయారు చేస్తారు. ఎందరో చిత్రాకారులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత స్థాయి అధికారులు సైతం వీరి ఇండ్లకు వచ్చి కళ గురించి అడిగి తెలుసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రజల దృక్పథంలో వచ్చిన మార్పుల వల్ల కళలు అంతరించిపోతున్న నిరాశజనక పరిస్థితుల్లో తమ కళకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు గణేశ్, మల్లేశం కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయి. స్క్రోల్ పెయింటింగ్లే కాకుండా పలు రకాల మాస్కులు, అపురూపమైన కొయ్య బొమ్మలను కూడా తయారు చేస్తున్నారు. ఈ కళాకారులు చిత్రాలు వేయడానికి, గీయటానికి స్వయంగా తయారు చేసిన వాటితో పాటు మార్కెట్లో లభిస్తున్న రంగులే వాడుతుంటారు. చిత్రకారులు గణేశ్ భార్య వనజ,మల్లేశం భార్య మంగతో వారి పిల్లలు సైతం పలు ఎగ్జిబిషన్లు, మేళాలో తమ ప్రతిభను ప్రదర్శించడంతోపాటు అవార్డులు పొందారు. రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన ప్రదేశాల్లో కళాకారులు గోడలపై చిత్రాలు వేసి ఫ్రైజ్ మనీ అందుకున్నారు.
గణేశ్తో పాటు మల్లేశం వారి కుటుంబ సభ్యులతో కలిసి రామాయణం, మహాభారతం, కృష్ణలీల, గౌడ పురాణం, జాంబవంతుడి పురాణం, కాటంరాజు తదితర 8కథలతో పాటు పలు రకాల పక్షులు, జంతువులు (పులి, సింహం, ఏనుగు తదితర) ప్రతిబంభిస్తూ చిత్రాలు తయారు చేసి వాటిని హైదరాబాద్ నగరంలోని గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్స్కు పంపిణీ చేస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో జరిగే మేళాలు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని వారు తయారు చేసిన చిత్రాలు డిస్ప్లే చేయడంతో పాటు వాటిని విక్రయించి, జీవనం కొనసాగిస్తున్నారు. మల్లేశం రెండుసార్లు లలిత కళా అకాడమీ వారి ఆధ్వర్యంలో ఉత్తర, దక్షణ అమెరికా రాష్ర్టాలకు వెళ్లి అక్కడ సైతం తన చిత్రకళను ప్రజలకు పరిచయం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీసీఆర్టీ వారితో కలిసి ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం చేర్యాల పర్యాటక కేంద్రంలో మరో 20 మంది మహిళలకు చేర్యాల పెయింటింగ్స్పై శిక్షణ ఇచ్చారు. దేశంలో ఇప్పటికీ వారు తిరగని రాష్ట్రం లేదంటే వారి కళకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తున్నది.
కరోనా ముందు వరకు తాము తయారు చేసిన చిత్రాలను గోల్కొండ షోరూం పంపిణీ చేయడంతో పాటు పలు మేళాలో వాటిని విక్రయించుకొని జీవనం కొనసాగించాం. కరోనా మా జీవనాన్ని దెబ్బతీసింది. కొనుగోలు చేసిన రంగులు తదితర సామగ్రి వృథా అయిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. సౌత్ అమెరికాలో రూ.5 లక్షల విలువైన చిత్రాలు తయారు చేసే వస్తువులు, బట్టలు తదితర వాటిని కోల్పోవడంతో ఆర్థికంగా చితికిపోయా. ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తే మరింత మందికి చిత్రకళను నేర్పిస్తాం.
– పసుల మల్లేశం, కళాకారుడు
కళాకారులు గణేశ్ ఏపీ, తెలంగాణ హెరిటేజ్ టూరిజం, సెంట్రల్ రైల్వే అవార్డుతో పాటు రూ. 3 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నాడు. మల్లేశం రాష్ట్ర స్థాయిలో కళాకారుడి అవార్డు సాధించడంతో పాటు నార్త్, సౌత్ అమెరికాలో తన కళను ప్రదర్శించి ప్రోత్సాహకాన్ని పొందాడు. అంతేకాకుండా పలు వర్క్షాపులో పాల్గొని ఇతర కళాకారులకు చేర్యాల కళపై అవగాహన కల్పించడంతో పాటు సన్మానాలు పొందారు. వీరితో పాటు గణేశ్, మల్లేశం సతీమణులు సైతం సన్మానాలు పొందారు.