గోదావరిఖని : బొగ్గు ఆధారిత సిమెంటు, స్పాంజ్, ఐరన్, సిరామిక్స్, ఫార్మా లాంటి పరిశ్రమలు నేటి క్లిష్టమైన మార్కెట్ పరిస్థితుల్లో మనుగడ సాగించలేకపోతున్నాయని, అవి మనుగడ సాగించాలంటే సింగరేణి సంస్థ తన బొగ్గు ధరను తగ్గించాల్సిన అవసరం ఉందని విద్యుత్తేతర పరిశ్రమల యాజమాన్యాలు మొర పెట్టుకున్నాయి. సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉండటంతో తమ పరిశ్రమల మనుగడ, తమపై ఆధారపడిన వేల మంది చిరుద్యోగుల భవిష్యత్ కోసం విదేశాల నుంచి, ఇతర బొగ్గు సంస్థల నుంచి తక్కువ ధరకు బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని అన్నారు.
తొలిసారిగా అన్ని ఏరియాల జీఎంలు, క్వాలిటీ జీఎంలు, క్వాలిటీ ఇన్చార్జిలతో కలిసి సింగరేణి భవన్లో గురువారం సంస్థ నిర్వహించిన విద్యుత్తేతర పరిశ్రమల సమావేశంలో దాదాపు 60కి పైగా సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఏడాది సింగరేణి ఉత్పత్తి చేసిన 70 మిలియన్ టన్నుల బొగ్గులో 9 మిలియన్ టన్నులను విద్యుత్తేతర పరిశ్రమలు కొనుగోలు చేశాయని, ఈ ఏడాది కేవలం 5 మిలియన్ టన్నులను మాత్రమే తీసుకోవడానికి కారణం ఏమిటని ఈ సందర్భంగా సీఎండీ ఎన్ బలరామ్ అడిగారు.
అందుకు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ.. సింగరేణితో తమకు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. రవాణా సమస్యలు లేకుండానే సింగరేణి నుంచి బొగ్గు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. కానీ పోటీ మార్కెట్లో ఇప్పటికే తాము ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, సింగరేణి బొగ్గు ధరలు ఎక్కువ ఉన్నందున తాము అంతకన్నా తక్కువ ధరకు బొగ్గు అందిస్తున్న కోలిండియా, విదేశీ బొగ్గు సంస్థల వైపు మొగ్గు చూపాల్సి వస్తోందని అన్నారు. దూర ప్రాంతాల నుంచి బొగ్గును కొనుగోలు చేస్తున్నప్పటికీ సింగరేణి ధరతో పోల్చితే తక్కువకే లభిస్తోందని చెప్పారు.
బొగ్గు ధరను తగ్గిస్తే సింగరేణి నుంచి పూర్తిగా కొనుగోలు చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. బొగ్గు నాణ్యత విషయంలోనూ వారు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులకు సీఎండీ ఎన్ బలరామ్ ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వినియోగదారుల ప్రయోజనాలను, సింగరేణి మార్కెట్ను రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలపై సమాలోచనలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కొన్ని రోజుల్లో సింగరేణి నుంచి బొగ్గును కొనాలని ఆయన కోరారు. త్వరలో మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు డి సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), ఎగ్జిక్యూటివ్ కోల్ మూమెంట్ ఎస్డీఎం సుభానీ, జీఎం (మార్కెటింగ్) డి రవి ప్రసాద్, జీఎం (సీపీపీ) మనోహర్, ఓఎస్డీ (మార్కెటింగ్) ఎన్వీ రాజశేఖరరావు, డీజీఎంలు సురేందర్ రాజు, శ్రీవాస్తవ, అడిషనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవభారత్, ఐటీసీ, ఓరియంట్ సిమెంట్, అల్ట్రా టెక్ సిమెంట్, దివీస్ ల్యాబరేటరీస్, హెటిరో ఫార్మా, సిర్పూర్ పేపర్ మిల్స్ తదితర సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.