ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి హోలీ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా పరస్పరం రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. వీధులన్నీ రంగులతో రంగవల్లులుగా మారి కనువిందు చేశాయి.
-ఖమ్మం కల్చరల్, మార్చి 7
హోలీ వేడుకలను సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ప్రజలు మంగళవారంనాడు జరుపుకున్నారు. గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా యువతీ, యువకులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరాలకు చాటిచెప్పేవి పండుగలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం సత్తుపల్లిలో నిర్వహించిన హోలీ సంబురాల్లో మాట్లాడారు. ప్రతి పండుగకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, తల్లిదండ్రులు నేటితరం పిల్లలకు పండగల విశిష్టతను తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీసుస్టేషన్లో సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
– నమస్తే నెట్వర్క్