శతక సాహిత్య నందనవనంలో వికసించి తెలుగు నేల నలుచెరుగులా భక్తియుత సుగంధాన్ని వ్యాపింప జేసిన కుసుమాలు నరసింహ, శ్రీకృష్ణ శతకాలు. వాటి పుట్టినిల్లు జగిత్యాల జిల్లాలోని ప్రాచీన పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణం. ధర్మపురికి చెందిన శేషప్ప కవి విరచిత నరసింహ శతకంలోని సీస పద్యాలు గతంలో తెలుగు నాట ప్రతి ఇంటా సుపరిచితమైన పద్యాలే.
సీ. తల్లి గర్భమునుండి ధనముదేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమెగాని
మెరుగు బంగారంబు మింగబోడు
విత్తమార్జనజేసి విర్రవీగుటేగాని
కూడబెట్టిన సొమ్ము గుడువబోడు!
అంటూ సాగుతుంది ఈ పద్యం.
ఇక సమాజంలోని కులాలకు భగవంతుడి దృష్టిలో విలువేలేదని, ఆయన ముందు అన్ని కులాలు సమానమేనని, తెలియజేసిన పద్యం..
సీ. వ్యాసుడేకులమందు వాసిగా జన్మించె?
విదురుడేకులమందు వృద్ధిబొందె?
కర్ణుడేకులమందు ఘనముగా వర్ధిల్లె?
నా వశిష్టుండెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబున బుట్టె?
గుహుడనుపుణ్యుడే కులము వాడు ?
శ్రీ శుకుండెచ్చట జెలగి జన్మించెను?
శబరి యే కులమందు జన్మమొందె?
తే. నే కులంబున వీరందఱొచ్చినారు?
నీ కృపాపాత్రులకు జాతినీతులేల?
భూషణ వికాస! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
అదేవిధంగా కాకుత్సం నరసింహదాసు విరచిత శ్రీకృష్ణ శతకంలోని ఈ కింది పద్యాలు తెలుగు ప్రజలకు సుపరిచితమే.
కం. నీవే తల్లివి దండ్రివి, నీవే నాతోడు నీడ
నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము,
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!
కం.దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళ నేత్ర
హరీ దండమయా కరుణానిధి
దండమయా నీకునెపుడు
దండము కృష్ణా
చరిత్రకారుల పరిశోధనల ప్రకారం శేషప్ప క్రీ.శ.1735-1825 కాలానికి చెందిన కవి. ఈ కవి పూర్వీకులు తెలంగాణకు చెందిన నిర్మల్ జిల్లాలోని మోటాపూర్కు చెందినవారు. శేషప్ప మాత్రం ధర్మపురికి చెందినవాడు. తొలుదొలుత శేషప్ప శ్రీ లక్ష్మీనరసింహాలయంలో సంవత్సరానికి మూడు రూపాయల వేతనంతో దీప రక్షకుడిగా నియమించబడినాడు. ఈయన రచించిన శతకాలు మూడు. అవి నరసింహ, నరహరి, నృసకేసరి శతకాలు. ఇవి మాత్రమే కాకుండా ఈ కవి రచించిన ధర్మపురి రామాయణ యక్షగానం ఎంతో ప్రఖ్యాతి గాంచిన రచన. ఇందులో 252 పాటలు, 34 రకాల రాగాలు, 110 ద్విపదలు, 290 తేటగీతులు, 27 సీస పద్యాలు, 67 కందపద్యాలు ఉన్నాయి. వచన రహిత యక్షగానంగా ఈ రచన గోచరిస్తుంది..
శేషప్ప వేతనం ఆయన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. అంతేకాదు ఆ వేతనం కూడా సరైన సమయంలో లభించక ఎంతో బాధపడేవాడాయన. ఆ బాధాతప్త హృదయంతో కువలయ శ్యామ! నీ కొలువు జేసిన నాకు జీతమెందుకు ముట్టజెప్పవైతి? అంటూ మొరబెట్టుకున్నా డు. ఇక, ఒకసారి గోదావరి వర దల్లో ఆయన ఇల్లు కొట్టుకొని పోయింది. దానితో గంగ ఒడ్డున ఇల్లు కట్టినట్టు అంటూ బాధపడ్డాడు. భక్తియుత ఆత్మసమర్పణా భావంతో సాగిన నరసింహ శతకం మానవాళికి హితోపదేశం చేస్తూ సన్మార్గాన్ని సూచిస్తుంది. అంతేకాదు నాటి సమాజంలోని అవకతవకల్ని ఎత్తిచూపుతూ సమాజంలోని వివిధ తప్పులకు బాధ్యులెవరో తెలియజేస్తుంది.
ఈ శతకం ఏ సంవత్సరంలో రచించారో తెలియనప్పటికీ తొలి ముద్రణ క్రీ.శ.1868లో అయినట్టు తల్లావజ్జల శివశంకరశాస్త్రి తెలిపారు. మలి ముద్రణ 1909లో ఆర్.వెంకటేశ్వర్ అండ్ కంపెనీ నుంచి వెలువడింది. మరొక ముద్రణ వెస్ట్ వార్డ్ అండ్ కంపెనీ వారు 1932లో ముద్రించారు. ఆ తర్వాత ఆనాటి సాహి త్య అకాడమి, గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్, బాల సరస్వతి బుక్ డిపో, పావని సేవా సమితి, వసుంధరా పబ్లికేషన్స్ లాంటి అరవైకి పైగా సంస్థలు ఈ శతకాన్ని ముద్రించాయి. అంతేకాదు మహా సంస్కృత విద్వాంసులు చిట్టి గూడూరు వరదాచార్యులు, ఆచార్య రవ్వా శ్రీహరిలు ఈ శతకాన్ని సంస్కృతంలోకి అనువదించారు. ఇక ఎస్.లక్ష్మి నరసింహశాస్త్రి కన్నడంలోకి, కె.రంగారావు తాత్పర్యాలతో ఆంగ్లంలోకి అనువదించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శతక పద్యాలను కమనీయంగా పాడి క్యాసెట్లు విడుదల జేశారు. ఈ విధంగా వివిధ వ్యక్తుల, సంస్థల కృషితో ఈ శతకం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ధర్మపురి గోదావరి వరదల్లో కొట్టుకొని పోయినప్పుడు నరసింహదాసు గంగపాట రచించాడు. రోహిల్లాలు క్రీ.శ. 1858 లో ధర్మపురిని దోచుకొన్నప్పుడు రొహిల్లాల పాట రచించాడు. తెలుగు తిథుల ప్రకారం కాళయుక్తి నామ సంవత్సర కార్తీక బహుళ దశమి నాడు రోహిల్లాలు ధర్మపురిని దోచుకొన్నారు. ఈ పాటలో రోహిల్లాల దురాగతాల్ని వివరించారు.
ఇక కాకుత్సం నరసింహదాసు రచించిన శ్రీకృష్ణ శతకం కూడా తెలుగునాట బహు ప్రఖ్యాతి గాంచింది. నరసింహదాసు కూడా ధర్మపురి క్షేత్రానికి చెందినవాడే. శేషప్ప కవికి మనుమడు. ఈయన క్రీ.శ.1800-1860 కాలానికి చెందినవాడు. శేషప్ప కూతురు గం గమ్మ కొడుకు. ధర్మపురిలోని ఈయన వంశీకులింటిలో చరిత్రకారులకు కొన్ని రచనలు లభించాయి అందులో యావదాంధ్ర ప్రసిద్ధ శ్రీకృష్ణ శతకం, మైరావణ చరిత్రము, (యక్ష గానము), మిశ్రితపాట, గంగపాట, రోహిల్లాల పాటలు ముఖ్యమైనవి.
ధర్మపురి మరొకసారి గోదావరి వరదల్లో కొట్టుకొని పోయినప్పుడు నరసింహదాసు గంగపాట రచించాడు. రోహిల్లాలు క్రీ.శ.1858లో ధర్మపురిని దోచుకొన్నప్పుడు రొహిల్లాల పాట రచించాడు. తెలుగు తిథుల ప్రకారం కాళయుక్తి నామ సంవత్సర కార్తీక బహుళ దశమి నాడు రోహిల్లాలు ధర్మపురిని దోచుకొన్నారు. ఈ పాటలో రోహిల్లాల దురాగతాలను వివరించారు.
నాటి దేశ కాల పరిస్థితులకు దర్పణంగా నిలిచి, జరిగిన సంఘటనల ను చరిత్రకు అందించి, మానవాళికి సన్మార్గ నిర్దేశనం చేసిన ఈ రెండు శతకాలకు తెలంగాణ పుట్టినిల్లు కావడం తెలంగాణ ప్రజలందరు హర్షించదగిన విషయం.
– బసవరాజు నరేందర్ రావు 990851 6549