join my wedding | భారతీయ వివాహ మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతి పెద్దది. అమెరికన్ల తర్వాత అంత ధూమ్ధామ్గా జరుపుకొనేది మనమే. ఆ హంగూ ఆర్భాటం చూడాల్సిందే. ఆ విందులు, చిందులు ఆస్వాదించాల్సిందే. పన్నీటి చిలకరింపులు, తీయని పలకరింపులు అనుభవించాల్సిందే. ఆ వేదమంత్ర ఘోష వినాల్సిందే. ఇంతగొప్ప ఈవెంట్ను మార్కెట్ చేసుకోడానికి వధూవరులు సిద్ధంగా ఉన్నారు. టికెట్ కొనుక్కుని అయినా సరే పాల్గొనడానికి విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. వీళ్లను కలపడానికి ‘జాయిన్ మై వెడ్డింగ్’లాంటి వెబ్సైట్స్ ప్రత్యేకంగా వెలుస్తున్నాయి.
ఎదురుకోళ్లు, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ, గౌరీవ్రతం, సప్తపది, జీలకర్రాబెల్లం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, అరుంధతీ నక్షత్రం.. ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి అటూ ఇటుగా మారవచ్చు కానీ భారతీయ వివాహం ఓ అందమైన వేడుక. బెంగాలీ, అస్సామీ, తమిళ, మలయాళ.. సంప్రదాయం ఏదైనా పాల్గొని తీరాల్సిన సందర్భం. వివాహ భోజనాలు, వింతైన వంటకాలు, అతిథి మర్యాదలు, కొసరికొసరి వడ్డింపులు, వియ్యాలవారి చిలిపి కయ్యాలు, కొంటె మరదళ్ల సరసాలు.. అదొక జీవితకాల అనుభూతి. పెండ్లిని ఇతివృత్తంగా చేసుకుని ఏకంగా రెండున్నర గంటల వినోదాన్ని పంచిన సినిమాలూ ఉన్నాయి. నవలలూ అనేకం. ‘గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్’ పేరుతో వెబ్సిరీస్లు కూడా వచ్చాయి. ఇవన్నీ.. పాశ్చాత్యులకు భారతీయ వివాహం పట్ల ఆసక్తిని పెంచాయి. తామూ అతిథులుగా పాల్గొనాలనే అభిలాషను రేకెత్తించాయి.
‘జాయిన్ మై వెడ్డింగ్’ లాంటి వేదికలు విదేశీ యాత్రికులకు భారతీయ వివాహ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాయి. ‘భారతీయ వివాహాన్ని చూడకపోతే.. భారతదేశ సందర్శన పరిపూర్ణం కానేకాదు’ అనేది జాయిన్ మై వెడ్డింగ్ ట్యాగ్లైన్. అలా అని దీన్ని స్థాపించింది ఏ భారతీయుడో కాదు. ఓర్సీ పార్కనీ అనే హంగేరియన్-ఆస్ట్రేలియన్ ఆంత్రప్రెన్యూర్. తాజా వివాహాల సీజన్లో దాదాపు మూడువేలమంది విదేశీయులు భారతీయ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి టికెట్లు కొనుక్కున్నారు. కల్యాణ మండపంలో సీట్లు రిజర్వు చేసుకున్నారు. ‘నా ఫ్రెండ్స్లో భారతీయులూ ఉన్నారు. తమ పెండ్లికి రమ్మని ప్రేమగా ఆహ్వానించారు కూడా. కానీ పని ఒత్తిడి వల్ల కుదరలేదు. దీంతో భారతీయ వివాహాలకు హాజరుకావాలనే కోరిక కోరికగానే మిగిలిపోయింది. అపరిచితుల వివాహానికి వెళ్లలేం. ముక్కూమొహం తెలియనివారిని ఎవరూ పిలవరు కదా? అందుకే, మధ్యేమార్గంగా ఈ వెబ్సైట్ను ప్రారంభించాను. స్పందన చాలా బావుంది’ అంటారు పార్కనీ.
తమ పెండ్లి టికెట్లను విక్రయించాలనుకునే వధూవరులు ‘జాయిన్ మై వెడ్డింగ్’లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. దాంతోపాటే ఆ జంట ఫొటో అప్లోడ్ చేయాలి. తేది, ముహూర్తం, సమీప విమానాశ్రయం వివరాలు ఇవ్వాలి. బుక్ మై షోలో సినిమా టికెట్ బుక్ చేసుకున్నట్టు, ఓయోలో రూమ్ రిజర్వు చేసుకున్నట్టు .. వివాహ సందర్శనకు టికెట్ బుక్ చేసుకుంటారు. పాకిస్థాన్, గ్రీస్, దుబాయ్ వివాహాలకు వెళ్లానుకునేవారి కోసమూ ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ‘జైపూర్లో జరిగిన ఓ రాజస్థానీ పెండ్లికి వెళ్లాన్నేను. అదో కొత్త ప్రపంచం. ప్రతి ఒక్కరి మొహంలో ఆనందతాండవం. ఇంకో జన్మంటూ ఉంటే భారతీయ సంప్రదాయంలోనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను’ అంటాడు ఇంగ్లండ్ నుంచి వచ్చిన డేవిడ్సన్ అనే టూరిస్ట్. వెబ్సైట్ నిర్వాహకులు ప్రతి టికెట్కూ మూడొందల నుంచి ఐదొందల డాలర్ల వరకూ చార్జ్ చేస్తారు. అందులో పదిహేను శాతం కమిషన్గా తీసుకుని.. మిగతా మొత్తాన్ని వధూవరులకే ఇచ్చేస్తారు. వేడుక పూర్తికాగానే.. చుట్టాలు ఊళ్లకు, వధూవరులు హనీమూన్కు, విదేశీ అతిథులు స్వదేశానికి బయల్దేరతారు!
‘జాయిన్ మై వెడ్డింగ్’ వెబ్సైట్ నిర్వాహకులు విదేశీ అతిథులకు దగ్గర్లోని హోటల్లో గది బుక్ చేస్తారు. ఉండాలనుకుంటే పెళ్లివారి విడిదిలోనే ఉండవచ్చు. కట్టుకుంటామంటే, స్థానిక సంప్రదాయ వస్ర్తాలనూ సమకూరుస్తారు. అవసరం అనుకుంటే, స్థానిక భాష తెలిసిన దుబాసీని ఏర్పాటుచేస్తారు. బరాత్లో డాన్స్ చేయాలనుకునేవారికి కొరియోగ్రాఫర్ సహకారం ఉండనే ఉంటుంది. వధూవరుల కుటుంబాలకు ఇదో ఆదాయ మార్గం కూడా.