తెలుగు భాషాభిమానం లేని తెలుగు వాడు తెలుగోడు కాదు. మాతృ భాషాభిమానం అంటే ఇతర భాషలను,
ముఖ్యంగా జాతీయ భాష హిందీపై గానీ, ఇంగ్లిష్పై గానీ ద్వేషం కాదు. ఇంగ్లిష్ విశ్వ విజ్ఞానానికి కిటికీ. దాన్ని మూస్తే
మనమే చీకట్లో మగ్గుతాం. భాషాభిమానం దురభిమానంగా ముదరకూడదు. అందువల్ల, ఇంగ్లిష్ బోధనా
పాఠశాలలను, రెండో భాషగా హిందీని వ్యతిరేకించకుండానే తెలుగును బతికించుకోవచ్చు. అమ్మ భాష కమ్మదనాన్ని
కాపాడుకోవచ్చు. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలూ ఎన్ని తిన్నా అమ్మ చేతి వంటకు సరిరావు కదా!
మనం ప్రతిరోజూ ఇంట్లో, బయట మాట్లాడే దానిలో ఎంత తెలుగు ఉందో ఆలోచిస్తే తెలుగుకు పట్టిన తెగులు తెలుస్తుంది. మనం మాట్లాడే ప్రతి వాక్యంలో సగానికి పైగా ఇంగ్లిష్ పదాలు మనకు తెలియకుండానే అలవోకగా దొర్లుతాయి. రైలు, రోడ్డు (Road), సెల్ఫోన్ మొదలైన పదాలకు సరైన ప్రత్యామ్నాయ పదాలు (మారు పదాలు) లేవని నేను కూడా అనుకునేవాడిని. కానీ, దక్షిణకొరియా టీవీ సీరియళ్లు కొన్ని చూశాక మాతృభాషను ఇతర భాషా పదాలతో సంకరం చేయనవసరం లేకుండానే సుసంపన్నం చేసుకోవచ్చని తెలిసింది. వాళ్ల సీరియళ్లలో ఒక్క ఇంగ్లిషు పదం పొరపాటున కూడా దొర్లడం నేను వినలేదు. ఫోన్లో కనీసం ‘హలో’ అనే పలకరింపు వారిలో లేదు. కొరియా భాషలో ఏదో అంటారు. బహుశా ఇంతటి భాషాభిమానం మన తమిళ తంబీలకు ఉన్నదేమో నాకు తెలియదు.
తెలుగు భాషకు ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణం మన పత్రికా రచయితలు, సినిమా రచయితలు, సీరియళ్ల రచయితలు, నవలా రచయితలు, కవులు తమ శక్తివంచన లేకుండా తెలుగు భాష అధోగతికి రెండువిధాలా కృషిచేశారు. మొదటిది.. విచ్చలవిడిగా ఇంగ్లిష్ పదాలను యథాతథంగా దిగుమతి చేశారు. బహుశా, ఇది చలం నుంచి ప్రారంభమైనది. ఇంగ్లిష్ పదాలను వాడటం శైలిగా (Style) మారింది. రెండోది… ఇతర భాషా పదాలను, ముఖ్యంగా సాంకేతిక (Technical), శాస్త్రీయ (Scientific) పదాలను తెలుగులోకి అనువదించకుండా వీరు సంస్కృతంలోకి అనువదించారు.
అందువల్ల వీరు ఎంతగా సంస్కృతంలో ఏడ్చినా అవి వాడుకలో చెలామణి కాలేకపోయాయి. ‘రైలు’ అంటే ‘ధూమ శకటం’ అని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండదు. కనీసం పొగబండి అని అచ్చ తెలుగులో చెప్తే అలవాటవుతుంది- అలా పలకడం నామోషీ అనుకోకపోతే! తెలుగు భాష మీద పట్టున్న రచయితలైతే శాస్త్ర, సాంకేతిక పదాలను కుడా చక్కని తెలుగులోకి అనువాదం చేయవచ్చు. ఉదాహరణకు- Comet అంటే ‘ధూమకేతు’ అని బండకొట్టుడు కొట్టే కంటే, చక్కగా ‘తోకచుక్క’ అంటే సరిపోలేదా? మన Milkyway galaxy (నక్షత్ర సముదాయం)ని ‘పాలపుంత’ అంటే ఎంత వినసొంపుగా ఉందో కదా! అందుచేత, రచయితలు, కవులు మన సొంత భాష వాడటానికి సిగ్గుపడకుండా ఇతర భాషా పదాలను అచ్చ తెలుగులోకి అనువాదం చేస్తే పలుకుబడిగా మారే అవకాశం ఉంది.
చలనచిత్రాలు, టీవీ సీరియళ్లు, పత్రికలు ఇలాంటి తేట తెలుగు అనువాదాలను ప్రవేశపెడితే తెలుగుభాషను తెలుగుగా సుసంపన్నం చేసుకోగలం. అలా అని సంస్కృతం బొత్తిగా మానేయమని కాదు, అందరికి అర్థమయ్యే సంస్కృత పదాలున్నాయి. కానీ, మన భాషా పండితులు ఎంత బండ పదాలను వాడితే తాము అంత ఉద్దండులమనే గుడ్డి నమ్మకంతో జీవిస్తారు. చాలా ఇంగ్లిష్ పదాలను తెలుగు బాగా వచ్చినవారు చక్కగా తెలుగులో చెప్పవచ్చు. వాటిని తెలుగులో కాకుండా సంస్కృతంలో ఏడవడానికి ప్రయత్నించడం వల్లే ‘అంతర్జాలం’ (Internet) వంటి వింత జంతువులు (మార్జాలంలా) పుట్టుకువస్తాయి.
ఇది భాషా దారిద్య్రం కాదు. భావ దారిద్య్రం. మన ప్రయత్న లోపం. అందువల్ల, మన భాషను సుసంపన్నం చేసుకోవడమంటే గంపగుత్తగా ఇంగ్లిష్ పదాలను అరువు తెచ్చుకోవడం కాదని గ్రహించాలి. అయితే, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ భాషా పదాలతో మన భాష సంకరమైనదనే వంకర వాదనతో ఏకీభవించను. మన దేశ భాషలతో కలిసిన తెలుగును పలకడానికి నామోషీ (ఉర్దూ పదం-సిగ్గు) ఎందుకు? మనం చేయవలసిందల్లా, ఇంగ్లిష్ పదాలు సాధ్యమైనంత తగ్గించి తెలుగులో మాట్లాడటమే. ఇది నాక్కూడా చాలా కష్టం. కనీసం ముందు తరాలకు ఇది సాధ్యపడాలంటే మన పాత్రికేయులు, రచయితలు, కవులు కృషిచేయాలి.
తెలుగు భాషను భ్రష్టు పట్టించడంలో దృశ్య, శ్రవణ మాధ్యమాల వ్యాఖ్యాతలు తమ శక్తివంచన లేకుండా కృషిచేశారు. ఒకరిద్దరు తప్ప, చాలామంది వ్యాఖ్యాతలు ముప్పాతిక వంతు ఆంగ్ల పదాలు వాడతారు. అక్కడక్కడా తెలుగు పదాలు దొర్లుతాయి. వారికి తెలుగు రాకపోవడం అందుకు కారణం. వారి తెలుగు ఉచ్ఛారణ ఆంగ్ల ఉచ్ఛారణను అనుకరించినట్టు ఉంటుంది. అందుకు ప్రధాన కారణం వాళ్లు కాన్వెంట్ పాఠశాలల్లో చదువుకోవడం. ఇంట్లో, బయట బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడటం. (యు నో నా! You know na! అంటే నీకు తెలుసు కదా) కనీసం తెలుగులో బాలమిత్ర, చందమామ, బొమ్మరిల్లు వంటి కథల పుస్తకాలు, తెలుగులో రామాయణ, భారతం, భాగవతం, పంచతంత్ర, బుద్ధ జాతక కథలు, పలు వార్తా పత్రికలు చదివే అలవాటు వీరికి లేదు. ఇక ప్రాచీన తెలుగు కవుల గురించి, గురజాడ మొదలుకొని ఇప్పటి యండమూరి వరకు తెలుగు రచయితల సాహిత్య పరిచయం వీరికి శూన్యం.
మన సినిమాల్లో, సీరియళ్లలో, టీవీ వ్యాఖ్యానాల్లో (anchoring) తెలుగు భాష ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తాయి. తెలుగు భాషకు ఎంతగా తెగులు పట్టిందంటే… సామాన్యమైన తెలుగు పదాలను కూడా నేటితరం వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇటీవల ఒక సినిమాలో ‘గునపం ఇవ్వు’ అని నాయకుడు అడిగితే, ‘guna what?’ అని నాయిక ప్రశ్నిస్తుంది. ఇదివరకు దెబ్బ తగిలితే అమ్మ, అబ్బా అని తెలియకుండానే అనేవాళ్లు. ఇప్పుడు ‘షిట్’ అనడం నాగరికం. అలా అలవాటు చేసుకున్నారు.
మళ్లీ తెలుగు భాష వెలగాలంటే, కనీసం 3వ తరగతి వరకు మాతృభాషలోనే అన్ని పాఠ్యాంశాలు ఉండాలి. 4వ తరగతి నుంచి అన్ని పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో బోధించవచ్చు. ప్రతి ఇంట్లో అందరూ మాతృభాషలోనే మాట్లాడాలి. పాఠశాలలో, బయట వారి వారి ఇష్టం. పిల్లలకు తప్పనిసరిగా తెలుగు కథల పుస్తకాలు, తెలుగు సాహిత్యం కొంచెమైనా పరిచయం చేయాలి. తప్పనిసరిగా తెలుగు దినపత్రికలను ఇంగ్లిష్తో పాటు చదవడం అలవాటు చేయాలి. ముఖ్యంగా పత్రికా రచయితలు, కవులు పరభాషా పదాలను సులభమైన తెలుగులోకి అనువాదం చేయాలి. వాడుకలో ఇబ్బంది లేని సంస్కృతంలోకో, అచ్చ తెలుగులోకో అనువాదం చేస్తే, అది జనం నోళ్లలో నానుతుంది. పోతన, వేమన, అన్నమయ్యల పదాలు అందుకే పలుకుబడులుగా నిలిచాయి. అలా చేయగలిగితే తెలుగు భాష వెలుగుతుంది, మనగలుగుతుంది.
ఆనందేశి నాగరాజు
98488 38323