దాదాపు రెండు శతాబ్దాల పాటు తెలుగు నేలను అప్రతిహతంగా పరిపాలించిన రాజవంశం కాకతీయులు. ఆంధ్రదేశమే కాకుండా దక్షిణాన తమిళనాడులోని కంచి వరకు; పశ్చిమాన కర్ణాటకలోని రాయచూరు, బీదర్ వరకు; తూర్పున కళింగ దేశం వరకు విస్తరించబడిన ఈ మహా సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో తెలంగాణ ఘనతను చాటింది. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయ రాజ్యంలో సాహిత్య కళారంగాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. కాకతీయుల వాస్తు నైపుణ్యానికి నేటికీ సజీవసాక్ష్యంగా నిలిచిన దేవాలయాలు నాటి శిల్పుల ప్రతిభను చాటుతున్నాయి.
నాటి వ్యవసాయం, నీటిపారుదల, ప్రజల సాంఘికజీవనం కాకతీయుల వైభవోపేతమైన పరిపాలనకు నిదర్శనం. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో విశేష సాహి త్యం ఈ కాలంలోనే వచ్చింది. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యం రాసి ఆదికవిగా పరిశోధకులచే గుర్తించబడిన పాల్కుర్కి సోమనాథుడు కాకతీయుల కాలం వాడే. ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తిలో జీవించిన ఈ కవి పూర్తి లక్షణాలు కలిగిన తొలి తెలుగు శతకం ‘శృషాధిప శతకం’ రాశారు. అనుభవసారం, చతుర్వేదసారం, అష్టోత్తర శతనామ గద్య, అక్షరాంక గద్య, నమస్కార గద్య, పంచ ప్రకార గద్య, రుద్ర బసవ గద్య, శరణు బసవ గద్య, గంగోత్పత్తి రగడ, చెన్నబసవ రగడ, సద్గురు రగడ, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, చెన్నమల్లు సీసములు, బసవోదాహరణం, సోమనాథ భాష్యం మొదలైన అనేక గ్రంథాలను తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో రచించారు.
పాల్కుర్కి సోమనకు పూర్వమే శైవ కవిత్రయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, మల్లిఖార్జున పండితారాధ్యులు కాకతీయుల కాలంలో ప్రసిద్ధికెక్కిన సాహితీమూర్తులు. శ్రీపతి పండితుడి గ్రంథాలు అలభ్యం. కానీ, మల్లిఖార్జున పండితుడు శివతత్వసారంలో శ్రీపతి పండితుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఇతడు కాకతీయరాజు రెండవ ప్రోలరాజు కాలం వాడని తెలుస్తున్నది.
పాల్కుర్కి సోమనాథుని బసవ పురాణంలో ప్రస్తావించబడిన కవి శివలెంక మంచన. శివలెంక గ్రంథాలు కూడా అలభ్యం. శైవ కవిత్రయంలో చివరివాడు మలిఖార్జున పండితుడు. కాకతీయ రుద్రదేవుని సమకాలీకుడు. ఇతని సుప్రసిద్ధ గ్రంథం ‘శివతత్వసారం’. సమరేశ్వర అష్టకం, లింగోద్భవ దేవుని గద్య, శ్రీముఖ గద్య మొదలైన గ్రంథాలు కూడా రచించినట్లు తెలుస్తున్నది. కాకతీయ రాజ్యపాలకుడు రుద్రదేవుడు గొప్ప సాహిత్య పోషకుడే కాకుండా కవిగా కూడా సుప్రసిద్ధుడు. విద్యాభూషణ బిరుదాంకితుడైన ఈ కవిరాజు ‘నీతిసారం’ అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలోని గద్యాలు మడికిసింగన ‘సకలనీతి సమ్మతం’లో గమనించవచ్చు. కవిరాజు ‘ఉషా పరిణయం’ అనే సంస్కృత నాటకాన్ని కూడా రాసినట్లు తెలుస్తున్నది. క్రీస్తుశకం 1242లో ‘సర్వేశ్వర శతకం’ రాసిన యధావాక్కుల అన్నమయ్య కూడా కాకతీయులకాలం వాడే. గణపతిదేవ చక్రవర్తి సామంతరాజు భద్ర భూపాలుడు ఈ కాలంలో చెప్పుకోదగ్గ మరో గొప్పకవి. ఇతనే బద్దెనగ సుప్రసిద్ధుడు. ‘నీతి శాస్త్ర ముక్తావళి’, ‘సుమతి శతకం’ ఇతని సుప్రసిద్ధ గ్రంథాలు.
గణపతిదేవ చక్రవర్తి మహామంత్రి శివదేవయ్య ప్రథమ సంస్కృతాంధ్ర కవితా పితామహుడిగా విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ‘పురుషార్థసారం’ అనే రాజనీతి గ్రంథాన్ని, ‘శివదేవ ధీమణి’ శతకాన్ని రాశారు.తొలితెలుగు రామాయణం ‘రంగనాథ రామాయణం’ రచించబడింది కాకతీయుల కాలంలోనే. రుద్రమదేవి కాలంలో కాకతీయుల సామంత రాజు గోనబుద్ధారెడ్డి ద్విపదలో రాసిన ‘రంగనాథ రామాయణం’ ప్రసిద్ధి పొందినది. ఇతని కూతురు కుప్పాంబిక భూత్పూర్ శాసనం రచించినట్లు తెలుస్తున్నది. తొలి తెలుగు కవయిత్రిగా కుప్పాంబికను పరిశోధకులు పేర్కొనడం గమనార్హం. కాకతీయుల సామంతరాజు మనుమసిద్ధి ఆస్థాన కవి తిక్కన. మనుమసిద్ధి రాజ్యంపై అక్కన, బయ్యన అనే దాయాదులు దాడిచేసి రాజ్య భ్రష్టుని చేసినప్పుడు మనుమసిద్ధి ఆస్థాన మంత్రి అయిన తిక్కన ఓరుగల్లుకు వచ్చి గణపతిదేవునికి తాను రచించిన 15 పర్వాల భాగవతాన్ని వినిపించి గణపతి దేవుడి సహాయంతో అక్కన, బయ్యనలను ఓడించి మనుమసిద్ధికి మళ్లీ రాజ్యం ఇప్పించాడని సిద్దేశ్వర చరిత్రలో కనిపిస్తుంది. ఏదేమైనా కాకతీయుల సమకాలికుడైన తిక్కన తెలుగు సాహిత్యానికి చేసిన మేలు అనన్య సామా న్యం. ‘మహాభారతం’తో పాటు ఇతని ‘నిర్వచనోత్తర రామాయణం’ కూడా సుప్రసిద్ధమైనది. తిక్కన శిష్యుడైన మూలఘటిక కేతన కాకతీయుల కాలం వాడే. సంస్కృతంలో దండి రాసిన ‘దశకుమార చరిత్ర’ను కేతన తెలుగులోకి అనువదించి ‘అభినవ దండి’ అనే బిరుదును పొందాడు. తొలి తెలుగు వ్యాకరణం ‘ఆంధ్రభాషా భూషణం’ రచించాడు. ‘విజ్ఞానేశ్వరీయం’ అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశారు.
కాకతీయుల కాలంలో జాయపసేనాని సంస్కృతంలో నాట్యశాస్త్ర గ్రంథమైన ‘నృత్తరత్నావళి’ రచించారు. ఇతని మరొక గ్రంథం ‘గీత రత్నావళి’ అలభ్యం. తొలి తెలుగు పురాణం ‘మార్కండేయ పురా ణం’ రాసిన కవి మారన. తిక్కన శిష్యుడు. ప్రతాపరుద్రుని గన్నయ మహాసేనానికి మార్కండేయ పురాణం అంకితం ఇచ్చాడు. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ ఇతని మరొక ప్రసిద్ధ రచన. భాస్కర రామాయణాన్ని రాసిన కవుల్లో ఆద్యుడు హుళక్కి భాస్కరుడు. అయ్యలభట్టు, మల్లిఖార్జున భట్టు, కుమార రుద్రదేవుడు భాస్కర రామాయణాన్ని పూర్తిచేసిన కవులు. ఈ గ్రంథాన్ని ప్రతాపరుద్రుడి సైన్యాధ్యక్షుడు సాహిణి మారనకు అంకితం ఇచ్చారు. ప్రతాపరుద్రుని ఆస్థానంలోని మరొక ప్రసిద్ధ కవి శరభాంక లింగకవి. ‘శరభాం క లింగ శతకం’ రాశారు. ప్రతాపరుద్ర యశోభూషణం రాసిన విద్యానాథుడు కాకతీయుల కాలంలో సుప్రసిద్ధ సంస్కృత కవి. వీరేకాకుండా క్షేమేంద్రుడు, అప్పన మంత్రి, వేములవాడ భీమకవి మొదలైన కవులు కూడా కాకతీయుల కాలం వారేనని వారి అనంతర కవుల రచనల ద్వారా తెలుస్తున్నది.
కాకతీయుల కాలంలో తెలుగు సాహిత్యం వైభవంగా విలసిల్లిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్ర మే. కాకతీయుల కాలంనాటి సాహిత్య వైభవంపై మరింత లోతైన పరిశోధనలు జరగవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ నేల నుంచి తెలుగు భాషకు సుసంపన్న సాహిత్యాన్ని అందించిన కాకతీయ కవులు సదా స్మరణీయులు.
– సాగర్ల సత్తయ్య, 79891 17415