ఒక దేశ సంస్కృతి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభావితం చేస్తుంది. సంస్కృతిలో సాహిత్యం, కళలూ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇవి వ్యక్తుల మానసిక జగత్తుతో సంపర్కించి, వ్యక్తి చేతనను తీర్చిదిద్దడంలో దోహదపడతాయి.
ఒక కళాకారుడు తన చేతనతోనూ,బాహ్య జగత్తుతోనూ సంఘర్షించి, తనను తాను సంస్కరించుకున్నప్పుడే ఉత్తమ సృజన వెలువడుతుంది. అలా సృజింపబడ్డది ఆ ప్రజల సంస్కృతిని, సంస్కారాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే కళాకారుడికి తన సృజన పట్ల గురుతర బాధ్యత ఉన్నది. సాహిత్యం సంస్కృతిలో భాగం గనుక, సాహితీకారులకు జీవితం పట్ల, తాము చేసే సృజన పట్ల బాధ్యత, నిబద్ధత చాలా ఆవశ్యకం. సాహిత్యం జీవితం విలువను తెలియజేయాలి. మానవ సంబంధాల పట్ల, జీవితం పట్ల సానుకూల దృక్పథం కలుగజేయాలి. ప్రేమ, జీవితం, సమాజం పట్ల గౌరవం కలిగించాలి. జీవితం ఎంత వేదనాభరితమో తెలియజేస్తూనే, జీవితం ఔన్నత్యాన్నీ, జీవితం విలువను ఎరుకపరచాలి. అప్పుడే వ్యక్తి జీవితాన్ని సమర్థవంతంగా గడపగలుగుతాడు. అందుకే సాహిత్యం సమాజం హితం కోరుతుందని అంటారు. అలా సాహిత్యకారుడు సాహిత్య విలువలను కాపాడినప్పుడే అతని సాహితీ వ్యాసంగానికి ఔచిత్యం,విలువ సిద్ధిస్తాయి. అదే అతని పరమ ధర్మం కూడా!
– దండమూడి శ్రీచరణ్