ఆధునిక సాహిత్యం విభిన్న రీతులు సంతరించుకుంటూ నూతనత్వాన్ని సొంతం చేసుకుంటున్నది. శైలి, నిర్మాణ పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతూ, అనేక పేర్లతో, విధానాలతో నవీన సాహిత్యం తన వర్గప్రయోజనం దిశగా అడుగులేస్తున్నది. సామాజిక చైతన్యం, వ్యవస్థ మార్పు, సాహిత్య ప్రయోజనాలు ఇలా ఆధునిక సాహిత్యం వర్గ చైతన్యాన్ని రగిలించటంలో తిరుగుబాటును, శాస్త్రీయ దృక్పథాన్ని నూరిపోయటంలో చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపుతున్నది.
సాహిత్యం ఆధునికతను సంతరించుకున్న కొద్దీ సాధారణ ప్రజలకు మరింత చేరువైంది. ఒకప్పటి సాహిత్యం అందని ద్రాక్ష అయితే ఇప్పటి సాహిత్యం అందిన అరటిపండు. ఒకప్పుడు పద్యరూపానికి, అటు పిమ్మట వచన దొంతరలకు పరిమితమైన సాహిత్యం నేడు అనేకానేక రూపాలతో, రీతులతో అలరారుతుండటం గమనార్హం.
సాహిత్యంలో ఆధునికత కాలానికి సంబంధించినది కాదు. అది అభివ్యక్తికి సంబంధించినది. ఈ విషయాన్ని చాలామంది విమర్శకులు చెప్పి ఉన్నారు. వ్యవస్థలో మార్పుకు మొదటి కారణం ఆధునిక సాహిత్యం. కవిత్వానికి బోలెడు పేర్లు, ప్రక్రియలు ఉన్నమాట నిజం. సాధారణంగా తెలుగులో కవిత్వం అంటే భావకవిత్వం, అభ్యుదయ, దిగంబ ర, విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ వంటివన్నీ కవిత్వ రీతులే. కవిత్వానికి వాహకం కావాలని చాలామంది పెద్దలు చెప్పినట్టే వస్తువో, వ్యక్తో కవిత్వంగా మారుతాడు. అనుభూతి కవిత్వంలో రూపాన్ని, భావాన్ని ఒకే తాటికి కట్టడం వల్ల గుణగణాలపరంగా కవిత్వ రీతిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అవన్నీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసే దిశగా కొనసాగుతున్నాయి.
కవిత్వం అంటే పాత్ర, స్థల, కాలానుగుణంగా సాగడం ఒక పద్ధతి. తెలుగు ఆధునిక కవిత్వంలో కవిత్వం దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఆత్మాశ్రయంగా మారింది. ఇందులో కవే సజీవ పాత్రలో జీవిస్తాడు. శతక కవులైన ధూర్జటి, రామదాసు, అన్నమయ్య వారి వారి కీర్తనల్లో ఆత్మాశ్రయాన్ని పాటించి ఆధునిక సాహిత్యానికి బాటలు వేశారు. అయితే ఈ యుగంలో తెలుగు సాహిత్య ప్రక్రియ వస్తువు, శైలి పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందనేది కాదనలేని నిజం. ఆంగ్ల భాష అధ్యయనం ఒకవైపు, పాశ్చాత్య భావాలను తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయడం, రాజకీయ, సామాజిక ఉద్యమాలు తెలుగు సాహిత్యంలో మార్పులు తీసుకొచ్చాయి.
కథ, నవలలు రాయడం మొదలు పెట్టాక సాహిత్యంలో సామాజిక చైతన్యం మొదలైంది.. గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు తదితరుల వ్యవహారిక భాషా ఉద్యమంతో సాహిత్యంలో కొత్త ఒరవడి మొదలైంది. ఆంగ్ల సాహిత్య అధ్యయనం వల్ల వస్తువు శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునికయుగంలో కవిత్వమంటే పద్యం మాత్రమే కాదు, గద్యం, వచనం, సంభాషణ ఇంకా చాలా రకా లు. సంప్రదాయ, నవ్య సంప్రదాయ, కాల్పనిక , అభ్యుదయ, విప్లవ ధోరణులతో నూతన ఆలోచనలు మేల్కొన్నాయి.
తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాల నేపథ్యం ఎక్కువనే చెప్పాలి. సాహిత్య దృక్పథాన్ని సామాజిక విలువల్ని బట్టే నిర్ణయిస్తారు. ఛందోబద్ధమైన కవిత్వం రాసేప్పుడే వివిధ లఘు రూప కవిత్వాన్ని రాయడం చూశారు. అయితే వస్తువులో మార్పు తీసుకురావడం ఆధునిక సాహిత్య సామాజిక చైతన్యం.
తెలుగులో వచన కవిత్వం ద్వారా పద్య కవిత్వంలోని ఛందస్సు నుంచి దూరంగా వచ్చేశాము. దీంతో పాటు మినీ కవిత్వం కూడా మొదలయ్యింది. రూపపరమైన అంశాలు, ప్రయోగాలు చోటు చేసుకొని వచన కవిత్వం ఉధృతంగా వస్తున్నది. ఇందులో హైకూలు, నానీలు, నానోలు, టుమ్రీలు, రెక్కలు, రవ్వలు మణిపూసలు, మొగ్గలు, కైతికాలు అని రకరకాల కవితా ప్రక్రియలు ఆధునిక కవిత్వంలో చోటు చేసుకున్నాయి. అయితే వీటన్నిటి మీద సరైన దృష్టి లేకపోవడం విచారించతగ్గ విషయం…
తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విస్తృతంగా ఉన్నప్పటికీ ప్రపంచీకరణ ఫలితంగా గత కొన్నేండ్లుగా ఆదరణ తగ్గుతోంది. ఒకనాడు ఉద్యమంలో భాగమై పోరాటంతో మమేకమైన సాహిత్యం రానురాను ఎందుకో ఉద్యమభూమికకు కొంత ఎడమైంది. అస్తిత్వ ఉద్యమ సాహిత్యాన్ని ప్రోత్సహించే ,ఆదరించే వారు తగ్గారు.
తెలుగునాట సాహిత్యానికి ప్రాణాధారమైన దిన, వార పత్రికలు సాహిత్యానికి ప్రత్యేక పేజీని కేటాయించటంలో వెనుకడుగేయటం కవులకు అశనిపాతమైంది. అయితే ఆ స్థానాన్ని సామాజిక మాద్యమాలు భర్తీచేస్తున్నాయి. కథలు, కవిత్వం తదితర సాహిత్యం పత్రికల్లో కంటే సామాజిక మాద్యమాల ద్వారానే విస్తృతంగా రావటం గమనార్హం. వలసవాద సాహిత్యం.. దీన్నే డయాస్పో రా సాహిత్యం ఆంటారు. ప్రవాస సాహిత్యం అని కూడా అంటారు. ఇలాంటి సాహిత్యం కూడా ఆధునిక సాహిత్యంలో ఎక్కువగా వస్తున్నది. ఇప్పుడైతే తమకిష్టమైన పరిభాష లో ఉచితంగా రాసుకునే వీలు కలిగింది. సృజనాత్మకమైన సాహిత్యం వస్తున్నా, స్థిరమైన గొంతులు ఉన్నా నిక్కచ్చిగా ఉండాల్సినచోట నీరు గారిపోతున్నాయంటున్నారు నిపుణులు. సమాజంలో, సాహిత్యంలో ప్రజా సమూహాల భాగం చాలా అవసరం. ఏ సాహిత్య ధోరణిలోనైనా విమర్శ విరివిగా వచ్చినప్పుడే ఆ ప్రక్రియ బతుకుతుంది. ప్రజల పక్షాన ఉండాల్సిన గొంతులు పలుచబడటం వల్ల సాహిత్య కార్యాచరణ గొప్పగా జరగటం లేదనేది ఒప్పు కోవాల్సిన నిజం. సమాజంలో ప్రజల పక్షాన నిలబడ్డట్టే సాహిత్యంలో సమాజ పోకడలను రాస్తే ఆ సాహిత్యం ఎప్పటికీ తాజాగా ఉంటుంది.
వేగంగా మారుతున్న కాలాన్ని బట్టే సాహిత్యం రూపొందాలి. సృజనాత్మక శక్తులను స్త్రీలు పెంపొందించుకోవాలి. బహుజన సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉన్నది. కాల్పనికత ఉన్న వాస్తవిక ధోరణిలో నుండే కల్పనను రాస్తే ప్రతి రాత విశ్వసనీయంగా ఉంటుంది. మంచి సాహిత్యం కొరవడటానికి సాహిత్యకారుల్లోని ద్వందవైఖరి కారణమవుతున్నది. ఎన్ని చెప్పినా, ఏది చెప్పినా చదువరే తీర్పు ఇచ్చేవాడు. పాఠకుడే దేవుడు ఏ సాహిత్య ప్రక్రియకు అయినా. మనిషి జీవించే హక్కుని సాహిత్యం ద్వారా కూడా పొందవచ్చు. అంత శక్తి సాహిత్యానికి ఉంది. ఎన్ని ఉద్యమాలు జరిగినా ఎన్ని పోకడలు అవలంబించినా ఇంకా కొన్ని చోట్ల సామాజికవృద్ధి జరగలేదనే చెప్పాలి.
సాహిత్యం ద్వారా పర్యావరణ చైతన్యం, పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. అందుకే సాహిత్యం సమాజానికి చూపుడు వేలు. అటువంటి సాహిత్యాన్ని సుసంపన్నం చేసే అవకాశం సాహిత్యకారులు చేపట్టాలి. ఆధునిక సాహిత్యంలో ఇంకా ఇంకా మౌలిక మార్పులు రావాలి. టైంపాస్ సాహి త్యం కాకుండా ఎప్పటికీ నిలిచిపోయే అస్తి త్వ, సామాజికవృద్ధ్ది, సమాజంలో చెడును నిర్మూలించి ప్రగతిశీలతను రక్షించుకోవడం ప్రస్తుతం ఆధునిక సాహిత్యంలో చేయవలసిన పనులు.
– సుభాషిణి తోట 95028 18774