ఆత్మగౌరవ పోరాటాన్ని, కుల నిర్మూలన ఉద్యమాన్ని ఒక ఉద్యమంగా నడిపి అట్టడుగు వర్గాల బతుకుల్లో విద్యాకాంతుల్ని ప్రసరింపజేసిన విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిబాఫూలే.ఆయన గురించి ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘ కవిత ‘బహుజన బావుటా’. భారతదేశంలో అంటరానితనంపై, కుల వివక్షపై, విద్య ఆవశ్యకతపై గళమెత్తిన మొట్టమొదటి సంఘసంస్కర్త, యుగపురుషుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే.
ఆయన స్థాపించిన ‘సత్యశోధక్’ సమాజంతో మహారాష్ట్రలో పలు మార్పులు సంభవించాయి.సమానత్వం కోసం, మానవీయ విలువల పరిరక్షణ కోసం నిరంతరం పరితపించిన మహనీయుడు జ్యోతిబాఫూలే. ఆయన చేసిన అపార పోరాటపటిమను గూర్చి త్యాగమయ జీవనాన్ని గూర్చి, సంఘసంస్కరణ దృక్పథాన్ని గూర్చి వనపట్ల సుబ్బయ్య ఈ దీర్ఘ కవిత ద్వారా తెలియజేశాడు. సుబ్బయ్యకు ఇప్పటికే ఆరు దీర్ఘ కవితలు రాసిన అనుభవం ఉన్నది. ఇది ఏడవ దీర్ఘకావ్యం. దీన్ని సాహిత్య అకాడమీ ప్రచురించింది. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నట్టు పాఠకుల్ని తన వెంట నడిపించే గుణం సుబ్బయ్య కవిత్వానికి ఉన్నది.
కాళ్లకు కత్తులు కట్టుకొని కాటేస్తున్న కులోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి కర్మసిద్ధాంతం కాదు, బతుకుసిద్ధాంతం కావాలని, తలరాతలు కాదు బతుకు రాతలు మారాలన్న మహోదయుడుగా జ్యోతిబాఫూలేను కీర్తించిన విధానంలో ఏమాత్రం అవాస్తవం లేదు. నేలకు పున్నమి వెలుగుగా,తొలి హరితగీతంగా, తొలి యుద్ధగానంగా ఫూలేను కీర్తించాడు. ఆకాశానికి పూసిన సూర్యపుష్పంగా, నాగభూమిలో మొలిచిన జ్ఞానపరిమళంగా,ఆధునిక వైతాళికుడిగా ఫూలే కీర్తించబడ్డాడు.
ఈ కావ్యం ప్రారంభంలోనే ఈ విధంగా చెప్పి పాఠకుల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేటట్లు కవి చేసిన విధానం బాగుంది. ‘కుల సర్పాలు/ బతుకు సూర్యుడిని మింగినప్పుడు/ ఒక వేగుచుక్క పొడిచింది కుల మత వైషమ్యాలు సామాన్యుల బతుకును బుగ్గిపాలు చేసినప్పుడు ఒక వేగుచుక్కలా జ్యోతిబాఫూలే ఉదయించాడు’ అని కవిత్వీకరించారు. అంధకారానికి అక్షరమే ఆయుధమని అడుగడుగున చదువులను పంచి, దేహాన్ని చెలిమె చేసి అట్టడుగు జనుల దూప తీర్చిన మహోన్నతమూర్తిగా జ్యోతిబాఫూలే ను కీర్తించాడు కవి. తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పించి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబాఫూలేకు దక్కుతుంది. కులాల పునాదులను కూల్చి, కింది కులాల విముక్తికై సంకెళ్లను తెంచి, స్వేచ్ఛకు పురుడు పోసి, మానవ హక్కులను దోసిట్లకు వొంపిన ఆధునిక సామాజిక విప్లవ పితామహుడు జ్యోతిబాఫూలే.
జ్యోతిబాఫూలే రాసిన గులాంగిరి ద్వారా పురాణాల్లో ఉన్న వాస్తవాల్ని, అవతారాల రహస్యాల్ని, కులాల ఉన్మాదాన్ని బట్ట బయలు చేసిన విధానాన్ని కవి ఇలా చెప్పాడు. ‘అంటు ముట్టు మంటల్ని/ పురాణాల అవతారాల్ని/ పౌరాణిక క్రూర రూపాల్ని/ దోపిడీ వర్గ కువ్వారాల్ని/ అడుగడుగున పొట్టు పొట్టు పల్గజీరి/ సామాజిక వికాసానికై/ గళమెత్తిన మహాజన ధ్రువతార’ అంటూ దోపిడీ వర్గ కుతంత్రాలని చీల్చి చెండాడిన విధానాన్ని స్పష్టంగా తెలియజేశాడు.
‘గులాంగిరి’ని వర్ణ వ్యవస్థల గుండెల్లో డైనమెట్గా అభివర్ణించాడు. నల్లకలువల నవ్వులకై, గడ్డిపూల గెలుపుకై, గిజిగాళ్ళ పలుకుకై, హద్దులు లేని పొద్దుకై గుండె చూపి నడిచిన త్యాగాల తొలి అడుగు, తొలి వేగుచుక్క జ్యోతిబాఫూలే అని ప్రస్తావించడం బాగున్నది. మనిషిని దేవునిగా ప్రేమించిన వాడు, అసత్యాన్ని అసత్యంగా, సత్యాన్ని సత్యంగా శోధిం
చినవాడు, స్వచ్ఛమైన మనిషి, అచ్చమైన మనిషి, మట్టి మనిషి, మహా మనిషి జ్యోతిబాఫూలే అని ఆయన సహజ వ్యక్తిత్వాన్ని కండ్ల ముందు సాక్షాత్కరింపజేశాడు. అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్న రోజు ల్లో వాటిని నిర్మూలించాలంటే విద్య అనే వెలు గు అవసరమని భావిం చి అట్టడుగు వర్గాల వారికి బడులను ఏర్పాటు చేసి విద్యను నేర్పిం చి జ్ఞానమయ జీవులుగా తీర్చిదిద్ది వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింపజేసిన జ్ఞాన భాస్కరుడు. ఇదే విషయాన్ని కవిత్వీకరిస్తూ కవి ఇలా అం టాడు. ‘మూఢనమ్మకాల పెను చీకట్లపై / చైతన్యాన్ని రగిలించి/ దశావతారాల లోగుట్టును తూర్పారబట్టి/ సత్యాన్ని సూర్యుడిలా వెలిగించిన మహాదేవుడు ’ అని అద్భుతంగా చెప్పాడు.
విద్యను సామాన్యులకు దక్కకుండా చేసిన దుర్మార్గపు కాలంలో బానిసలుగా సామాన్యులు బతుకు ఈడుస్తున్న సందర్భంలో ఎంతటి దుర్మార్గాన్నైనా కూల్చేసే ఆయుధం విద్యయేనని, ఆ విద్యను అందరికీ నేర్పించడం కోసం పాఠశాలలు నెలకొల్పడం, ముఖ్యంగా వంటింటికే పరిమితమైన మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలలను నెలకొల్పి వారికి విద్యను అందించి చైతన్య వంతుల్ని చేసిన ఘనత ఫూలే సొంతం. వర్ణ కట్టుబాట్లను బద్ద లు చేసిన ఫూలేను మనువాదులు హెచ్చరించి భయపెట్టి వెలేసినా బహుజనులకు చదువు చెప్పి వారికి బంధువుగా మారి భారత దేశ చరిత్రను మార్చినవాడు జ్యోతిబాఫూలే. నిమ్న వర్గాలకు జ్ఞాన ద్వారాల్ని తెరిచిన ఆధునిక భారతీయ తొలి సామాజిక తత్త్వవేత్తగా తేల్చి చెప్పాడు.
అక్షరమక్షరం శరమై కులాల దుర్నీతిని చీల్చినవాడుగా, అవతారాల గుట్టు విప్పిన బహుజన తాత్త్వికుడుగా, స్త్రీల ఆత్మగౌరవ ప్రబోధకుడుగా, అసత్యాలను సమాధి చేసిన సత్యమూర్తిగా, సమతామూర్తిగా జ్యోతిబాఫూలేను కీర్తించాడు సుబ్బయ్య. స్త్రీల హక్కులే మానవ హక్కులని విప్లవించిన సామాజిక వైతాళికుడు ఫూలే. చీకటికి నిప్పంటించి నిచ్చెన మెట్ల కండ్లు తెరిపించి దురాచారాలకు పొగబెట్టి శాస్త్రీయతకు పాదువేసిన తొలి సంఘసంస్కర్త జ్యోతిబాఫూలే. ఆయన ఈ దేశ ఆధునిక వైతాళికుడు, అస్తమించని రవి చంద్రుడు, మహర్షి, మహాత్యాగి, కర్మయోగి, క్రాంతదర్శి. భారతావనిలో ఒక వెలుగు పుట్టినరోజుగా, తిరుగుబాటు జెండా ఎత్తిన రోజుగా, పేదల స్వప్నం ఫలించిన రోజుగా ఫూలే పుట్టినరోజును అభివర్ణించాడు వనపట్ల సుబ్బయ్య.
ఫూలే సతీమణి సావిత్రీబాయి జన్మ నేపథ్యాన్ని ఇలా ప్రస్తావించాడు కవి. ‘అజ్ఞానాంధకారం/ చిత్రహింసలతో ధరణి తల్లడిల్లుతున్న సమయం/ దిగ్గున ఓ మెరుపు మెరిసింది/ ప్రశ్న నేరమైన చోట/ ఒక పువ్వు పూసింది/ మాట్లాడడమే విషాదమైన చోట/ ఒక ధిక్కారం తలెత్తింది’ అని సావిత్రిబాయి జననాన్ని కవిత్వీకరించిన విధానం బాగున్నది. స్త్రీలకు చదువు చెప్పడానికి వెళుతున్న సావిత్రిబాయి ఫూలేను రకరకాల అవమానాలకు గురి చేశారు మతిదప్పిన ఛాందసవాదులు. ఆమెపై పేడ చల్లిండ్రు, అనరాని, వినరాని బూతులు తిట్టినప్పటికీ ఏమాత్రం చలించకుండా తాను మాత్రం స్త్రీలకు చదువు చెప్పడంలో సఫలీకృతురాలైంది. సావిత్రిబాయి పోరాటాన్ని కీర్తిస్తూ, ‘బహిష్కృతులకు బతుకు దీపమై/ అందని అక్షరాన్ని నేలకు దింపింది/ అలల మీద పడవై వేదాగ్నిలో సావిత్రియై/ అట్టడుగు ఆత్మగౌరవాన్ని ఆకాశంపై నిలిపింది’అంటాడు కవిత్వంలో. ఈ దంపతుల చరిత్రను ఎన్నో ఏండ్లు కప్పివేయడం జరిగిందని, వారు ఇంకా ఇప్పుడిప్పుడే తమ అస్తిత్వం కోసం పాటుపడుతున్నారంటాడు కవి. ‘మానవీయం మోడు వారిన భూమిలో/ మానవత్వ వనాల్ని పూయించి/ ధర్మంలేని భరతభూమిన/ తన కొంగే ధర్మసాల/ వితంతువుల గర్భాలకు పురుడు పోసిన మాతృమూర్తి’ అంటూ సావిత్రిబాయి వ్యక్తిత్వాన్ని చక్కగా చాటిచెప్పారు.
చాతుర్వర్ణ వ్యవస్థ గురించి కవి ఇలా అంటాడు- ‘మేమెవరి కాళ్ల నుంచి/ చేతుల నుంచి పుట్టలేదు/ మే మెవరి మొఖాల నుంచి/ నోటి నుంచి బొడ్ల నుంచి ఊడిపడలేదు’. బహుజన వెలుగు బావుటాగా, సాం స్కృతిక విప్లవంగా, దీనజన బాంధవునిగా జ్యోతిబాఫూలేను ప్రస్తావిస్తూ అస్తిత్వపు దారు ల్లో బహుజన బావుటాను ఎగిరేసిన సుబ్బయ్య సర్వ దా అభినందనీయుడు.
-డాక్టర్ తండు
కృష్ణ కౌండిన్య 97047 31346