Vemulawada | వేములవాడ, జూలై 22 : తెలంగాణ జానపద కళ ఒగ్గు కథ ఇక అగ్రరాజ్యాన వేదికగా కళా ప్రదర్శనకు అవకాశం దక్కింది. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో ఒగ్గు కథకు ఉన్న ఆదరణ తెలియనిది కాదు. 50 సంవత్సరాల పాటు వేములవాడ ప్రాంతానికి చెందిన దివంగత మిద్దె రాములు ఒగ్గు కథ ప్రదర్శనలు లక్షలాదిగా ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికగా 1990లో మార్సిస్ వేదికగా తెలంగాణ బోనమెత్తి గజ్జ కట్టి ప్రదర్శించి కూడా మెప్పించారు. ఆయన వారసులుగా ఉన్న మిద్దె పరుశరాములు, వినీత్ ఒగ్గు కథ జానపద కళను అందిపుచ్చుకొని అనేక ప్రదర్శనలు అందించారు.
అయితే అమెరికా సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబోట్ల ఆనంద్ ఆధ్వర్యంలో సిలికాన్ ఆంధ్ర 25వ రజితోత్సవ వేడుకలను నిర్వహిస్తుండగా వేడుకల్లో ఒగ్గు కథ కళా ప్రదర్శనను అందించాల్సిందిగా వీరిని ఆహ్వానించారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఓక్లాండ్ అరేన లో ఆగస్టు 1న జరిగే వేడుకల్లో వీరు తమ ఒగ్గు కథను ప్రదర్శించనున్నారు. అమెరికా వేదికగా తెలంగాణ జానపద కళను ప్రదర్శించబోతున్న సందర్భంగా కళాకారులు వారిని అభినందించారు. జానపద కళ ఒగ్గు కథను ప్రదర్శించే అవకాశం రావడం కూడా ఆనందంగా ఉందని వారు తెలిపారు.