తెల్లవారకముందే
పొగమంచులో కలిసిపోయి
పంట పొలాల్లో
వాలిపోయే మా నాయన
ఆకాశంలో నక్షత్రాలు
వెలిగే సమయానికి
భూమి మీద మా
నాయన అలసిన అడుగులు
ఇంటిదారి పట్టేవి.
చీకట్లో పనేమిటని అడిగితే,
మన జీవితాలు చీకట్లోనే
తెల్లారుతాయని
చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు.
చేనులో శరీరం చెమటోడ్చినా,
మనసు మాత్రం
కొట్టంలో కట్టేసిన ఎద్దుల దగ్గరో,
ఆవుదూడల గడ్డిమీదనో,
వాలిపోయి ఉండేది.
తాను తిన్నా తినకపోయినా,
నలుగురి ఆకలి ముందు
తన ఆకలిని మడిచేసేవాడు.
బతుకులో తుపాన్లు వచ్చినా,
భయానికి చోటివ్వక,
సమస్యల కళ్లలో కళ్లేసినిలబడటం
నేర్పిన వాడు మా నాయన.
కలుపులా ఎన్నాళ్లు నిలవడం కాదు,
పంటలా పది రోజులు
పలుకుబడి ఇవ్వడమే
జీవితమని చెప్పేవాడు మా నాయన.
ఏ బడిలో చదివితే
ఇంత గొప్ప తత్వం వస్తుందో అని
అదే పనిగా ఆశ్చర్యపడేవాడిని
కానీ ఇప్పుడు అర్థమైంది,
అతని పాఠశాల చేనూ,
చెమట, ఆకలే.
అతని గురువు జీవితమే
అదీ మా నాయన.
-బసడ సంపత్ యాదవ్ ,70321 32593