కాకతీయ వంశజుల సామంతరాజుల్లో మల్యాల వంశీయులు ఒకరు. వీరు సాటి రేచర్ల, చెఱకు, విరియాల, నతవాడి, కోట, కాయస్థ, గోన వంశీయులతో పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పటిష్ఠపరచడానికి కృషి చేశారు. గణపతిదేవుని కాలంలో వీరు చాలా సేవలందించారు. సంకీసపురం, వర్ధమానపుర రాజ్యాలను పాలించారు. అవిప్పుడు ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్నాయి.
ఈరాజుల్లో దన్నసేనాని, సబ్బసేనాని, కాటసేనాని, చౌండసేనాని, గుండదండాధీశుడు ముఖ్య పాలకులుగా ఉన్నారు. బాచాంబ, బాచవరూధినీశుల కుమారుడైన గుండదండాధీశుడు కాకతి గణపతిదేవుడు, రుద్రమదేవిల పాలనలో సామంతునిగా, దండనాయకునిగా ఉన్నాడు. తన పాలనాకాలంలో వర్ధమానపుర శాసనం, రెండు బూదపుర శాసనాల వేయించాడు. తన తల్లి పేర, రెండు బూదపుర శాసనములు, ప్రభువైన గణపతిదేవుని పేర తటాకాలను నిర్మించాడు. భూ దానం చేసి శాసనాలు వేయించాడు. శాసనకాలం శ.సం.1181= క్రీ.శ. 1259. మరొకటి శ.సం. 1194=క్రీ.శ. 1272.
మొదటి శాసనం సిద్ధార్థి సంవత్సరం
చైత్రశుద్ధ త్రయోదశినాడు తమ తల్లి బాచాంబ పేరుమీద బూదపురం సమీపంలో తటాకం నిర్మించాడు. అదే సమయంలో ఈ ప్రదేశంలోనే ధర్మానికై ఈ చెరువుకు సమానమైన భార్య కుప్పాంబిక పేర కుప్ప సముద్రాన్ని నిర్మింపచేశాడు. ఈ చెరువు ఒడ్డునే తన, తన భార్య పేర రెండు దేవాలయాలను నిర్మించాడు.
ఈ శాసనం చెప్పిన ఈశ్వర భట్టోపాధ్యాయునికి గుండన ఆచంద్రార్కస్థాయిగా కుప్ప సముద్రం వెనక పాతిక మరుతుర్లు నీరు పొలం, 10 మరుతుర్లు వెలిపొలాన్నిచ్చాడు. ఇట్లా దానం చేయబడినదంతా తర్వాతి రాజులందరూ ఎల్లప్పుడూ రక్షించాలనే ప్రార్థన కూడా ఉన్నది. ఇంకా శాసనం చివరలో చక్రబంధం ఉన్నది. ఇందులో రెండవ వలయంలో తడాగం పేరు, నాలుగో వలయంలో గుండవీరనుతి పేరు, ఏడో వలయంలో ఈశ్వరార్య కృతము అని పేర్కొనబడి ఉన్నది. ఈ కవి కావ్య కథానాయిక కబ్బంబై చక్రబంధాన్ని రచించినట్టు పేర్కొనబడింది. శాసనాన్ని లిఖించినవాడు బద్దయ.
శాసనాన్ని వేయించిన గుండదండాధీశుడు చాలా విశేషంగా వర్ణించబడ్డాడు. బాచాంబిక, బాచ చమూపతులకు పరాక్రమశాలి, శత్రువులనే మత్త మాతంగాలను చీల్చే సింహం వంటి గుండయ చమూపతి జన్మించినట్లు, అతడు యుద్ధభూమిలో శత్రువీరులను ఓడించి శివపాదాలను అలంకరిస్తాడని, ప్రజల దీవెనలు పొంది ఎల్లప్పుడూ ఉత్తమ మార్గాన్ని అవలంబిస్తాడని పేర్కొన్నారు. ఇంకా అతడి కీర్తికాంత ఎప్పుడూ పండితులతో, సూర్యచంద్రుల ప్రకాశంతో దిక్కాంతలతో కూడి అతని రాజ్యరంగంలో నర్తిస్తుందట. గరుడుడిని చూసిన పాములు ప్రాణభీతిచేత త్వరగా పుట్టలోకి పోయినట్లు అసంఖ్యాకమైన శత్రువర్గం గుండని పతాకాన్ని చూసి భయపడి ప్రాణరక్షణ కోసం కొండ గుహలల్లో దాచుకొంటున్నారట. ఇంకా శత్రువర్గంవారు అస్త్ర సన్యాసం చేసి జుట్టు ముడివేసుకొని యుద్ధభూమిలో అతని పాదాలకు నమస్కరిస్తారట.
గుండదండాధీశుడు తవ్వించిన బాచా సముద్ర గొప్పతనం వర్ణించబడింది. మానస సరోవరాన్ని మరిచిపోయి హంసలు ఈ చెరువులో విహరిస్తున్నాయట. బాటసారులు ఈ తటాకంలో దప్పిక తీర్చుకొని, అక్కడున్న చెట్ల నీడలో విశ్రమించి శ్రమ తీర్చుకొంటూ ‘అగాథమై, అపారమై ఒప్పే ఉప్పు నీటితో, బడబానలంతో ఉన్న సముద్రం చల్లని రుచిగల నీటితో ప్రపంచానికి సుఖాన్నిచ్చే ఈ జలాశయంతో ఎట్లా సరితూగగలదు’ అని మాట్లాడుకుంటున్నారట.
ఆశ్చర్యకర విషయమేమంటే ఈ తటాకం పవి త్ర సంతానవృక్షం వంటిది. సంతాన ఫలాన్ని ఆశించేవారికి ఇది ఇహపరాలందు ఫలాన్ని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా ఈ తటాక పరిసర ప్రాంతం వరి పంటతో సస్యశ్యామలమై కర్షకులకే కాదు, అన్ని ప్రాణులకు మనోహరంగా కనిపిస్తుందని వర్ణించబడింది. శాసనంలో వర్ణనలు ఎక్కువగా ఉండి శాసనకవి ఈశ్వర మయూర భట్టోపాధ్యాయుని పాండిత్యం
కనబడుతుంది.
– భిన్నూరి మనోహరి