ధర్మపురి, ఆగస్టు 1: సమైక్య రాష్ట్రంలో పాలకులు పట్టణాల్లో ప్రజలకు సరైన కూరగాయల మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్ల అంగడ్లను తెరిచేశారు. పట్టణవాసులు ఇవన్నీ కొనాలంటే ఇబ్బందికర వ్యవస్థగా మారిపోయింది. అవసరమైన వస్తువుల కోసం సిటీ మొత్తం తిరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే సీఎం కేసీఆర్ పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సమీకృత మార్కెట్లు నిర్మించాలని, అందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో జిల్లాలో మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మాణాలు చేపట్టగా, ధర్మపురి మార్కెట్ పూర్తయింది.
4కోట్లతో నిర్మాణం..
ధర్మపురి సమీకృత మారెట్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ధర్మపురి పట్టణం నడిబొడ్డున ఎకరంన్నర స్థలంలో అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా తొలుత రూ.2కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే మధ్యలో నిధులకు ఇబ్బంది రావడంతో మంత్రి కొప్పుల చొరవ తీసుకొని మరో రూ.2కోట్లను కోట్లు విడుదల చేయించారు. మొత్తం 4కోట్ల వ్యయంతో సకల హంగులతో నిర్మించారు. ఇందులో రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులకు సౌకర్యంగా 80 వెజ్ స్టాల్స్, 24 నాన్ వెజ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, ప్రారంభమైతే పట్టణ ప్రజల సరుకుల కొనుగోలు బాధలు తీరనున్నాయి.