విద్యానగర్, ఫిబ్రవరి 4: సమాజంలో ఏ రంగానికీ లేని గౌరవం ఒక వైద్య వృత్తికే ఉందని, అందుకే డాక్టర్లు దైవంతో సమానమని, ప్రత్యక్ష దేవుళ్లుగా భావిస్తూ ‘వైద్యో నారాయణోహరి’ అని పిలుస్తుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. ఆదివారం కరీంనగర్ బైపాస్ సమీపంలోని వీ కన్వెన్షన్లో 9వ తెలంగాణ ఆర్థ్దోపెడిక్ డాక్టర్ అసోసియేషన్ 9వ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ గురువారెడ్డి, బంగారి స్వామి సహా పలువురు డాక్టర్లతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థోపెడిక్ సర్జన్స్ సదస్సును కరీంనగర్లో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మాములుగా ఇలాంటి కాన్ఫరెన్స్లు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్కత్తా వంటి మెట్రో నగరాల్లో మాత్రమే నిర్వహిస్తారన్నారు. ఢిల్లీ ఎయిమ్స్, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కత్తా వంటి నగరాల్లోని కార్పొరేట్ దవాఖానల్లో పేరుగాంచిన సర్జన్స్ ఇకడికి వచ్చి ఆర్థోపెడిక్ రంగంలో వస్తున్న మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీ, కొత్తకొత్త సర్జరీ పద్ధతులపై ప్రాక్టికల్గా వివరిస్తూ జూనియర్ డాక్టర్లకు అవగాహన కల్పిస్తుండడం గొప్ప విషయమమన్నారు.
తనకు చాలా బాధ కలిగించే విషయం ఏందంటే కొన్నేండ్లు రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, క్షతగాత్రులు సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యం అందించడంలో మీ రోల్ చాలా ముఖ్యమని సూచించారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ని వైద్యులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్భాస్కర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మోతీలాల్, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ వీరారెడ్డి, వెంకట్రెడ్డి, రామ్రెడ్డి, కుమార్గౌడ్ నారగోని, రమాకాంత్ పాల్గొన్నారు.