కవిత గోపు.. అసిస్టెంట్ ప్రొఫెసర్. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. సకల సౌకర్యాల జీవితం. అక్కడితో ఆగిపోలేదామె. ఉద్యోగం వదిలేసి ఆంత్రపెన్యూర్గా మారారు. మిఠాయిల వ్యాపారంలోకి వచ్చారు. ఓ కొత్త ఐడియాతో స్థాపించిన ‘లడ్డూ బాక్స్’ కొద్దికాలంలోనే కస్టమర్ల అభిమానాన్నిచూరగొంది. ఆమె చేతి లడ్డూలను యూపీ ప్రభుత్వం అంగన్వాడీలకు పౌష్టికాహారంగా అందిస్తున్నది.
లడ్డూలు ఇష్టపడని వారు ఉంటారా? అలా అని, స్వీట్ షాపుల్లో దొరికేవన్నీ ఆరోగ్యకరమైన లడ్డూలే అని చెప్పలేం. ఆ బుల్లి భూగోళాలంటే ఎంత ప్రాణమైనా.. ఆరోగ్యంతో రాజీపడలేం కదా! దీంతో, ఆరోగ్య స్పృహ ఉన్న లడ్డూ ప్రేమికుల కోసమే ‘లడ్డూ బాక్స్’ను ఏర్పాటు చేశారు గోపు కవిత. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడుతారామె. తొలుత నాలుగైదు రకాలతో వ్యాపారం మొదలైంది. అంతలోనే కరోనా మీదపడింది. నేరుగా వ్యాపారాన్ని ప్రభావితం చేసింది. అయినా వెనక్కి తగ్గకుండా.. భార్యాభర్తలిద్దరూ గేటెడ్ కమ్యూనిటీస్లో స్టాల్స్ పెట్టసాగారు. ఎంత ప్రయత్నించినా.. కొంతకాలం నష్టాలు తప్పలేదు. అయినా మొండిగా ప్రచారం చేశారు. ఆ శ్రమ వృథా కాలేదు. కస్టమర్స్ ‘లడ్డూ బాక్స్’ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఆర్డర్లు పెరిగాయి. దీంతో వెబ్సైట్ ప్రారంభించి.. ఆన్లైన్ వ్యాపారం నిర్వహించారు. ఇక వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం కేంద్రంగా ఆన్లైన్ బిజినెస్ నడుస్తున్నది. కొద్దిరోజుల క్రితమే సైనిక్పురిలో ఆఫ్లైన్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దాదాపు ఇరవై వేలమంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వార్షిక టర్నోవర్ రూ.1.2 కోట్ల పైమాటే.
గోపు కవిత స్వస్థలం సిద్దిపేట. భర్త సాందీప్ సొంతూరు చేర్యాల. పదిహేనేండ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. కవిత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సాందీప్ యుఎస్ఏలో ఎమ్మెస్ చదివారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. ఉద్యోగం వదిలేసి ఇండియాకు తిరిగొచ్చారు. ఆలూమగలు ఓ నిర్ణయానికొచ్చి ‘లడ్డూ బాక్స్’ స్థాపించారు. అప్పటికే బెల్లం లడ్డూలు వివిధ బ్రాండ్లతో మార్కెట్లో ఉన్నాయి. నవతరం అభిరుచులకు అనుగుణంగా.. రుచిలో, తయారీలో మార్పులు చేస్తేనే పోటీలో నిలబడగలమని కవితకు అర్థమైంది. ఈ క్రమంలోనే సేంద్రియ బెల్లం, నెయ్యి ఉపయోగించి ఆరోగ్యకరమైన లడ్డూల తయారీకి పూనుకున్నారు. శెనగపిండి, కొబ్బరి, రాగులు, ఓట్స్, అవిసె గింజలు, వేరుశనగ, డ్రై ఫ్రూట్స్ తదితర దినుసులతో లడ్డూలు చేయించి మార్కెట్కు పరిచయం చేశారు. రకాన్ని బట్టి ధర రూ.80 నుంచి రూ.360 వరకు ఉంటుంది. అన్ని వెరైటీలతో కూడిన తొమ్మిది లడ్డూల బాక్స్ ధర రెండువందల యాభై రూపాయలు. ధరలు సహేతుకంగానే ఉండటంతో కస్టమర్ల నుంచి ఆర్డర్లు పెరిగాయి.
పుట్టినరోజు, పెండ్లి వేడుకలకు ‘లడ్డూ బాక్స్’ బహుమతిగా ఇచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది. కార్పొరేట్ కంపెనీలు సైతం తమ ఉద్యోగులు, ైక్లెంట్స్ కోసం తెప్పించుకుంటున్నాయి. బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలలో ‘లడ్డూ బాక్స్’ను పోషకాహారంగా అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే లక్ష లడ్డూలు అందిం చారు. దీన్ని గ్లోబల్ బ్రాండ్గా విస్తరించేందుకు గోపు కవిత దంపతులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లో శాఖలు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఓ పదిహేను మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నామని, వ్యాపార విస్తరణ తర్వాత మరింత మందికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు కవిత. ‘మిఠాయిలు మన సంప్రదాయంలో భాగం. అందులోనూ లడ్డూలంటే తెలుగువారికి ప్రాణం. ఆరోగ్య కారణాలతోనో, కేలరీల భయంతోనో ఆ తీయని వేడుకకు దూరంగా ఎందుకు ఉండాలి? భయం భయంగా నోరు తీపి చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు?’ అంటారామె. మీఠా ఖబర్.. అంటే ఇదే కావచ్చు!
చక్కెర ఉపయోగించకుండా.. అధిక పోషకాలు కలిగిన లడ్డూలు అందించాలన్నది ‘లడ్డూ బాక్స్’ లక్ష్యం. నెట్వర్క్ పెంచుకోవడంలో ‘వీ హబ్’ సహకారం మరువలేనిది. బ్యాంకు రుణాల విషయం లోనూ వెన్నంటి నిలిచింది. ఎంత బెల్లం లడ్డూలు అయినా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోలేరు. అలాంటివారూ ఆరగించేలా ప్రత్యేకమైన లడ్డూలు తయారుచేయాలని అనుకుంటున్నాం. ఇందుకు సంబంధించి పరిశోధన జరుగుతున్నది. త్వరలోనే బేక్డ్ చిప్స్ వ్యాపారం ప్రారంభిస్తున్నాం.
-కవిత గోపు
-గంజి ప్రదీప్కుమార్