తేనెకన్నా తీయనిది తెలుగు భాష.. ఇటాలియన్ ఆఫ్ది ఈస్ట్ తెలుగు.. దేశభాషలందు తెలుగు లెస్స.. ఇవి తెలుగు భాష మాధుర్యంపై పలువురు కవులు చేసిన వ్యాఖ్యానాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో జాన తెలుగు అయిన తెలంగాణ తెలుగును పనికి రాని భాషగా తీసివేసినా, రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ భాషను కాపాడుకునే ప్రయత్నం ప్రారంభమైంది. ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంభు రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా..’ అంటూ పౌరుషంగా ప్రకటించిన కాళోజీ నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు భాష వైభవం, చరిత్ర, కరీంనగర్ జిల్లాలో భాషా వికాసంపై ఈ కథనం..
-జగిత్యాల, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ)
తెలుగు.. అమ్మ భాష! సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతమూ, కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష! తెలుగు భాషా మాధుర్యం, గొప్పదనం గురించి ఎంత వర్ణించినా తక్కువే! ఈ తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తేనెలొలుకు తీపి పలుకుల సోయగాన్ని నేటి తరానికి అందించేందుకు రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. తెలుగును ఇంటర్ స్థాయి వరకు తప్పనిసరి చేసింది. తెలుగు భాష పరిరక్షణకు తెలంగాణ సాహితీ అకాడమీని కూడా ఏర్పాటు చేసింది. గత వైభవాన్ని చాటుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, కర్తవ్యాలను నిర్దేశించే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలు కూడా నిర్వహించింది. ప్రజా కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది.
జగిత్యాల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశభాషలందు తెలుగులెస్స.. కానీ, అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ భాష, యాస అవహేళనకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో విజ్ఞుల నుంచి మేధావుల దాకా అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన తెలుగును మాత్రమే స్వచ్ఛమైన భాషగా ప్రకటించారు. తెలుగు అక్షరాలకు నుడికారాలు దిద్దింది, రాజరాజనరేంద్రుడి ఆస్థానంలోని నన్నయ్య భట్టారకుడని, ఆయనకు నారాయణబట్టు సహకరించాడంటూ చరిత్రకు కొత్త భాష్యం చెప్పారు. సంస్కృతాంధ్ర పదాలు, సంధులు, సమాసాలతో పక్కాగా అనువదించిన మహాభారత ఆదిపర్వాన్ని తొలి తెలుగు రచనగా ప్రకటించుకున్నారు. అరవై ఏళ్ల ఉమ్మడి ప్రయాణంలో తెలంగాణ తెలుగుకు గుర్తింపు దక్కలేదు. ఇక్కడ కవులు, రచయితలు, మేధావులు ద్వితీయ శ్రేణి వారిగా ఈసడించబడ్డారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీశ్రీ, గురజాడ అంటూ అంతా వారే రాజ్యమేలారు. కన్నడాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయులు ఉమ్మడి పాలకులకు కనిపించాడు తప్పా, మల్కిభరాముడుగా ప్రసిద్ధి గాంచిన మన కుతుబ్షాహీ ప్రభువు గుర్తుకు రాలేదు. సంస్కృతంతో నిండిన భారతమే తప్ప, స్వచ్ఛ తెలుగులో రాసిన పాల్కూరి సోమనాథుడు కనిపించలేదు.
ఐదు వేల ఏళ్ల వారసత్వం
తెలుగు భాషకు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉండగా, మనకు అంతేస్థాయిలో వారసత్వం ఉంది. హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచి, జర్మనీ, తదితర భాషలన్నీ సంస్కృతం నుంచి ఆవిర్భవించగా, తెలుగు మాత్రం భిన్నంగా ద్రావిడ భాష నుంచి ఉద్భవించింది. మధ్య ఆసియాప్రాంతంలో ఐదు వేల ఏళ్ల క్రితం విలసిల్లిన సుమేరియన్తో తెలుగు సమకాలినమైనదిగా తెలుస్తున్నది. వారితో తెలుగుకు సంబంధం ఉందని స్పష్టమవుతున్నది. సు మేరియన్ల రాజధాని నినివే వద్ద జరిగిన తవ్వకా ల్లో బయల్పడిన 25 వేల మట్టిప్రతులతో కూడిన రాత పుస్తకాల్లో తెలుగు అక్షరాలు, పదాలు కనిపిస్తున్నాయంటున్నారు తెలుగు శాస్త్రవ్తేతలు.
తెలంగాణలో ఆధారాలు
తెలుగు అక్షరాలకు నుడికారం దిద్దారని నన్నయ్య, నారాయణభట్టును చెప్పుకుంటున్నా, వాస్తవానికి వారి కంటే దాదాపు 200 ఏండ్ల ముందే తెలుగు భాష తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యం పొం దింది. మౌర్యుల తొలి చక్రవర్తి చంద్రగుప్తుడి పాలనాకాలంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ దేశంలోని వివిధ ప్రాంతాలను సంద ర్శించి రచించిన ఇండికా గ్రంథంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రులు అనే బలమైన రాజ్యం ఉందని పేర్కొన్నారు. శాతవాహనుల తొలి రాజధాని గోదావరి ఒడ్డున గల కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల అని చరిత్రకారులు చెప్పిన విషయం విదితమే. అందుకు ఇక్కడ జరిగిన తవ్వకాల్లో బయల్పడిన కోట, సీముకుడి నాణేలే నిదర్శనం. శాతవాహనుల్లో ప్రథముడిగా చెప్పుకునే సీముకుడి పేరిట ఉన్న నాణేలు లభించాయి. వీటిపై అక్షరాలు తెలుగు భాషకు మూలమైన బ్రాహ్మీ లిపిలో లిఖించబడ్డాయి. శాతవాహనులకు పూర్వం.. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం తొలి అర్ధభాగంలో పాలించిన రాణో నారయ, నాణో గోభద, రాణోసిరి కంపయకు చెందిన లభించిన నాణేలపై ప్రాకృత తెలుగులో పేర్లు ముద్రించబడి ఉన్నాయి. ధూళికట్ట వద్ద లభించిన ఒక శాసనంలో తెలుగు భాషకు దగ్గరగా ఉన్న బ్రాహ్మీలిపిలో గహవతినో పఠాలన మతూయదానమ్ అని రాయబడి ఉంది. ఒక గృహపతిచే దానం చేయబడింది అన్న అర్థంలో పేర్కొనబడిన ఈ శాసనం తెలుగు భాషా ప్రాచీనతను తెలియజేస్తున్నది. మన జిల్లాలోని కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్ట వద్ద క్రీస్తు శకం 945లో నివసించిన గొప్ప కవి పుంగవుడు జీనవల్లభుడు, కన్నడ కవిత్రయంలో ఒక్కడైన పంపా సోదరుడు. ఈయన కురిక్యాల ప్రాంతంలో త్రిభువన తిలకయను జైన బసదిని ఏర్పాటు చేశాడు. ఇక్కడే తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో శాసనాలను వేయించాడు. ఈ శాసంలో మూడు తెలుగు కంద పద్యాలు ఉండడం విశేషం. అందులో ఒక పద్యమిది.
కం॥ జిన భవనము లెత్తించుట
జినపూటల్ సేయుయున్కి జిన మునులకు
నత్తినయన్న దాన మీవుట
జినవల్లభు బోలగలరె జిన ధర్మవరుల్
అని పేర్కొన్నాడు. తెలుగు వ్యాకరణంలోని కంద పద్ధతికి కరీంనగర్ ప్రాంతమే పుట్టినిల్లు అని స్పష్టమైంది. అలాగే తెలుగులో పద్యంలోని మరో రీతి అయిన ద్విపద కావ్యం సైతం తెలంగాణలోనే ప్రా రంభమైంది. కాకతీయుల కాలానికి చెందిన పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత, బసవ పురాణాలను ద్విపద కావ్యాలుగా మలిచా డు. చరిత్రకు అందినంతలో అచ్చ తెలుగు పదాలతో కవిత్వాన్ని లిఖించిన మొదటి వ్యక్తి పాల్కూ రి సోమనాథుడే అని భాషాశాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కవుల కవి త్వం సంస్కృత భాషతో ప్రభావితం పొందగా, అందుకు భిన్నంగా తెలంగాణలో అచ్చ తెలుగు సాహిత్యం విలసిల్లింది. ముస్లింల పాలనలోనూ విశేషాదరణ లభించింది. కుతుబ్షాహీల పాలనలో రుద్రకవి, జగన్నాథుడు, అక్కన్న, మాదన్న తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేశారు.
ఆధునిక కాలంలో కొత్తపుంతలు
20వ శతాబ్దంలో తెలంగాణలో తెలుగు సాహి త్యం, భాష కొత్త పుంతలు తొక్కింది. నిజాం పాలనలో సైతం వికసించింది. నిజాం పాలనపై సమరభేరి మోగించిన పలువురు విప్లవకారులు తేటతేట తెనుగు భాషను, సామన్యులు మాట్లాడుకునే తెలుగును సమ్మిళితం చేసి తెలుగును దండిభాషగా మార్చివేశారు. వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రాంమూర్తి పంతులు కంటే నవ్యంగా, భవ్యంగా వారి సాహిత్యసేవ, సామాజిక బాధ్యత వెలుగొందింది. 1915 నవంబర్ 1న జన్మించిన వట్టికోట అళ్వారుస్వామి తెలుగు అభ్యున్నతికి శ్రమించారు. నిజాం రాజ్యానికి ఎదురు తిరిగి జైలుకెళ్లిన ఆయన, అక్కడే ‘జైలు లోపల’ అనే సంపుటిని వెలువరించారు. దాంతోపాటు ప్రజల మనిషి, గంగు నవలలను వ్యవహారిక భాషలో రాశారు. గంగు సామాన్యుల భాషలో వెలువడిన నవలగా మన్ననలు అందుకున్నది. దాశరథి సోదరులు తెలుగు సాహిత్యంలో అగ్నిధారలను కురిపించారు. కృష్ణమాచార్య రాసి న అగ్నిధార, రుద్రవీణ, మార్పు నాతీర్పు, ధ్వజమెత్తిన ప్రజ, తిమిరంతో సమరం విశ్వ ఖ్యాతిగించాయి. రంగాచారి రాసిన చిల్లరదేవుళ్లు, జీవనయానం, మోదుగుపూలు సైతం తెలుగు సాహిత్యంలో ధృవతారలే. ‘మన కొంపలు ఆర్పి, మనస్త్రీలను చెరిచిన మండలాధీశులను గుర్తుంచుకోవాలి.. కసి ఆరకుండా బుసకొట్టాలి.. కాలంబు రాగానే కాటేసీ తీరాలి.. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర వరకు తరిమికొడ్తాం.. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాణాలతోనే పాతర వేస్తాం’ అంటూ రణనినాదం చేసిన కాళొజీ నారాయణరావు తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. ఆయన రాసిన ‘నా గొడవ’ ప్రజల తిరుగుబాటుకు దారి చూపింది.
ఉమ్మడి జిల్లాలో వికాసం
ఉమ్మడి కరీంనగర్లో తెలుగు భాషా వికాసానికి అనేక ప్రముఖులు కృషి చేశారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, సింగిరెడ్డి నారాయణరెడ్డి, వచన, మినీ కవిత్వంతో అలిశెట్టి ప్రభాకర్. ఆచార్య వెలిచాల కొండల్రావు, కేవీ నరేందర్, జువ్వాడి గౌతమ్రావు, జైశెట్టి రాజయ్య, కాకుత్సం అనంతయ్య, అనుమండ్ల భూమయ్య, బీఎస్ రాములు, ఆచార్య మలయశ్రీ, సుజాత రెడ్డి, ముద్దసాని రాంరెడ్డి, ఎంవీ నర్సింహారెడ్డి, నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్, కేవీ మను, జూకంటి జగన్నాథం, చెన్నాడి వెంకట రమణారావు, శ్రీనివాసగౌడ్, ఇలా పలువురు జిల్లా నుంచి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేశారు. ఎంతో మంది కృషి చేస్తూనే ఉన్నారు.
ప్రాచీన హోదాకు అర్హత
రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాషలకు ప్రాచీన భాష హోదాను కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రాచీన భాషగా తమిళాన్ని గుర్తించిన అనంతరం, తెలుగును సైతం గుర్తించాలనే పోరాటం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రాచీన తెలుగుకు సంబంధించిన ఆధారాలను సేకరించడం ఆరంభమైంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రాం తంలో ఆనవాళ్లు లభించాయి. ఎట్టకేలకు ప్రభు త్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను గుర్తించి, ప్రకటించింది. అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు తెలుగు భాష ప్రాచీన హోదాను, దాని వల్ల లభించే నిధులను వారే అనుభవించే యత్నం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రాచీన హోదా వల్ల లభించే ప్రయోజనాలను తెలంగాణకు మాత్రమే వర్తింపజేయాలని మన రాష్ట్ర కవులు, కళాకారులు కోరుతున్నారు.