ఉత్తరాలు, టెలిఫోన్ (మొబైల్స్, ల్యాండ్లైన్స్), ఇంటర్నెట్ కమ్యూనికేషన్ (ఈ- మెయిల్, చాట్స్ మొదలైనవి)ను ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశ చట్టాలు కల్పించాయి. పోస్టల్ ఆర్టికళ్లను తెరచి చదివే (ఇంటర్సెప్ట్ చేసే) అధికారం ఇండియన్ పోస్టాఫీస్ యాక్ట్, 1898 (సెక్షన్ 26), భారత టెలిగ్రాఫిక్ చట్టం, 1885లోని సెక్షన్ 5 (2) ప్రకారం టెలిఫోన్లను ట్యాప్ (ఇంటర్సెప్ట్) చేసే హక్కు, ఈ-మెయిల్స్/ చాట్స్ మొదలైనవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 (సెక్షన్ 69) ద్వారా ట్యాపింగ్ చేసే హక్కు దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది.
Phone Tapping | ఫోన్లను ఎవరు ట్యాప్ చేయవచ్చు?: రాష్ర్టాల్లో, ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉన్నది. కేంద్రంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్అండ్ఏడబ్ల్యూ), డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఉన్నది.
భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ను నియంత్రించే చట్టాలు ఏమిటి?: ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885 చట్టంలోని సెక్షన్ 5 (2) ప్రకారం ఏదైనా ప్రజా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, ప్రజా భద్రత దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ను కేంద్రం లేదా రాష్ర్టాలు చేయవచ్చు. ప్రజా భద్రత, ‘భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా నేరం చేయడానికి ప్రేరేపించడాన్ని నిరోధించడం’ కోసం ఇది అవసరమని సంతృప్తి చెందితే ఈ ఉత్తర్వును సంబంధిత శాఖ జారీచేస్తుంది.
ఫోన్ ట్యాపింగ్కు అనుమతించే అధికారం ఎవరికి ఉంటుంది?: ఫోన్ట్యాపింగ్, ఇండియన్ టెలిగ్రాఫ్ (సవరణ) రూల్స్, 2007లోని రూల్ 419 ఏ ద్వారా ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉన్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తర్వుల ద్వారా ఫోన్ ట్యాప్ చేసే అధికారం సంబంధిత శాఖలకు సంక్రమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో హోం శాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉన్నది. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర హోం కార్యదర్శి లేదా రాష్ట్ర హోం కార్యదర్శి ద్వారా అధికారం పొందిన జాయింట్ కార్యదర్శి స్థాయి అధికారి కూడా ట్యాపింగ్కు ఆదేశాలు ఇవ్వవచ్చు. మారుమూల ప్రాంతాల్లో లేదా ఆపరేషన్ కారణాల వల్ల, ముందస్తు ఆదేశాలను పొందడం సాధ్యం కానట్లయితే, సంస్థ డైరెక్టర్ లేదా రెండవ సీనియర్ అధికారి ఆదేశాలు ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో అయితే ఈ ఉత్తర్వును మూడు రోజుల్లోగా కాంపిటెంట్ అథారిటీకి తెలియజేయాలి. వారు ఏడు పనిదినాల్లోగా దానిని ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. నిర్దేశిత ఏడు రోజుల్లోగా కాంపిటెంట్ అథారిటీ నుంచి ధృవీకరణ అందకపోతే, ఆ ట్యాపింగ్ను ఆపివేయాలి.
ట్యాపింగ్ పునరుద్ధరణ: ఆ ట్యాపింగ్ ఆదేశాలను కాంపిటెంట్ అధికారి రద్దు చేయకపోతే 60 రోజులకు మించకుండా ట్యాపింగ్ చేయవచ్చు. కాంపిటెంట్ అధికారి 180 రోజుల వరకు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వవచ్చు. ఓటుకు నోటు ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చడం వంటివి ‘నేరం చేయడానికి ప్రేరేపించడాన్ని నిరోధించడం’ కిందకి వస్తుంది తప్ప ఆర్టికల్ 21 కింద ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛరక్షణ కిందికిరాదని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.
యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (ఏఎన్బీ) తమ విచారణలో భాగంగా డ్రగ్స్ కేసు విచారించే సందర్భంలో ఫోన్ ట్యాప్ చేసే అధికారం చట్టాలు కల్పించినవే. ఆ విధంగా చేశారో లేదో ఆ సంబంధిత శాఖ వారు నిర్ధారించాలి లేదా విచారణలో తేలాలి. కాంగ్రెస్ ప్రధానులైన ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రతిపక్ష, స్వీయపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు 1991లో సీబీఐ సీక్రెట్ నివేదికలో వెలువడింది. రాజీవ్గాంధీ చంద్రశేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడానికి ఫోన్ ట్యాపింగ్ విషయమే ముఖ్య కారణమై ఉంటుందని అప్పటి విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక పీవీ ప్రభుత్వం, వాజపేయి ప్రభుత్వంపై కూడా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అభియోగాలున్నాయి. ఎస్పీ నేత అమర్సింగ్ 2006లో యూపీఏ ప్రభుత్వంపై, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్సింగ్పై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు మోపారు.
పౌర అణుశక్తి ఒప్పందం సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ కూడా ట్యాపింగ్ అభియోగాలు మోపాయి. 2010లో బీజేపీ ప్రతిపక్ష నాయకులైన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఎన్డీయే పార్లమెంటరీ బోర్డు చైర్మన్ అద్వానీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా కాంగ్రెస్ సర్కార్ ఒప్పుకోలేదు. మోదీ ప్రభుత్వంలో పెగాసస్ ఆరోపణలు, దానిపై విచారణ పర్వం అందరికీ తెలిసిందే. ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాప్ అభియోగం మోపి, డీజీసీకి కంప్లయింట్ చేయడం తెలిసిందే. ఇటీవల బాంబే హైకోర్టు ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా, ఇతర అధికారులపై ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ నేత మోపిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కొట్టివేసింది.
‘అదుర్స్’ సినిమాలో పోలీస్ అధికారి అయిన షాయాజీ షిండే, ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించి జూనియర్ ఎన్టీఆర్ ద్వారా డబ్బులు సంపాదించే విధానాన్ని చూపించారు. అయితే షాయాజీ షిండే ఆ సిన్మాలో చేసినదానికి, ఆ సినిమాలో చూపించిన ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ రోజు మీడియా లీకుల ద్వారా రోజు కొన్ని పచ్చ పత్రికల్లో వచ్చే విచారణ తాలూకు విషయాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడానికే అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
అవసరమైన కారణాలు: కాంపిటెంట్ అథారిటీ జారీ చేసే ఏ ఉత్తర్వుల్లోనైనా కారణాలుండాలి. ఒక కాపీని ఏడు పని దినాల్లోగా సమీక్షా కమిటీకి పంపాలి. కేంద్రంలో క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో న్యాయ, టెలికాం కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రాష్ర్టాల్లో, ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహించే కమిటీలో న్యాయ, హోం కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై అన్ని ట్యాపింగ్ విషయాలను సమీక్షించాలని చట్టం చెప్తున్నది.
రికార్డుల విధ్వంసం: నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి ఆయా ఆదేశాలకు సంబంధించిన రికార్డులు ధ్వంసమవుతాయి. సర్వీసు ప్రొవైడర్లు కూడా ట్యాపింగ్ నిలిపివేసిన రెండు నెలల్లోగా ట్యాపింగ్ ఆదేశాలకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అంటే చట్టాన్ని అనుసరించి ట్యాపింగ్కు సంబంధించిన ఆదేశాలు కానీ, డేటా కానీ రికార్డులను ధ్వంసం చేయడం చట్టం ప్రకారం చేయవల్సిన పని.
పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ప్రతిపాదించిన ఆర్టికల్ 21 ప్రకారం ప్రైవసీ, రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీని పరిరక్షించాలని చెప్తూనే 1885 సెక్షన్ 5(2)లో పొందుపరిచిన నియమాలను అనుసరించి ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పింది. చంద్రబాబు నాయుడు, రఘునందన్రావు ఇంకా అనేక నాయకులు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిజమో కాదో విచారణలో తేలాలి. ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగి ఉంటే అది కచ్చితంగా చట్టాన్ని అనుసరించి తగిన స్థాయి అధికారి ఆదేశాలు ఇచ్చి ఉండాలి.
పెండ్యాల మంగళాదేవి