ఈ సారి వర్షాలు పుష్కలంగా కురిశాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతు న్నాయి. దీంతో ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగింది. సాగర్ ఆయకట్టు కింద యాసంగికి జిల్లాలో 2.54 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించేందుకు నీటి పారుదలశాఖ అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. యాసంగికి కృష్ణా జలాల నీటి వాటాలపై ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 17 మండలాల్లో రైతుల ఆయకట్టుకు 21.50 టీఎంసీలు నీటిని విడుదల చేయనున్నారు. యాసంగికి వారబందీ పద్ధతిలో 2023 మార్చి 31 వరకు ఎనిమిది విడతలుగా 87 రోజులపాటు సాగర్ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు.
.నాగార్జున సాగర్ బోర్డు, నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నది. జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద యాసంగికి 2.54 లక్షల ఎకరాల్లో సాగునీరందించాలని నీటి పారుదలశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయకట్టుకు 21.50 టీఎంసీల నీటిని కేటాయించారు. సాగర్ ఎడమ కాలువ మొత్తానికి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు 63 టీఎంసీల నీటి విడుదల చేయనున్నారు. పాలేరు కింద ఉన్న మొత్తం ఆయకట్టుకు 21.50 టీఎంసీలు కేటాయించారు. అదేవిధంగా జిల్లా మొత్తంలో నాగార్జునసాగర్ ఆయకట్టు, లంకాసాగర్, వైరా, ఎస్ఆర్ఎస్పీ, ఎన్ఎస్పీ, ఎత్తిపోతలు, భక్తరామదాసు, మధ్యతరహా ప్రాజెక్టు కింద జిల్లాలో 6 లక్షలపైగా ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు, వ్యవసాయశాఖ అంచనా వేసింది. పాలేరు నుంచి కల్లూరు వరకు సాగర్ మొదటి జోన్గా, కల్లూరు నుంచి నూజివీడు వరకు మూడోజోన్ కింద పరిగణిస్తారు.
స్వల్పకాలిక పంటపై అవగాహన
సాగర్ ఆయకట్టు కింద వరి కాకుండా స్వల్పకాలిక పంటలు వేసేలా వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని బోర్డు అధికారులు సూచించారు. వరి కంటే లాభదాయకమైన పంటలు వేసేలా వ్యవసాయాధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. యాసంగిలో కాలువలు, చెరువులు, ఎత్తిపోతలు, ప్రాజెక్టుల నిర్వహణలో తలెత్తిన లోపాలు, సాంకేతిక ఇబ్బందులు గుర్తించి వాటిని 2023 ఏప్రిల్లో మరమ్మతు పనులు మొదలు పెట్టుకునేలా అంచనాలు రూపొందించాలన్నారు. వచ్చేజూన్ నెలాఖరు వరకు మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించారు. నీటి విడుదల నాటికి ఎలాంటి పనులు పెండింగ్లో ఉండొద్దని చెప్పారు.
వారబందీ పద్ధతిలో నీటి విడుదల..
సాగర్ ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. 87 రోజులపాటు పాలేరు నుంచి కల్లూరు వరకు రెండో జోన్ కింద నీటిని విడుదల చేయనున్నారు. మొత్తం యాసంగిలో 8.493 టీఎంసీలు కాగా.. బీఆర్ఐఎల్ఎస్ కింద 3టీఎంసీలు కలిసి 12 టీఎంసీల వరకు నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. మిగిలినవి ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, మిషన్ భగీరథ, మూడో జోన్ కింద కృష్ణా జిల్లా ఆయకట్టుకు నీటిని కేటాయించనున్నారు.