జగిత్యాల, ఆగస్టు 22 : మత్స్యకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, వర్షాకాలం ఆరంభంలో పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు డిసెంబర్, జనవరిలో చెరువుల్లో పోయడం వల్ల పిల్లలు ఎదుగక తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాయికల్, చెర్లకొండాపూర్ గ్రామాల మత్స్య సహకార సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తోపారపు రజనీకాంత్ శనివారం జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన మత్స్య సహకార సంఘాల సభ్యులను జీవన్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని కుల వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరంభం నుంచే అప్పటి సీఎం కేసీఆర్ చెరువులు, కుంటలపై మత్స్యకారులు, గంగపుత్రులు, ముదిరాజులకు ఆధిపత్యం కల్పించారని గుర్తుచేశారు. అయితే కొన్ని గ్రామాల్లో మత్స్యకారుల సొసైటీల ఏర్పాటుకు భూస్వామ్య వర్గాలు ఆటంకాలు సృష్టిస్తున్నాయని, గంగపుత్రులు, ముదిరాజుల విజ్ఞప్తి మేరకు అధికారులు చొరవ తీసుకుని ఆయా గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేయాలని, సొసైటీలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారం అందించాలని సూచించారు.
జిల్లాలో 700కు పైగా చెరువులు ఉండగా, గతేడాది కేవలం 250 చెరువుల్లో మాత్రమే విత్తనాలు పోశారని, మిగతా వాటిని ఎందుకు విస్మరించారో చెప్పాలన్నారు. పంపిణీ చేయడం ప్రభుత్వానికి చేతగాకపోతే చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా కావల్సిన చేప పిల్లలకు అవసరమయ్యే నిధులను మత్స్యకారుల సొసైటీలకు రూపంలో అందిస్తే, వారే నాణ్యమైన చేపనారును కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. జగిత్యాలలోని మోతె, ముప్పారపు, కల్లెపల్లి చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని కాపాడాలని కోరారు. ఇక్కడ కార్యక్రమంలో మత్స్యకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.