Inspirational Story | జమ్మూకు చెందిన శీతల్దేవి ఫొకోమేలియా అనే అరుదైన వ్యాధితో జన్మించింది. దీనివల్ల తన చేతులు రెండూ పూర్తిగా ఏర్పడలేదు. శీతల్ని చూసి చుట్టుపక్కల వారంతా జాలిపడేవారు. కానీ తను మాత్రం, ఇతరులకంటే తక్కువని ఏమాత్రం అనుకోలేదు. మిగతా పిల్లలు ఏ పనులైతే చేస్తారో, వాటిని శీతల్ అంతే చురుగ్గా చేసేది. ఆఖరికి చెట్లు కూడా ఎక్కేసేది. ఆ చురుకుదనం వల్ల శీతల్ ఏదో ఒక ఆటలో రాణించాలని అనుకున్నది.
అలా తన దృష్టి విలువిద్య మీద పడింది. ఒక్క వేలు సరిగా లేకపోతేనే నారి సారించడం అసాధ్యం అనిపిస్తుంది. అలాంటిది చేతులు సరిగాలేని శీతల్ ఆ ఆటలో అడుగుపెట్టడం ఏమిటంటూ విన్నవారంతా ఫక్కున నవ్వారు. అలాంటి అభిప్రాయాలన్నీ కొట్టిపారేయడం శీతల్కు అలవాటే కదా! అందుకే పట్టుబట్టి విలువిద్య సాధన చేసింది. అందుకు తన కోచ్లు కూడా సహకరించారు. ఏడాది తిరిగేసరికల్లా టోర్నమెంట్లలో పతకాలు గెలవడం మొదలుపెట్టింది.
మరుసటి ఏడాది ఏకంగా ప్రపంచ ఆర్చరీ పారా చాంపియన్షిప్లో వెండి పతకం సాధించింది. కేవలం కాళ్లతోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా శీతల్ నిలిచింది. ఇప్పటికే దేశం తరఫున ఏకంగా పది పతకాలు సాధించిందామె. ఈ ఏడాది పారిస్లో జరగనున్న పారాలింపిక్స్లో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నది. ఈ విజయాలకు మించి శీతల్ సాధించిన ఘనత మరొకటి ఉంది. అదే… తనలాంటి మరెందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలవడం. ‘నాకు నిరాశ కలిగినప్పుడు శీతల్ అక్క వీడియోని చూస్తాం’ అని వారు చెప్పడమే అందుకు సాక్ష్యం.