భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యార్థులతోపాటు మిగతా పాఠశాలల విద్యార్థులనూ ఒకే వేదిక మీదకు తెచ్చి క్రీడాపోటీలను నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో చదువుతోపాటు క్రీడా నైపుణ్యాన్నీ వెలికి తీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి గురుకులాల ఇంటర్ లీగ్ పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. క్రీడల్లో సత్తా చాటి బహుమతులు గెలుచుకునేందుకు క్రీడాకారులు పోటీపడుతున్నారు. గతంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ఈ క్రీడోత్సవానికి ఇప్పుడు పాల్వంచ మండలంంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ వేదికగా నిలిచింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా సంబురానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాలబాలికల వెంట వచ్చిన పీఈటీలు, కోచ్లు, సిబ్బందికి అన్ని సౌకర్యాలూ కల్పించారు. 13 విభాగాల్లో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో క్రీడాప్రాంగణంలో జరిగే సంబురం అంబరాన్నింటింది. నాలుగు రోజులు పాటు జరిగే ఈ క్రీడోత్సవానికి మొదటి రోజున ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ హాజరయ్యారు. చివరి రోజు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు.
అన్ని గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో ఈ పోటీల విజయవంతానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నందున వారికి వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పించారు. బాలురకు అనుబోస్ కాలేజీలో వసతి ఏర్పాటు చేయగా.. బాలికలకు కిన్నెరసాని స్పోర్ట్స్ జూనియర్ కాలేజీలోనే వసతి కల్పించారు. మొత్తం 3,500 మంది విద్యార్థులు, 300 మంది పీఈటీలు, 148 మంది రిఫరీలు, 50 మంది కోచ్లతోపాటు మిగతా సిబ్బందికీ వసతి కల్పించారు.
ఎక్కడో సిటీలో పెరిగాను. కానీ ఇక్కడ మారుమూల అటవీ ప్రాంతంలో ఆడేందుకు ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయని అనుకోలేదు. క్రీడా మైదానం కూడా చాలా బాగా ఉంది. ఇంతటి మారుమూల ప్రాం తాల్లో కూడా ఇంత చక్కటి స్పోర్ట్స్ ఉం దంటే ఆశ్చర్యం కలుగుతోంది. పైగా ఆడుతుంటే ఎలాంటి అసౌకర్యమూ అన్పించడం లేదు. పట్టణాల్లో అయితే వాహనాల హారన్లు వినిపిస్తాయి. దీంతో ఆటపై సరైన దృష్టి పెట్టలేము.కానీ ఇక్కడా అలాంటి సమస్య లేదు. ఏకాగ్రత అంతా ఆటపైనే ఉంటోంది. మాకు వెరీ గుడ్ అపార్చునిటీ. ఐటీడీఏకు వెరీ వెరీ థ్యాంక్స్.
-డీ.తరుణ్, కబడ్డీ, హైదరాబాద్
పిల్లల్లో చిన్నప్పటి నుంచి పోటీతత్వం అలవడేలా చేయడమే టీచర్ లక్షణం. క్రీడల్లో ఆ పనిని పీడీలు చేస్తున్నారు. దీంతో మంచి ఆటగాళ్లు తయారవుతున్నారు. ఇక్కడికి వచ్చిన విద్యార్థుల్లో ప్రతి ఒక్కరూ మంచి ప్రతిభను చూపుతున్నారు. వాలీబాల్ కబడ్డీ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది. జోన్ షాట్లు కొడుతున్నారు. పిల్లలు అంత ఎత్తు ఎగిరి మరీ షాట్ చేస్తుండడం అద్భుతంగా ఉంది. ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే ఇలా ఆడడం సాధ్యమవుతుంది. భద్రాద్రి జిల్లాలో ఇంత పెద్ద పోటీలను తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయి.
-సర్వే చందన, గిరిజన విద్య డీడీ, ఉట్నూరు
విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు కూడా చాలా ముఖ్యం. ఆటల వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గెలుపోటములు చూస్తుంటారు కాబట్టి విజయం సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. తదుపరి ఆటలను చాలెంజ్గా తీసుకొని ఆడుతారు. మా విద్యార్థులు చాలా ప్రతిభావంతులు. ఈ పోటీల్లో తలపడి కప్ సాధించాలనే ఇక్కడికి వచ్చారు. పీడీలు మెలకువలు నేర్పించడం వల్ల వారు గేమ్లో విజయం సాధిస్తారు. ఒకవేళ ఒడినా పొరపాట్లు నేర్చుకుంటారు. ఇది వారికి మంచి వేదిక. ఇది గిరిజన ప్రాంతమైనప్పటికీ పట్టణ వాతావరణం కన్పిస్తోంది. ఎటు చూసినా క్రీడాకారులే ఉన్నారు.
-డీ.వీరునాయక్, కురివి, మహబూబాబాద్
వీళ్లు మామూలు పిల్లలు కాదు. ఒకరంటే ఒకరు పోటీపడి మరీ ఆడుతున్నారు. అక్కడ జిల్లా స్థాయిలో ఆడి సత్తా చాటుకున్నారు. రాష్ట్రస్థాయిలో కప్ సాధించాలని ఇక్కడికి తీసుకొచ్చాం. పోటీలో ఎక్కడా రాజీ పడడం లేదు. ఇంత మంది క్రీడాకారులను చూస్తుంటే వారికి కూడా మరింత మెరుగ్గా ఆడాలన్న కసి పెరుగుతుంది. అన్ని ఈవెంట్లలోనూ మా విద్యార్థులు సత్తాచాటుతున్నారు. కిన్నెరసానిలో ఇంతపెద్ద మైదానం ఉంటుందని ఊహించలేదు. ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు బాగా చేశారు..
-లక్కీరాం, పీడీ, జనగాం ,పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో క్రీడోత్సవంలో పాల్గొన్న విద్యార్థులు
ముందు మన మీద మనకు నమ్మకం ఉంటే దేనినైనా సాధించవచ్చు. అదే గోల్తో వచ్చాం. ఈ క్రీడా పోటీల్లో తప్పకుండా సత్తా చాటుతాం. వాలీబాల్లో జిల్లా స్థాయిలో విజయా సాధించాం. ఇక్కడ కూడా గెలిచి కప్ కైవసం చేసుకోవాలని గోల్ పెట్టుకున్నాం. తప్పకుండా కప్ గెలుస్తాం. ఇక్కడి వాతావరణం చాలా బాగా ఉంది. మంచి ఏర్పాట్లు చేశారు. వీళ్లందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా బాగా ఆడాలనిపిస్తుంది. చాలామంది స్నేహితులు దొరికారు.
-శిఖర, పూజిత, వాలీబాల్, హైదరాబాద్, వనపర్తి