సిద్దిపేట, జూన్ 22 : కార్పొరేట్కు దీటుగా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించి, ప్రభు త్వ దవాఖానలపై నమ్మకం పెంచేలా వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేయాలని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం రాత్రి సిద్దిపేట మెడికల్ కాలేజీ దవాఖానను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. దవాఖానలో వార్డుల వారీగా కలియ తిరుగుతూ సూచిక బోర్డులు పెట్టాలని సూచించారు. గోడలపై పేపర్ బ్యానర్ స్ట్రిక్కర్లు అట్టించొద్దని, మార్కర్ పెన్నుతో రాసేలా గ్రీన్ బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. బ్లడ్బ్యాంకు సిబ్బందిని మిగతా పనులకు అనుసంధానం చేయాలని సూచించారు.
దవాఖానలో వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. నంగునూరు మండలానికి చెందిన హారిక తన ఐదేండ్ల బాబు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడని, మెరుగైన వైద్యం అందించాలని మంత్రిని వేడుకున్నారు. గర్భసంచి తీసివేయాలని దవాఖానకు వస్తే వార్డులు తిప్పుతున్నారని ఓ మహిళ మంత్రి ముందువాపోయింది. స్పందించిన మంత్రి అవసరమైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. నిజామాబాద్ దవాఖాన బాగుందని, అక్కడి తరహాలో వైద్య సేవలు అందించాలన్నారు.
అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖాన అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రజల నమ్మకం నిలబెట్టేలా వైద్యులు పనిచేయాలన్నారు. భవిష్యత్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఆర్ఎంవోలు రౌండ్ ది క్లాక్ రౌండ్లు వేయాలన్నారు. రోగులను హైదరాబాద్కు రెఫర్ చేయకుండా ఇక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యం ఓపీ 800 నుంచి 900 వరకు ఉంటుందని వైద్యులు తెలుపగా, అన్ని పరీక్షలు టీ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా చేయాలని సూచించారు. గైనిక్ వార్డుల్లో గర్భిణులకు ఆరోగ్యం దృష్ట్యా వ్యాయామం చేయించాలని, ఈ కార్యక్రమం రోజు క్రమం తప్పకుండా జరుగాలని మంత్రి వైద్యులను ఆదేశించారు. రోగులకు వైద్యులు భరోసా నింపి, ఆత్మ విశ్వాసం కల్పించాలన్నారు.
గర్భిణులు యోగా చేసేందుకు హాల్ను సుందరీకరించి నిత్యం యోగా చేయించాలన్నారు. పేద ప్రజలకు వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలన్నారు. మార్చురీ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, రాత్రిపూట మార్చురీలో పోస్టుమార్టం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మూడు డెడ్బాడీ ఫ్రీజర్లను కొనుగోలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. నిరుపేదలు చనిపోతే పార్థీవ వాహనం ద్వారా ఉచితంగా డెడ్బాడీని ఇంటికి చేర్చాలని సూచించారు.
మూడు అంబులైన్స్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సమీక్షలో కళాశాల ప్రిన్సిపాల్ విమలాథామస్, సూపరింటెండెంట్ కిశోర్ కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, మున్సిపల్ చైర్మన్ మంజులారాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిస్మెంట్, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయి రాం, ఆర్ఎంవో హేమలత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.