ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక విప్లవం నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం ‘టీఎస్ ఐపాస్’ కింద పరిశ్రమల స్థాపన జోరందుకున్నది. 2014కు ముందు కేవలం 588 పరిశ్రమలు మాత్రమే ఉండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రస్తుతం ఆ సంఖ్య 4,764కు చేరింది. వీటన్నింటినీ మొత్తం 19 వేల కోట్లతో ఏర్పాటు చేయగా, అందులో 34వేల పైచిలుకు మందికి ఉపాధి లభిస్తున్నది. మరోవైపు గడిచిన తొమ్మిదేళ్లలో కొత్తగా 263 రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. ఇంకోవైపు నిరంతర విద్యుత్ సరఫరాతో జనరేటర్లు కనుమరుగవడమే కాకుండా, పరిశ్రమలు 24 గంటలపాటు నడుస్తున్నాయి. తద్వారా ప్రొడక్షన్ పెరిగి, అన్ని రంగాల్లోని పరిశ్రమలు మార్కెట్లో అప్పుడప్పుడు ఏర్పడే ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని ముందుకెళ్తున్నాయి. స్వరాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి విజయవంతంగా సాగుతుండగా, రాష్ట్ర సర్కారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో విప్లవం సృష్టిస్తున్న పారిశ్రామిక రంగం, పెరుగుతున్న పెట్టుబడులు, తద్వారా సమకూరిన ఉపాధి అవకాశాల వంటి వివిధ అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
– కరీంనగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)
టీఎస్ఐపాస్ (2015) అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2023 జనవరి వరకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, తద్వారా కలిగిన ఉపాధి అవకాశాలు
యూనిట్లు 4,764
పెట్టుబడి 19,085 కోట్లు
ఉపాధి 34,964మంది
కరీంనగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : కొత్త పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పడితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రోత్సహిస్తున్నది. నాటి సమైక్య పాలనలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎదురైన అవంతరాలు, అవరోధాలను తొలగించేందుకు ఆదిలోనే శ్రీకారం చుట్టింది. ఆ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన పరిపాలన అనుమతులన్నీ కేవలం 30 రోజుల్లోనే వచ్చేలా రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వయం ధ్రువీకరణ వ్యవస్థ (టీఎస్ఐపాస్)ను 2015లోనే సీఎం కేసీఆర్ అమల్లోకి తెచ్చారు.
ఈ విధానం కింద వంద శాతం కరప్షన్ ఫ్రీతో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అందులో 23 విభాగాలకు సంబంధించిన దాదాపు 40 రకాల అనమతులను ఈ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వీటన్నింటికీ కేవలం నెల రోజుల గడువు మాత్రమే పెట్టింది. ఔత్సాహిక పారిశ్రామికులు ఒక పరిశ్రమను నెలకొల్పేందుకు అనువైన ధ్రువపత్రాలతో పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకుంటే.. కేవలం 30 రోజుల్లో సంబంధిత శాఖల అనుమతులన్నీ సదరు యజమానులకు వచ్చేలా టీఎస్ఐపాస్ కింద నిబంధనలు పెట్టింది. అంతేకాదు, ఔత్సాహిక పారిశ్రామికులు ఆయా విభాగాలకు తిరగాల్సిన అవసరం లేకుండా పకడ్బందీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అనుమతుల జారీ విషయంలో గడువు దాటితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా టీఎస్ఐపాస్లో నిబంధన పొందు పరిచారు.
జనరేటర్ మోతల్లేకుంటైనయి..
పై చిత్రంలో కనిపిస్తున్నది నల్ల సతీశ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో ఫెన్సింగ్ జాలీలు తయారు చేసే చైన్ లింక్ పరిశ్రమ నడుపుతున్నడు. ఐదేండ్ల కింద ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా మరో పది మందికి ఉపాధి చూపుతున్నడు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్తు ఇస్తుండడంతో ఏ బాధా లేకుండా దర్జాగా బతుకుతున్నడు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం కరెంట్ కోతలతో తాను పనిచేసిన ఎన్నో పరిశ్రమల పరిస్థితి అధ్వానంగా ఉండేదని సతీశ్ చెబుతున్నడు. అవును సతీశ్ చెప్పింది అక్ష్యర సత్యమే. నాడు తెలంగాణ రాక ముందు కరెంట్ కోసం పరిశ్రమల నిర్వాహకులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆనాడు కరెంట్ ఎపుడు ఉండేదో.. పోయేదో తెలిసేదికాదు. చిన్న పరిశ్రమలకు పెద్ద జనరేటర్ అవసరముండేది. ఇది వాడిన వారికి భరించ లేని ఖర్చులు మీద పడేవి.
ఈ సమస్య ఏ ఒకటి రెండు రోజులతో అయిపోయేది కాదు, నెలల తరబడి వెంటాడేది. గత్యంతరం లేక జనరేటర్లు పెట్టుకున్న నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయేవారు. అప్పట్లో సాధారణంగా ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలు మాత్రమే కోతలు విధిస్తున్నట్లు ప్రకటించేవాళ్లు. కానీ, నిత్యం కోతలే ఉండేవి. వేసవిలో అయితే పవర్ హాలీడేలు, పీక్ అవర్స్ అని రెట్టింపు కోతలు విధించే వాళ్లు. దీంతో పరిశ్రమలు సరిగ్గా నడవక లేబర్ ఖర్చులు మీద పడేవి. కూలీ గిట్టుబాటుకాక లేబర్ కూడా పనిలోకి వచ్చేది కాదు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్తు పారిశ్రామిక ప్రగతి పెరిగింది. నిర్వాహకులు దర్జాగా బతుకుతున్నారు. ఆశించిన ఉత్పత్తులు సాధిస్తూ లాభాలు గటిస్తున్నారు. కస్టమర్ ఆర్డర్ తీసుకుని అనుకున్న సమయానికి ఉత్పత్తులు అందించగలుగుతున్నారు. ఒక్కొక్కరూ నెలకు 20 వేలకు పైనే సంపాదించుకుంటున్నారు. నాణ్యమైన విద్యుత్తు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని సతీశ్, లాంటి ఎందరో పరిశ్రమల నిర్వాహకులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తప్పిన కరెంట్ తిప్పలు
దేశంలో ఎక్కడాలేని తరహాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అన్న తేడా లేకుండా 24 గంటల కరెంటు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. నాటి సమైక్య రాష్ట్రంలో పవర్ హాలిడే వల్ల వేసవిలో వారానికి మూడు నాలుగు రోజుల పాటు పరిశ్రమలు మూత పడేవి. జనరేటర్లు అమర్చుకున్నా డీజీల్ ఖర్చులు భరించలేక పారిశ్రామికులు ఇబ్బందులు పడేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాత్రీ పగలు అన్న తేడా లేకుండా విద్యుత్ సరఫరా అవుతున్నది. దాంతో పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడానికి మక్కువ చూపుతున్నారు. జనరేటర్లు పూర్తిగా కనుమరుగు కాగా, 24 గంటల విద్యుత్తో అన్ని రకాల ఫ్యాక్టరీలను నిరంతరం నడుపుతున్నారు. దీని ద్వారా ప్రొడక్షన్ పెరుగుతున్నది. అంతేకాదు, ఐటీ రంగం కూడా ఉమ్మడి జిల్లావైపు చూస్తున్నది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఐటీ టవర్ ఏర్పాటు చేయగా, అందులో దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తున్నది.
మౌలిక సదుపాయాలు
అనుమతులు ఇవ్వడంతోనే పరిశ్రమలు ఏర్పడవని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులిస్తూనే.. మరోపక్క అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక వేత్తల పురోగతి పథకాన్ని (టీ ఐడియా)ను అమల్లోకి తెచ్చింది. తద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. స్టాంప్ డ్యూటీ, విద్యుత్, వడ్డీ, పెట్టుబడి రాయితీ, మూలధన సాయం లాంటి ఎన్నో సేవలు, సౌకర్యాలను కల్పిస్తున్నది.
వెల్లువలా పరిశ్రమలు
ఉమ్మడి జిల్లాలో 2014 వరకు 588 పరిశ్రమలు ఉండగా, 192 కోట్ల పెట్టుబడి ఉంది. వీటిలో 2,603 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ఆనాటి గణాంకాలు చెబుతున్నాయి. కానీ, స్వరాష్ట్రంలో చూస్తే.. పూర్వ జిల్లాలో కొత్తగా 4,764 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 19,085 కోట్ల పెట్టుబడులు రాగా, 34,964 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతున్నది. ఇవేకాదు 2014 వరకు ఉమ్మడి జిల్లాలో రా రైస్, బాయిల్డ్ రైస్ కలిపి 542 రైస్మిల్లులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 805కు చేరింది. వరి విస్తీర్ణం భారీగా పెరగడంతో రైస్ మిల్లుల సంఖ్య భవిష్యత్లో ఇంకా ఏర్పాటు కానున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో చూస్తే 2014-15 నుంచి అందించిన రాయితీలు 47.3 వాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పదిహేను రోజుల్లోనే యూనిట్ మంజూరైంది
మాది దేశాయిపేట. నాకు పరిశ్రమ పెట్టి పారిశ్రామిక వేత్తగా ఎదగాలని, మరికొంత మందికి ఉపాధి చూపాలనే కల ఉండేది. తెలంగాణ రాష్ట్రం రాకముందు పలుసార్లు చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వివిధ స్కీమ్ల్లో దరఖాస్తు చేసి, సబ్సిడీ కోసం, పెట్టుబడి రుణం కోసం చాలా ప్రయత్నించా. కానీ, ఏ ఒక్క ప్రయత్నం ఫలించలేదు. అటు పరిశ్రమల శాఖ అంగీకరిస్తే ఇటు బ్యాంకులు లోను ఇచ్చేవికావు. ఒకవేళ బ్యాంకులు సహకరిస్తామంటే, ప్రభుత్వ సంస్థలు సహకరించకపోతుండేవి. దీంతో పరిశ్రమ ప్రారంభించాలన్న ఆలోచననే మానుకొని, విధి లేని పరిస్థితులో ఇతర రంగాల్లోకి వెళ్లా. అయితే తెలంగాణ వచ్చాక మళ్లీ ఆశ పుట్టింది. మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టా. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తీసుకువచ్చిన సింగిల్ విండో ప్రోగ్రామ్ అయిన టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేశా. పేపర్ ప్లేట్ల తయారీకి రుణం, సబ్సిడీ అందజేయాలని కోరా. అయితే ఈ పని పూర్తికావాలంటే కనీసం ఆరేడు నెలలైనా పడుతుందని అనుకున్నా. కానీ 15 రోజుల్లోనే పేపర్ ప్లేట్ల యూనిట్ మంజూరైంది. 25 లక్షలతో మా ఊళ్లోనే పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ను 2018లో ప్రారంభించా. ఇందు కోసం 1.25 లక్షలు పెట్టుబడిదారుడి వాటాగా చెల్లించా. మిగిలిన 23.75లక్షల రుణాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. 15శాతం సబ్సిడీ అందిస్తామని చెప్పింది.
అదే టీఎస్ఐపాస్ లేకముందు అనుమతులు కావాలంటే చానా ఇబ్బందులు ఉండేవి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సింగిల్ విండో స్కీమ్ కింద దరఖాస్తును సరైన ఫార్మెట్లో అందజేస్తే నెల లోపే రుణంతోపాటు ఇతర సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఐదేండ్ల కింద మొదలు పెట్టిన మా పేపర్ ప్లేట్ల తయారీ వ్యవస్థ క్రమంగా విస్తరించడం మొదలైంది. రెండేండ్లు గడిచిన తర్వాత మరికొంత పెట్టుబడి పెట్టి, తయారీ ప్లాంట్ను విస్తరించా. ప్రతి రోజూ 30వేల ప్లేట్లను తయారు చేస్తున్నాం. వివాహాలు, శుభకార్యాలు అధికంగా ఉండే సీజన్లో ఇంకా ఎక్కువ మొత్తంలో తయారు చేస్తున్నాం. మా పేపర్ ప్లేట్లను మార్కెటింగ్ చేయడానికి ఆటోలను సమకూర్చుకున్నాం. జగిత్యాల, కోరుట్ల, మెట్పెల్లి ప్రాంతాల్లో విక్రయిస్తున్నాం. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నా. మరో 30 మందికి ఉపాధి చూపుతున్నా. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే తయారీని మరింత పెంచడంతోపాటు మార్కెటింగ్ పరిధిని సైతం విస్తరించాలని అనుకుంటున్నాం. ఇప్పటికైతే చాలా హ్యాపీగా ఉన్నా.
– రాజిరెడ్డి, దేశాయిపేట (బీమారం మండలం)