నోమోఫోబియా.. అంటే ‘నో మొబైల్ ఫోబియా’. చేతిలో స్మార్ట్ఫోన్ లేకపోతే ఎట్ల..? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అనే భావన అది. ఒక రకంగా మానసిక రుగ్మతే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఇద్దరిలో ఒకరు నోమోఫోబియాతో బాధపడుతుండడం విస్మయపరిచే వాస్తవం. అవసరం అనేదాన్ని దాటుకుని స్మార్ట్ఫోన్ ఇప్పుడొక వ్యసనంగా మారిపోయింది. అరచేతిలో చరవాణి ఉంటే ఏదైనా చేసేయొచ్చులే అనుకుని.. ఏదీ చేయలేని, ఏమీ ఆలోచించలేని స్థితిలోకి వెళ్లిపోతున్నాం. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగడం, స్మార్ట్ఫోన్ సందేశాల కోసం ఆరాటపడడం, ఆలోచనాశక్తి సన్నగిల్లి, కండ్లపై ఒత్తిడి పెంచడం సెల్ఫోన్ వ్యసనానికి సూచనలంటున్నారు నిపుణులు.
ఒక్కో వ్యక్తి రోజులో సగటున 148 నిమిషాలపాటు ఫోన్ను వాడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ లెక్కన మనిషి జీవితకాలంలో దాదాపు దశాబ్దకాలం ఫోన్లో గడుపుతున్నట్లే. ఆటవిడుపుగానో, అవసరాల కోసమో చిన్నపిల్లలకూ వాటిని అలవాటు చేస్తున్నారు. సమయం, విలువల సంగతి పక్కనబెడితే.. స్మార్ట్ఫోన్ ప్రజల ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. మానవసంబంధాలను దెబ్బతీస్తూ.. ఏకాకితనాన్ని, నేరప్రవృత్తిని పెంచుతున్నది. మానవ వికాసానికి దోహదపడుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. అదేస్థాయిలో వారి మనుగడనూ దెబ్బతీస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nomophobia | మహబూబ్నగర్ డెస్క్, డిసెంబర్ 8 : ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాతో గడుపుతున్న సమయం సగటున దాదాపు 65 శాతం పెరిగింది. 2012లో రోజుకు సగటున 90 నిమిషాలు సెల్ఫోన్ వాడితే 2020 నాటికి ఈ సమయం 143 నిమిషాలకు చేరింది. ఇండియాలో ఈ టైం 148 నిమిషాలుగా ఉన్నట్లు లండన్కు చెందిన పరిశోధనా సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన 1060 మంది విద్యార్థులపై శాస్త్రవేత్తలు అధ్యయనాలు జరిపి ఫలితాలు వెలువరించారు.
ఫోన్ లేకుండా పిల్లవాడు గడపలేకపోతున్నాడంటే ప్రమాదాన్ని గుర్తించాలి. దానిని ఏ విధంగా వినియోగిస్తున్నాడో పరిశీలించాలి. ఇటీవల కళాశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు ప్రత్యేక యాప్ల ద్వారా హోంవర్క్లు, పాఠ్యాంశాలు కూడా ఇస్తున్నారు. దీంతో ఎల్కేజీ నుంచే పిల్లలకు ఫోన్ తప్పనిసరి అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి ఫోన్ అవసరం లేకుండా బోధన జరిగేలా చూస్తే బాగుంటుంది. రోజులో సెల్ఫోన్కు కేటాయించే సమయం 30 నిమిషాలు మించకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరికీ సెల్ఫోన్ అవసరమే. కానీ ఎంత వరకు దీనిని ఉపయోగించుకుంటున్నామనేది పరీక్షించుకోవాలి. కుటుంబంలో అందరూ ఉన్నప్పుడు కనీసం మాట్లాడుతున్నారా? లేదా అప్పుడూ ఫోనే చూస్తున్నారా గమనించాలి. ప్రతిరోజూ మూడు గంటలకు పైగా సోషల్ మీడియాలో గడుపుతున్నామంటే నోమోఫోబియా (మొబైల్ ఫోబియా)కు లోనైనట్లే. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి.
పిల్లల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియాలో గడుపుతున్న క్షణాలు.. నిమిషాలయ్యాయి. కాలం మారిన కొద్దీ అవి గంటలు అయ్యాయి. అంటే ప్రతిఒక్కరూ ఫోన్ చూసేందుకు రోజూ 148 నిమిషాలు సమయం వెచ్చిస్తున్నారు.
ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది. అది లేనిది రోజు గడవడం లేదు. స్మార్ట్ఫోన్తోనే ఇంటి నుంచే అనేక పనులను చేసేస్తున్నాం. అయితే స్మార్ట్ఫోన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. దాన్ని అధికంగా వాడితే అన్ని అనర్థాలున్నాయి. ప్రధానంగా స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్లాంటి సమస్యలు రావొచ్చని లండన్కు చెందిన పరిశోధనా సంస్థ తన పరిశోధనల్లో తెలిపింది. అంతేకాక ఆ సంస్థ విద్యార్థుల ఆహారపు అలవాట్లు, ఇతర జబ్బుల వివరాలనూ సేకరించింది. నిత్యం ఎన్ని గంటలు స్మార్ట్ఫోన్ను వాడుతున్నారన్న వివరాలనూ రాబట్టింది. చివరికి నిత్యం ఐదు గంటల కన్నా ఎక్కువగా ఫోన్ వాడే విద్యార్థులు 42.6 శాతం.. అదే విద్యార్థినులైతే 57.4 శాతం స్థూలకాయం బారిన పడే అవకాశం ఉందని ఈ పరిశోధనలు తేల్చాయి. అంతేకాక స్మార్ట్ఫోన్ నుంచి వెలువడే నీలికాంతి కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని దెబ్బతీసి దగ్గరి దృష్టి (మయోపియా) లోపాన్ని కలిగిస్తున్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫోన్ రేడియేషన్తో అనేక దుష్పరిణామాలు తలెత్తుతాయని.. నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు.
ఒకప్పుడు టీవీ తెచ్చిన తంటా ఇప్పుడు మొబైల్ తెస్తున్నదంటే సందేహించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దిగువ మధ్య తరగతి మొదలు ఉన్నతస్థాయి కుటుంబాలు కలిసిన కొద్ది క్షణాలు తప్ప ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. హాయ్.. బాయ్ పలకరింపులతోనే సరిపెడుతున్నారు. ఆ తర్వాత ఫోన్లలో తలలు దూర్చేస్తున్నారు. ఎవరి ఫోన్ వారిదే.. ఎవరి లోకం వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యువత ఇంటి సభ్యులతో కలువడం లేదు.
స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ జీవితాలను మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచాన్ని దగ్గరగా పరిచయం చేయడంతో పాటు ప్రతిఒక్కరికీ ఏది కావాలంటే అది చిటికెలో అందిస్తున్నది. మరోవైపు ఆన్లైన్లో లైవ్ ద్వారా ఆత్మహత్య చేసుకునే దిక్కుమాలిన సంస్కృతిని అందించింది. అంతేకాక ఆత్మహత్య చేసుకుంటున్న వాడిని ఆపే బదులు ఇంకెందుకు లేట్ అంటూ పోస్టులు పెట్టే శాడిస్టుల సమాజాన్ని కూడా ఇదే సోషల్ మీడియా పరిచయం చేసిందంటే అతిశయోక్తి కాదేమో.
తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్కు బానిసలు చేస్తున్నారు. పనులకు అడ్డు వస్తున్నారని కొందరు.. విసిగిస్తున్నారని మరికొందరు ఫోన్ ఇచ్చి ఆడుకోమంటున్నారు. దీంతో పిల్లలు ప్రమాదంలో పడుతున్నారు. నెలలు నిండుతున్నా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. నగరాల్లో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని ఈఎన్టీ వైద్యులు తెలుపుతున్నారు.
‘ఎవరు డ్రగ్స్ తయారు చేస్తారో వారు వాడకూడదన్నది’ డ్రగ్స్ వ్యాపారుల నియమం. ప్రస్తుతం ఇక్కడ అది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే 2010లో యాపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ తన కంపెనీ ఫోన్లో యాప్లను ప్రపంచానికి పరిచయం చేస్తూ మూడుగంటల ఉపన్యాసం ఇచ్చాడు. ప్రసంగం అనంతరం అప్పటికే స్టీవ్ జాబ్స్ చరిత్ర రాస్తున్న వాటర్ జాక్సన్ స్టీవ్ జాబ్స్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ప్రతి గోడ మీద పిల్లలు ఎవరూ స్మార్ట్ఫోన్ వాడవద్దని రాసి ఉంది. అంతేకాకుండా తన పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకుండా పనివాళ్లు నిరంతరం నిఘా పెట్టాలని సూచించాడట. అంటే ప్రపంచానికి ఎంతో సేవ చేశామని చెప్పుకున్న స్టీవ్ జాబ్స్ తన వరకు వచ్చేసరికి జాగ్రత్తలు పడ్డాడు. కానీ మన కుటుంబాల్లో మాత్రం అలాంటి జాగ్రత్తలు సున్నా.
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సెల్ వీక్షణంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో ఒంటరి జీవితాలు ఎక్కువ కావడంతో యువత రెండేండ్ల క్రితమే స్థాయికి మించి సెల్ వినియోగిస్తుండడంతో ఆల్కహాల్ తాగే వారికి డీ ఎడిక్షన్ సెంటర్లు ఉన్నట్లు ఇంటర్నెట్ డీ ఎడిక్షన్ సెంటర్లను ప్రారంభించే స్థాయికి చేరింది.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక్క ఫోనే ఉండేది. కానీ ప్రస్తుతం ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఉండాల్సిందే. అది కూడా రెండు, మూడేండ్లు మాత్రమే. దీంతో ప్రస్తుతం కుటుంబ బడ్జెట్లో ఫోన్లకు ప్రత్యేకంగా కేటాయించాల్సిన పరిస్థితి మధ్య తరగతి కుటుంబాల్లో ఏర్పడింది.
ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఫొటోకు ఒక లైక్ వచ్చినప్పుడల్లా మెదడులో డోపమైన్ను పెంచుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ఉత్సాహానికి గురైన మెదడు ఇంకా పోస్టులు పెట్టాలని క్రమంగా ప్రేరేపిస్తుంది. ఈ డోపమైన్ అనేది ఓ మత్తు పదార్థం లాంటింది. ఇది మనసు ప్రశాంతతకు ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాకు బానిసైన కొందరిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. వారిలో హెరాయిన్, కొకైన్ వంటి డ్రగ్స్ బాధితులకు ఉండే లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఫోన్ ఉన్న ప్రతివ్యక్తి రోజుకు రెండున్నర గంటల సమయం సోషల్ మీడియా కోసం వెచ్చిస్తున్నాడు. ఇది ఒక మనిషి జీవిత కాలంలో ఇంచుమించు పదేండ్లకు సమానం కాగా.. సెల్ఫోన్కు ఎంత బానిసయ్యామో అర్థం చేసుకోవచ్చు. అన్ని అందిస్తున్న స్మార్ట్ఫోన్ డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా మారుతున్నది. ఏది కావాలన్నా నిమిషాల్లో అందించే ఈ ఫోన్ కొత్త సంస్కృతిని పరిచయం చేస్తున్నది. మానవ సంబంధాలను వింతగా ఆవిష్కరిస్తున్నది.