భద్రాచలం నుంచి ఉత్తరాదికి వెళ్లి నింబార్కుడి బోధన మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంలో భక్తి యోగులైన కవుల పాత్రతోపాటు ఆచార్యుల పాత్ర కూడా ఉంది. అయితే అది ఎక్కువగా భక్తి ప్రచార పరంగానే కొనసాగింది. వారంతా భక్తిమార్గాన్ని కాపాడుతూ, అందులోని ప్రాముఖ్యాన్ని వివరించే పనిని చేపట్టారు. యోగులు భక్తిలో లీనమై దానిని ముక్తి మార్గంగా భావిస్తే, భగవంతునితో మనిషి సంబంధాన్ని ఆచార్యులు సిద్ధాంతీకరించారు. భక్తి దక్షిణప్రాంతం నుంచి మొదలై పక్కనున్న రాజ్యాలకు, నెమ్మదిగా భారతదేశమంతా విస్తరించింది.
ఆచార్యులు కూడా దక్షిణం నుంచి మొదలుపెట్టి ఉత్తర భారతదేశంలో వారి దృష్టికోణాన్ని ప్రచారం చేయడమే కాక, అనేక మందిని వారి భావజాలంలోకి తిప్పుకోగలిగారు.
అలా ఆచార్యులుగా ఉత్తరంలో కూడా వారి ప్రాబల్యాన్ని విస్తరించుకోవడంలో సాఫల్యమయ్యారు. వారిలో కొందరు అక్కడే స్థిరపడ్డారు. అటువంటివారిలో ముఖ్యులు శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, నింబార్కుడు, స్వామి రామానంద, వల్లభాచార్యుడు, చైతన్యుడు, నాభాదాసు మొదలైనవారు. వీరిలో నలుగురు- రామానుజాచార్యుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు, నాభాదాసు తెలుగువారే కావడం విశేషం. శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య, వల్లభాచార్య, నింబా ర్క- వీరంతా ఆచార్య పంచకంగా ప్రసిద్ధులు. ఉత్తర భారతంలో భక్తి వ్యాప్తికి వీరు తోడ్పడ్డారు.
13వ శతాబ్దపు నింబార్కుడు తత్వవేత్త, ప్రముఖ భాష్యకారుడు. అతను తెలుగు బ్రాహ్మణుడని అందరూ అంగీకరించినా, అతని పుట్టుక విషయంలో భిన్నమైన వాదాలున్నాయి. అతని తల్లిదండ్రులు జయంతి, అరుణుడు అని కొంద రు అంటే, లేదు.. సరస్వతి, జగన్నాథుడని మరికొందరన్నారు. గోదావరీ తీరంలోని వైదుర్యపట్టణం, మూర్గార పట్టణంలో (ప్రస్తుత భద్రాచలం సమీప ప్రాంతమై ఉండవచ్చు) జన్మించాడని కొందరంటే, కాదు యమునాతీరంలో అని మరికొందరు వాదించారు.
అతని అసలు పేరు నియమానంద. వేదాలు, సంబంధిత తాత్వికశాస్ర్తాలు అన్నింటిలోనూ అత ను పదహారేండ్ల ప్రాయానికే ప్రావీణ్యం సంపాదించాడు. తల్లిదండ్రుల అనుమతి తీసుకొని, నిజమైన గురువు అన్వేషణలో ప్రస్తుత యూపీలోని గోవర్ధనగిరి మథుర చేరుకున్నాడు. తరువాత గోవర్ధనగిరికి రెండు మైళ్ల దూరంలో ఉన్న వేపచెట్ల తోటలో కూర్చొని తపస్సులో లీనమయ్యాడు.
నింబార్క పేరు వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. గోవర్ధనగిరికి దగ్గరలో ఉన్న నింబ గ్రామంలో తన ఆశ్రమాన్ని ఏర్పర్చుకొని శిష్యులను తీర్చిదిద్దే కార్యక్రమం తన జీవితలక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒక రోజు ఒక జైన ముని ఆధ్యాత్మిక చర్చల కోసం అతని దగ్గరికి వచ్చాడు. సూర్యాస్తమయానికి ముందే భోజనం పూర్తిచేయడం వారి ఆచారం. స్నానానికి పోయిన అతిథి, సూర్యాస్తమయం అయిపోవస్తున్నా రాకపోయేసరికి, నిరాహారంగా అతనిని ఉంచాల్సి వస్తుందేమోనని నింబార్క ఆందోళన చెందాడు. అతిథి వచ్చేవరకూ ఆగమని సూర్యుడిని ప్రార్థించాడు. అతని తపోఫలంతో అతిథి వచ్చి ఆతిథ్యం స్వీకరించేవరకూ, వేపచెట్ల మధ్య సూర్యుడు ఉన్నట్టు కనిపించాడు. అది గ్రహించిన ఆ అతిథి, అతనికి నింబార్క నామధేయాన్ని ఇచ్చి సత్కరించాడు. నింబా అంటే వేప, ఆర్కుడు అంటే సూర్యుడు. అప్పటినుంచీ అతని పేరు నింబార్కగా స్థిరపడిపోయింది. జైన ముని రూపంలో వచ్చిన అతిథి ఎవరో కాదు, స్వయంగా బ్రహ్మేనని మరో కథనం ఉన్నది. నింబార్కుడు సకల సద్గుణ సంపన్నుడు. దయ, ప్రేమ మూర్తీభవించిన మహాత్ముడు.
నింబార్క ద్వైతాద్వైత (ద్వైతంలో అద్వైతం) సిద్ధాంతాన్ని స్థాపించాడు. దీన్ని భేదాభేద సిద్ధాం తం అని కూడా అంటారు. నింబార్క సంప్రదాయానికి హంస సం ప్రదాయమని, దేవర్షి సంప్రదాయమని, సనకాది సంప్రదాయమని మరికొన్ని పేర్లున్నాయి. ఆదిశంకరుల అద్వైత, శ్రీరామానుజుల విశిష్టాద్వైత సిద్ధాంతాలకు మధ్యేమార్గం నింబార్కది. నింబా ర్క మతానుయాయులకు రాధాకృష్ణలు ఆరాధ్యు లు. నింబార్క వచనాల ప్రకారం భగవంతుని అనంతరూపమే రాధాకృష్ణులు. ప్రేమలోని శక్తి రాధ అయితే, ప్రేమకు అధిపతి కృష్ణుడు. వారిద్దరూ విడదీయలేనివారు. నింబార్కీయులు పఠించే మంత్రం- రాధే కృష్ణ రాధే కృష్ణ కృష్ణ కృష్ణ రాధే రాధే, రాధే శ్యాం రాధే శ్యాం, శ్యాం శ్యాం రాధే రాధే.
ఆత్మను పరమాత్మగాను, దేహాన్ని లౌకిక ప్రపంచంగాను నింబార్క విశ్వసించాడు. బ్రహ్మ నియంత్రించేవాడని, ఆత్మ అనుభవించేదని, భౌతిక ప్రపంచం అనుభవించాల్సినదని బోధించాడు. నింబార్కుని తాత్విక చింతనను అనుసరించి ముక్తి అంటే – నది సముద్రంతో కలిసిపోయి తన రూపాన్ని, ఉనికిని పోగొట్టుకోవడం కాదు. సూర్యుడూ సూర్యకిరణాలలా స్వతంత్ర వైవిధ్యం లేకపోవడం. అంటే జీవం బంధ విముక్తమైన సమయంలో, తాను భగవంతునిలో ఉన్నా, తాను వేరు అనే సత్యాన్ని గ్రహించగలగడం. సాలెపురుగు తన నుంచి సాలెగూడు అల్లినట్టు, దేవుడు జీవాన్ని, జగత్తుని తన నుంచి పేనుతాడని చెప్పాడు నింబార్కుడు. ఆయన మీద, ఆయన సిద్ధాంతం మీద అనేక గ్రంథాలు వచ్చినప్పటికీ ఔరంగజేబు కాలంలో అవిధ్వం సం చేయబడటంతో నింబార్కుడి వివరాలు ఎక్కువగా తెలియకుండాపోయాయి. ఏ కొద్దిగా తెలిసినా.. అది కూడా ఆ తర్వాత కాలంలో 19వ శతాబ్దంలో తెలుసుకోగలిగారు.
ఉత్తర భారతంలో వైష్ణవ భక్తిని మొట్టమొదటిసారిగా తాత్విక కోణంలో చూపించినవాడు నింబార్కుడు. రామానుజాచార్యుల, మధ్వాచార్యుల మధ్యేమార్గం లేదా రాజీమార్గంతో, వ్యక్తి ఆత్మలకు దేవుడు సమరూపుడు ప్రత్యేకుడు రెండూనూ అని నమ్మాడు.
నింబార్కుడు రాసిన గ్రంథాలు- వేదాంత పారిజాత సౌరభం (బ్రహ్మసూత్రాల మీద సంక్షిప్త భాష్యం), దశ శ్లోకి లేదా కామధేను (జీవ, ఈశ్వర, జగత్తుల స్పష్టత కోసం రాసిన పది శ్లోకాలు), 25 శ్లోకాలున్న ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించే శ్రీకృష్ణ స్థవరాజం, సదాచార్ ప్రకాష్ (భగవద్గీత భాష్యం), 18 శ్లోకాలున్న మంత్ర రహస్య షోడశి, ప్రసన్న కల్పవల్లి, ప్రపత్తి చింతామణి, ప్రాత స్మరణ స్తోత్రం, సవి శేష్ నిర్విశేష్ శ్రీకృష్ణ స్థవం.
నింబార్కుల శిష్యుల్లో ముఖ్యులు శ్రీనివాసాచార్యులు, ఔదంబరా చార్యులు, గౌరముఖాచార్యులు, లక్ష్మణ భట్టాచార్యులు. ఈ మతంలో ముఖ్యులు పురుషోత్తమాచార్యులు, దేవాచార్యులు, సుందర భట్టాచార్యులు, కేశవకాశ్మీరీ. నింబగ్రామంలో నింబార్క మందిరం ఉంది. రాజస్థాన్లోని సాలెమాబాద్లో కూడా అతని మందిరం ఉంది. నింబార్కీయులు రాజస్థాన్, హర్యానా, మధ్య భారతంలోను, బీహార్, ఒడిషా, బెంగాల్లో ఉన్నారు. ఏటా నవంబర్లో నింబార్క జయంతిని జరుపుకొంటారు.
రామానుజునితో విభేదించినదల్లా ఉపాసన కోసం పవిత్ర భక్తికి బదులు, కృష్ణ మూలకాలకు ప్రాధాన్యతలను ఇవ్వడమే. దానినే మరింత అభివృద్ధి పరిచినవాడు చైతన్య మహాప్రభు అతని అనుయాయులు.
ముకుంద రామారావు
99083 47273