ఖార్టూమ్: ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక పిల్లి అలజడి సృష్టించింది. పైలట్పై దాడి చేసి అందరినీ కంగారు పెట్టింది. దీంతో పైలట్ ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. సుడాన్ రాజధాని ఖార్టూమ్లో ఈ ఘటన జరిగింది. టార్కో ఏవియేషన్కు చెందిన విమానం బుధవారం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్కు బయలుదేరింది.
అయితే అది టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత కాక్పిట్లో ఒక పిల్లి హంగామా సృష్టించింది. దానిని పట్టుకునేందుకు పైలట్ ప్రయత్నించగా అతడిపై దాడి చేసింది. ఆ పిల్లిని పట్టుకునేందుకు విమానం సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు.
కాగా, ఆ విమానాన్ని ముందు రాత్రి విమానాశ్రయంలో నిలిపి ఉంచినప్పుడు ఆ పిల్లి కాక్పిట్లోకి ప్రవేశించి ఉంటుందని విమానయాన సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత నిద్ర లేచిన ఆ పిల్లి అక్కడి వారిని చూసి బెదిరి ఉంటుందని, పట్టుకోబోయిన సిబ్బంది, పైలట్పై దాడి చేసి ఉంటుందని వారు భావిస్తున్నారు.