Beedi Workers | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 21 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా బీడీలు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది. యూనియన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొందరు నగదు పేరుతో బీడీల తయారీ చేపట్టి కార్మికులకు తక్కువ కూలి చెల్లిస్తున్నారని ఆరోపించారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి కార్మిక సంక్షేమ సదుపాయాలు కల్పించకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని కూడా ఎగ్గొడుతున్నారని పేర్కొన్నారు.
అక్రమంగా బీడీలు తయారు చేయడం వల్ల కార్మికులు ఉపాధి, సంక్షేమ ప్రయోజనాలు కోల్పోతుండటంతో పాటు, చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీడీ కంపెనీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. అందువల్ల జిల్లాలో లైసెన్స్ లేకుండా బీడీలు తయారు చేస్తున్న సంస్థలపై, అలాగే ఒక కంపెనీ లైసెన్స్తో మరో కంపెనీ పేరుతో బీడీలు తయారు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా కార్యదర్శి సూరం పద్మ, జిల్లా ఉపాధ్యక్షుడు జిందన్ కమలాకర్ పాల్గొన్నారు.