ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవన విధానం ప్రతిఫలిస్తుంది. ఈ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఒక భాషలో ఒక నానుడి కానీ, సామెత కానీ, జాతీయం కానీ అలవోకగా పుట్టదు. ఆయా జాతీయులు తలలు పండిన వారి అనుభవరాశిని కాచి, వడబోసి నిగ్గుదేల్చిన సారమే ఈ నుడికారపు ఇంపు సొంపులు. అందుకే అవి భాషకు జీవనాడి, ప్రాణధాతువుల వంటివి అంటారు యశోదారెడ్డి.
తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కునారిల్లిన సమాజం నుంచి మొదలుకొని అంటే 1930వ దశకం నుండి 2007 దశకం సగం కాలం వరకూ యశోదారెడ్డి మూడు తరాలనూ, ఆ తరాలలో వచ్చిన అనేక మార్పులనూ గమనించారు. గ్రామాల్లో, పట్టణాల్లో వేగవంతంగా వచ్చిన మార్పులు, కుటుంబాల్లో వాటి భావజాలాల్లో వాటి ప్రభావాలూ, తదనుగుణంగా వచ్చిన మార్పులనూ గుర్తించిన ఆమె వాటన్నింటిని తన కథల్లో ప్రస్ఫుటింపజేస్తూ ప్రస్తావించారు. ఆచార్య పాకాల యశోదారెడ్డి 1929 ఆగష్టు 8న మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి కత్తి కాశిరెడ్డి, తల్లి సరస్వతమ్మ. గ్రామంలో అందరూ ఆమెను ఎచ్చా, ఎచ్చమ్మా అని పిలిచేవారట.
తెలుగు నుడికారాన్ని గురించి ఈ తెలంగాణ భాషా ప్రేమికురాలు ఏమంటారంటే ‘ఇప్పటి మన వ్యవహార భాష సామెతల సొంపును, నుడికారపు సొగసును, జాతీయపు బిగువును కోల్పోయి కేవలం అభిప్రాయ ప్రకటనకు ఉపకరణ రూపంలో యాంత్రికంగా మారింది. ఈ స్థితి అనేక భాషల ప్రభావంతో సంభవించిన దారిద్య్రం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అసలు సిసలైన తెలుగు భాషా రుచిని ఆస్వాదించ దలిచితే తెలంగాణపు తెలుగును చదవండి, వినండి’ అంటారు.
తెలంగాణ తొలితరం కథ రచయిత్రి యశోదారెడ్డి స్థానం తెలుగు కథా సాహిత్యంలో విశిష్టమైనది. తన బాల్య జీవిత ప్రభావం వల్ల యశోదమ్మకు గ్రామీణ, యాస, భాషలపైన పూర్తి మక్కువ ఏర్పడింది. యశోదమ్మ నుంచి ‘ఎచ్చమ్మ’గా మారిపోయిన ఆ పల్లె కోయిల దగ్గరున్న అతిపెద్ద ఆయుధం కలం. ఆ కలం నిండా మధు రమైన తెలుగు పదబంధాలు, జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పలుకుబడులు, కతలు. సహజమైన జీవిత దృశ్యాలు, ఘటనలు, అనుభవాలను చిక్కనైన భాషా సొగసులతో పొదిగి కథా రచన గావించిన రచయిత్రి యశోదమ్మ. ఇప్పటికే చాలా వరకు జన వ్యవహారంలో నుంచి తొలిగి ఎక్కడో కొన ఊపిరితో ఉన్న పలుకుబడి ఊపిరిపోకుండా కాపాడేందుకు ‘ఎచ్చమ్మకతలు’ కథల సంపుటిని తీసుకువచ్చారు.
అందుకొరకు ‘నీ,నా’ భేదాలను మాని విశాల దృక్పథంతో, సమదృష్టితో పరిశీలించగలరని మనవి అంటూ ’ఎచ్చమ్మకతలు’ కథా సంపుటికి తమ మనసులోని మాటను ‘నా మాట’ రూపంలో తెలిపారు యశోదారెడ్డి. దీనిలోని కతలను 1950లో దక్కన్ రేడియోలో ‘మహాలక్ష్మి ముచ్చట్లు’గా ఆమె వినిపించారు. ఈ కతలలో నుంచి మచ్చుకు రెండు కతల సారాంశాన్ని పరిశీలిద్దాం.
‘కాలం చెప్పిన తీర్పు’ : ఈ కథ గ్రామంలో ఒక ‘దొర వ్యవస్థ’. గ్రామంలో గోవిందు, అతని భార్య వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. వారి కొడుకు ఎలమంద, కోడలు బీమమ్మ వారి కొడుకు కోదండం.
వారందరికీ దొర కుటుంబం కలిగించిన ఇబ్బందులతో పాటు నిబద్ధతతో, శ్రమతత్వంతో బీమమ్మ కుటుంబం ఎదిగిన తీరును కండ్ల ముందుంచుతుంది. ఎలమంద పొలం పని చేస్తూ పాముకాటుతో చనిపోతాడు. నర్సయ్య పంతులు మాట మీద బీమమ్మకు కొంత భూమిని ఇచ్చి ఆమె కొడుకు కోదండాన్ని తన కొడుకుతో పాటు చదివిస్తాడు దొర గోపాల్రావు.
గోపాల్రావు గుండెపోటుతో మరణించడంతో పెత్తనం దొరసాని పాపమ్మ చేతికొస్తుంది. ఆమె దృష్టి బీమమ్మ కష్టంతో సాగు చేసుకుంటున్న కూరగాయల తోటపై పడుతుంది. కరణం భార్య అండమ్మ సహాయం తో పాపమ్మ ఆమె గుడిసెనూ, తోటనూ నాశనం చేయిస్తుంది. అంతే కాదు పరీక్షల సమయంలో కోదండాన్ని పిలిపించి అతని చదువును చెడగొట్టాలనుకుంటుంది.అది తెలిసి భీమమ్మ దొరసానిని ఛీత్కరించుకుంటుంది.
కొన్నేండ్లు గడిచాక ఆగష్టు15న ఆ ఊరిలో జెండావిష్కరణ బాధ్యత కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ కోదండంపై పడుతుంది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఆ ఊరికి వచ్చిన కోదండం ముందుగా బీమమ్మకు, నర్సయ్య పం తులు కాళ్ళకు దండం పెట్టి, తనకు వేసిన దండనే దొర ఇంటికి పోయి ఆయన ఫొటోకు వేస్తాడు. ఆ సంఘటన చూసిన పాపమ్మ తాను ఒక హీనమైన ప్రాణిగా భావించుకుంటుంది. పెద్ద దొర రాసిచ్చిపోయిన భూమి పట్టా కాగితాలను దొరసాని చేతిలో పెట్టి ‘అమ్మా మ నుషుల్ని మనుషుల్లా చూడడం నేర్చుకోండి. కాలం మారింది. వెనకటి జులుం చెల్లదు, ఎద మెత్తన మంచిది. అని దండం పెట్టి తన వాహనం లో తల్లిని, నర్సయ్య పంతులునూ తీసుకొని వెళ్ళిపోతాడు కోదండం. ఈ కథలో కాల మే తీర్పు చెప్తుంది.
దొరా నన్ను అమ్ముకోకు : ఈ కథ ఊరిలో మంచిగా బతుకుతున్న పరమేశం, అతని భార్య సీతమ్మ, దోస్తుగా వచ్చి సీతమ్మపై కన్నేసి పరమేశం జీవితాన్ని తప్పుదారి పట్టించ జూసిన ఒక దుర్మార్గుడి చుట్టూ అల్లిన కథ. దోస్తు మాటలతో ప్రభావితుడైన పరమేశం తన వేషాన్నీ, పద్ధతులనూ మార్చుకుంటాడు. సీతమ్మను అంతగా పట్టించుకోడు. అయినా అతని తప్పిదాలన్నీ మరచి సీతమ్మ భర్తను ప్రేమిస్తూనే ఉంటుంది. ఆహారపు అలవాట్లతో సహా జీవన విధానాన్ని మార్చేసిన ఆ దోస్తు పలు ప్రలోభాలతో పరమేశంను ఏమార్చే ప్రయత్నం చేస్తాడు.
‘గుడికుప్ప’ దగ్గర రోడ్డు ప్రారంభోత్సవానికి మినిష్టరును ఆహ్వానిస్తారు. ఆ సందర్భంగా అక్కడ మినిష్టర్కు, ఇతర అధికారులకూ సీతమ్మ చేసిన వంటలు బాగా నచ్చుతాయి. పరమేశాన్ని దగ్గరకు పిలిచి ‘సూడు పరమే శం నీవు అదృష్టవంతుడివి. సీతమ్మ నీకు పెండ్లామైంది. ఆ తల్లి అసొంటి చేదోడు ఉండంగ నీకేం కొదువయ్య ! అన్ని ఏర్పాట్లు బందోబస్తుగనె నడ్సినవి’ అంటూ సెబా సు పలికి వెళ్తాడు. మిగిలిన వాళ్లకు తిండి తిప్పలు చూ స్కోటంలో మునిగిపోయిన పరమేశం దోస్తు కోసం వెతుకుతాడు. ఆ సమయంలో పరమేశంకు అతని భార్య సీత గుర్తొస్తుంది. ఏదో తప్పు చేస్తున్నట్లనిపిస్తుంది. ఈ పూట కు సీత నేను కల్సి భోజనం చేస్తం అనుకుంటూ ఇంట్లోకి పోతుంటే సీతతో అసభ్యంగా మాట్లాడుతున్న దోస్తు గొం తు వినిపిస్తుంది. ఆ క్షణంలోనే వచ్చిన పరమేశంను జూసిన సీత తన సేయి వట్టిన ఆ దోస్తును గజ్జికుక్కను చూసి సీదరించుకుని, పురుగును దుల్పరిచ్చినట్టు దుల్పరిచ్చి నీకెంత ధైర్నంరా? అనుకుంటూ ఇడిపిచ్చుకొని పరమేశాన్ని అల్ముకుంట దొరా! నన్నుగూడ అమ్ముకోకు అంటుంది. దోస్తును నిప్పులొలుకుతున్న చూపు జూస్తా డు పరమేశం. ఆ సూపును తట్టుకోలేని దోస్తు జారుకుంటాడు. తప్పు తెలుసుకున్న పరమేశం ‘సీతా.. చచ్చిన పామును కొట్టకు’ అంటూ పశ్చాత్తాపంతో సీతతో లోపలికి నడుస్తాడు. ఈ కథల్లోని సంభాషణలన్నీ తెలంగాణ భాష, యాసల సంస్కృతికి అద్దం పడతాయి. అనితరసాధ్యమైన కథారచన, శైలి, ఇతివృత్తం, రూప నిర్మా ణం, భాషాధారలన్నీ కూడా యశోదారెడ్డి ప్రత్యేక లక్షణాలు. కథలన్నీ సానుకూల మార్పును కోరుకునేవే. ఆలోచింపజేసేవే. తెలంగాణ భాష, యాస పట్ల ప్రే మను మమకారాన్ని కలిగించేవే. అసలు సిసలైన భాషతో, యాస తో కూడిన యశోదమ్మ సాహిత్యాన్ని, తెలుగు భాషా రుచి ని ఆస్వాదిద్దాం.
(ఆగష్టు 8న ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతి )
‘నాకు సాధ్యమైనంత వరకు రేడియో ప్రసంగాల ద్వారా ఈ మాట తీపిని ప్రసారం చేయడం జరిగింది. మా ఊరి ముచ్చట్లు తర్వాత ఇది రెండో కథా సంపుటి. యాస ముసుగులో దాగిన ఆణిముత్యాలను ఏరి తెలుగు సాహితీ సుందరిని అలంకరిస్తారనే ఆశతో ఈ కృషి చేయడం జరిగింది’ అన్న మన యశోదమ్మ ఆశలను, ఆకాంక్షలను అర్థం చేసుకుని, అక్కున చేర్చుకుందాం.
– డా. కొమర్రాజు రామలక్ష్మి 98492 34725