సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ):రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫార్మా హబ్గా పేరుగాంచింది. హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నాయి. జిల్లాలోని ఫార్మా కంపెనీల్లో బల్క్డ్రగ్స్ పెద్దఎత్తున ఉత్పత్తి జరుగుతున్నది. బల్క్డ్రగ్ కంపెనీలు దేశీయ అవసరాలతోపాటు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఫార్మా కంపెనీలతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పటాన్చెరు నియోజవకర్గంలోని సుల్తాన్పూర్లో మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేసింది. 302 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మెడికల్ డివైజ్ పార్కులో 40కిపైగా మెడికల్ డివైజ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. కొన్ని పరిశ్రమలు తమ పరిశోధన కేంద్రాలను ప్రారంభించాయి.
సంగారెడ్డి జిలా ఫార్మా, లైఫ్ సైన్సెస్లో ముందంజలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చౌటకూరు మండలం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ క్యాంపస్ను ఫార్మాహబ్గా మార్చాలని నిర్ణయించింది. హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్లో స్టార్టప్ కంపెనీలు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం జే-హబ్ను ఏర్పాటు చేసింది. తాజాగా ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో ఫార్మా రంగానికి మరింత లాభం చేకూరేలా సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ క్యాంపస్ను ఫార్మాహబ్గా మార్చనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలో ఫార్మా రంగానికి మరింత విస్తరించనున్నది. చౌటకూరు మండలం సుల్తాన్పూర్లో జేఎన్టీయూ క్యాంపస్ను 2013లో ప్రారంభించారు. ఇంజినీరింగ్కు సంబంధించిన తరగతులు 2013లో ప్రారంభమయ్యాయి. 2021లో ప్రభుత్వం జేఎన్టీయూ క్యాంపస్లో యూనివర్సిటీ క్యాలేజ్ ఆఫ్ ఫార్మాస్మూటికల్ సైన్సెస్ను ప్రారంభించింది. ఫార్మాసూటికల్ కాలేజీలో ప్రస్తుతం బీ-ఫార్మసీ తరగతులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం జేఎన్టీయూ క్యాంపస్ను ఫార్మాహబ్గా మార్చటంతో ఫార్మాసూటికల్ కాలేజీ దశ మారనున్నది.
క్యాంపస్లో కొత్త కోర్సులు, పరిశోధన కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ క్యాంపస్ను ఫార్మాహబ్గా మార్చనున్న నేపథ్యంలో జేఎన్టీయూలోని యూనివర్సిటీ క్యాలేజ్ ఆఫ్ ఫార్మాస్మూటికల్ సైన్సెస్ దశ మారనున్నది. ప్రభుత్వం ఫార్మాహబ్ ప్రతిపాదనను అనుసరించి జేఎన్టీయూ క్యాంపస్లోని ఫార్మా కాలేజీలో ప్రభుత్వం కొత్త కోర్సులు, ఫార్మా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం జేఎన్టీయూ క్యాంపస్లోని ఫార్మా కాలేజీలో బీ-ఫార్మసీ కోర్సు మాత్రమే ఉన్నది. కాగా, ఫార్మాహబ్లో భాగంగా కొత్తగా ఎం-ఫార్మసీ, డాక్టర్ ఇన్ ఫార్మసీ, పీహెచ్డీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
కొత్త కోర్సుల ప్రారంభంతో ఫార్మాస్మూటికల్ కాలేజీలో విద్యార్థుల సంఖ్య 500 నుంచి 1000 వరకు పెరుగనున్నది. ప్రతిపాదిత ఫార్మాహబ్ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఫార్మా కాలేజీకి అనుబంధంగా ఫార్మా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నది. కొత్త కోర్సుల ప్రారంభం, పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ఫార్మా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సరికొత్త డ్రగ్స్ ఆవిష్కరణకు జేఎన్టీయూ క్యాంపస్ వేదికగా మారే అవకాశాలున్నాయి. ఫార్మాహబ్ ఏర్పాటుతో ఫార్మా కంపెనీలు, లైఫసైన్సెస్ కంపెనీలకు అవసరమైన మానవనరులు అందుబాటులోకి రానున్నాయి.