ములుగు, జూన్ 22 : పైలట్ ప్రాజెక్టుతో ధరణి ఆధారిత భూసమస్యలన్నింటినీ వందశాతం పరిష్కరించనున్నామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటి ల్ అన్నారు. మండల కేంద్రం ములుగులో ఏర్పా టు చేసిన పైలట్ ప్రాజెక్ట్ క్యాంపును బుధవారం ఆయన సందర్శించారు. భూరికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ధరణి ఆధారిత భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ములుగును ఎంపిక చేసిందని, ఈ ప్రాజెక్టుతో రైతుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయన్నారు.
ములుగులో వందశాతం సమస్యలు పరిష్కరించిన తర్వాత అధికారులు గ్రామాలకు వెళ్లి, రైతుల ముందే ధర ణి ఆధారిత భూసమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. పహాణీలను నిక్షిప్తంగా పరిశీలించి నిజమైన యజమానులకే భూపై హక్కులు కల్పించాలని ఆదేశించారు. భూమి బదిలీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నదే ధరణి ప్రధాన ఉద్దేశమన్నారు. అనంతరం భూసమస్యలపై వచ్చిన అర్జీలను క్షు ణ్ణంగా పరిశీలించారు.
అంతకుముందు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ములుగు మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్కు విన్నవించారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ధరణి పైలట్ ప్రాజెక్టును సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రఘువీర్రెడ్డి, అధికారులు ఉన్నారు.