Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 19 : చేయూత పథకం కింద పింఛన్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జే అరుణ శ్రీ స్పష్టం చేశారు. మధ్యవర్తులు, దళారులు ఇళ్ల వద్దకు వచ్చి చేయూత పింఛన్లు ఇప్పిస్తామంటే నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్ను పారదర్శకంగా అందించేందుకు కలెక్టర్ నియమించిన డిజిగేట్నటెడ్ వెరిఫికేషన్ ఆఫీసర్ (డీవీఓ)తో రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో దరఖాస్తుల పరిశీలన, క్షేత్ర స్థాయి విచారణ జరుగుతుందని తెలిపారు. డీవీఓలు నేరుగా మీ ఇళ్ల వద్దకే వచ్చి దరఖాస్తులో పేర్కొన్న వివరాలను, అవసరమైన ధృవపత్రాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈ క్షేత్ర స్థాయి విచారణ ముగిసిన తర్వాత ప్రభుత్వ నిబంధనలకు లోబడి అర్హత కలిగిన వారికి పింఛన్ మంజూరు చేస్తారని తెలిపారు. అంతేగానీ చేయూత పింఛన్ కోసం ఆశపడి మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు.