దుమ్ముగూడెం, ఏప్రిల్ 13: చుట్టూ పొలాలు.. చేనూ చెలకలు.. మధ్యలో చిన్న గూడెం.. మొత్తం 40 గిరిజన కుటుంబాల నివాసం.. ఆరు దశాబ్దాల నుంచి ఆ గూడేనికి రవాణా సౌకర్యం లేదు.. పంటలు పండుతున్నప్పుడు పొలం గట్లే వారికి రాచమార్గాలు.. చిన్నాపెద్దా అంతా ప్రయాసలకోర్చి లింక్ రోడ్డుకు చేరుకోవాల్సిందే. చదువుకునే పిల్లలైనా, గర్భిణులైనా ఎవరికైనా ఈ అవస్థ తప్పదు. ఇక ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవిస్తే వారి బాధలు చెప్పనవసరం లేదు. బంధువులు మృతుడి ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు. వాహనాలు గూడేనికి వచ్చే వసతి లేదు. శుభకార్యామైనా ఎదురయ్యేవి ఇవే ఇబ్బందులు. గూడెంవాసుల బాధలను తెలుసుకున్న భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఇటీవల గ్రామానికి గ్రావెల్ రోడ్డు వేయించారు. గ్రామస్తుల రవాణా కష్టాలకు పరిష్కారం చూపారు.. కలెక్టర్ మంచి మనసుకు గుర్తుగా గూడెంవాసులు తమ గ్రామాన్ని ‘అనుదీప్’ గుంపు అని పిలవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది..? గ్రావెల్ రోడ్డు ఏర్పాటు ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేట పంచాయతీ పరిధిలో మధ్యగుంపు శివారు గ్రామం. పొలాల మధ్య ఉంటుంది ఆ గూడెం. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడికి వలస వచ్చిన గిరిజనులు ఈ గూడెంలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి వారికి మౌలిక వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి పాలనలో తమకు రవాణా సౌకర్యం కల్పించాలని ఎంతమంది రాజకీయనాయకులను కోరినా స్పందన కరువైంది. ఏ అధికారీ వారి గోడు విన్న పాపాన పాలేదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే వారి సమస్యలకు పరిష్కారం దొరికింది.
ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, సర్పంచ్ చిన్నారావు, ఎంపీటీసీ తిరుపతిరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రహదారి సమస్యను కలెక్టర్ అనుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. పలు అధికారిక సమావేశాలతో పాటు సర్వసభ్య సమావేశాలు, ప్రజావాణిలో గిరిజన గూడెంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి గ్రామస్తుడు పాయం కన్నయ్య పావు ఎకరా భూమిని దానం చేయడంతో కలెక్టర్ తక్షణం స్పందించారు. పంచాయతీ నిధుల నుంచి రూ.1.50 లక్షలు వెచ్చించి గ్రావెల్ రోడ్డు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎనిమిది అడుగుల వెడల్పు, 200 మీటర్ల పొడవుతో రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు భూమి దాత కన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ అనుదీప్ అందించిన సాయానికి చిహ్నంగా తమ గూడేన్ని ‘అనుదీప్ గుంపు’ అని నామకరణం చేసుకున్నారు. దశాబ్దాల పాటు నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.