వనపర్తి, మే 17 : కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపమైందని.. మల్లు భట్టి విక్రమార్క జిల్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హితవు పలికారు. బుధవారం ప్రకటనలో ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తెలంగాణ కావాలని జనం ఉద్యమిస్తుంటే.. యువత బలిదానాలు చేస్తుంటే .. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, కలిపి తెలంగాణ, ఉత్తరాంధ్ర కావాలని రాష్ట్ర కాంగ్రెస్.. కేంద్రంలోని అధిష్టానానికి లేఖ రాసిన చరిత్ర మీదని గుర్తు చేశారు.
పాలమూరు -రంగారెడ్డి పనులు జరగకుండా అడ్డుపుల్లలు వేసిందే కాంగ్రెస్ పార్టీయే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయాన్ని వదిలి 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల వద్ద నుంచి నీటిని తీసుకోవాలని పట్టుబట్టింది హస్తం పార్టీయే అన్నారు. వందల కేసులను ఎదుర్కొని పాలమూరు ప్రాజెక్టు పనులను తుది దశకు తీసుకొచ్చామని తెలిపారు. భట్టి విక్రమార్క ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో వలసలు, ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రష్టు పట్టించిందని, పోతిరెడ్డిపాడుతో పాలమూరు పొట్టగొట్టిందని విమర్శించారు. జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.
ఇంకా పలు ఎత్తిపోతల పనులు నిలిచిపోయిన పుణ్యం కాంగ్రెస్దే న్నారు. పాలమూరు లిఫ్ట్ గురించి ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ఎంపీలు ఒక్క రోజు కూడా పార్లమెంట్లో మోదీ సర్కార్ను నిలదీశారా అని ప్రశ్నించారు. పాలమూరు గురించి.. ఇక్కడి ప్రాజెక్టుల గురించి భట్టి విక్రమార్క ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిందని సూచించారు. లేకుంటే పోయేది కాంగ్రెస్ పరువేనని హితువు పలికారు.