హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 22( నమస్తే తెలంగాణ): దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగరలో పీవీ జ్ఞానవేదిక ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లను విడుదల చేసిందని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతులను పీవీ శతజయంతి వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుతో కలిసి పీవీ నరసింహారావు కుటుంబసభ్యులకు అందజేశారు. పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఇప్పటికే గ్రామాన్ని సందర్శించి కార్యాచరణ రూపొందించామని మంత్రి తెలిపారు. పీవీ ఇంటిని మ్యూజియంగా రూపొందించడంతోపాటు, అక్కడే విజ్ఞాన వేదిక, థీమ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని వివరించారు. అనంతరం కే కేశవరావు మాట్లాడుతూ.. జ్ఞానవేదిక, థీమ్ పార్క్ నమూనా బాగుందని తెలిపారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పీవీ కుమార్తె వాణీదేవి, కుమారుడు ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.