సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 20: జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన ఆయా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి టీఎస్ఎంహెచ్ఐడీసీ, నీటిపారుదల, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో పలు అభివృద్ధి పనుల పురోగతిపై నియోజకవర్గం వారీగా సమీక్షించారు. వైద్యాఆరోగ్యశాఖకు సంబంధించి వివిధ భవనాల నిర్మాణం, దవాఖాన భవనాల పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షిస్తూ ఆయా పనుల ఒప్పందం మేరకు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత ఈఈకు సూచించారు.
పూర్తయిన భవనాలను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని, అదేవిధంగా ప్రారంభం కాని ఆయా పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నీటి పారుదలశాఖకు సంబంధించి సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంప్హౌజ్లు, గ్రావిటీ కెనాల్, అప్రోచ్ కెనాల్స్కు భూ సేకరణ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 19, కాల్వల పునరుద్ధరణ, నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు, చెక్డ్యామ్ నిర్మాణాలు, కొత్త చెరువుల నిర్మాణం తదితర పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని నీటి పారుదలశాఖ ఎస్ఈ మురళీధర్కు సూచించారు. ఒప్పంద సమయం వరకు నిర్ణీత శాతం పనులు పూర్తి కావాలని చెప్పారు.
చెరువుల ఆక్రమణను అడ్డుకోండి..
జిల్లాలో చెరువులు, కాల్వల ఆక్రమణలకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు సక్రమంగా నీరు సరఫరా కావాలని స్పష్టం చేశారు. అదేవిధంగా వైకుంఠధామాలకు అవసరమైన నీటి సరఫరా కనెక్షన్ ఇవ్వాలన్నారు. పూర్తయిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. నీటి సరఫరా విషయంలో ఏదైనా ఫిర్యాదు చేస్తే వెంటనే పరిశీలించి సమస్య పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల ఎస్ఈలు, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలి
జిల్లాలో వివిధ పనులకు సంబంధించి భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, జీవో 59 దరఖాస్తులు, ధరణి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ వేగవంతంగా పూర్తి చేసేలా ఆయా తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా భూసేకరణ పూర్తి కావాలన్నారు. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించి పరిశీలన చేసి సమగ్ర నివేదిక అందించాలన్నారు. హైవ్యాల్యూ కాలనీల్లోని స్ట్రే బిట్స్, వివిధ కాలనీల్లో ఉన్న హైవ్యాల్యూ ప్లాట్ల వివరాల జాబితా అందించాలన్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించడంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయా భూ సమస్యలకు సంబంధించి అప్రూవల్ అయిన వారందరికీ హార్డ్ కాపీలను అందించేలా ప్రణాళిక చేయాలని తహసీల్దార్లకు సూచించారు.