జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు సంజయ్, సుంకె
జగిత్యాల, డిసెంబర్ 19: సర్కారు దవాఖానల్లో నాణ్యమైన వైద్యమందుతున్నదని జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. సమీప భవిష్యత్లో జగిత్యాల జిల్లా మెడికల్ హబ్గా మారనున్నదని చెప్పారు. ఆదివారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంవద్ద స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ వితరణ చేసిన అంబులెన్స్ను వారు ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం విరివిగా నిధులు వెచ్చించి సర్కారు వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందని జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డా. సంజయ్కుమార్, సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శ్రీకారం చుట్టిన గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా తెలంగాణ స్టేట్ స్టోన్క్రషర్స్ అసోసియేషన్ బాధ్యులు రూ. 22లక్షల విలువైన అంబులెన్స్ను వితరణ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాల, కొడిమ్యాల మండలాలకు సంబంధించిన అంబులెన్సు ప్రారంభించడం ఆనందంగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ‘108’ ద్వారా సత్వర వైద్యసేవలు అందుతున్నాయన్నారు. కొడిమ్యాల, మల్యాల మండలాల ప్రజలు అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ బాధ్యులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలగూరి దామోదర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్ రావు, పోతారం విండో చైర్మన్ అయిల్నేని సాగర్ రావు, సుదర్శన్, మహిపాల్ రెడ్డి, నాయకులు బోగ ప్రవీణ్, దావ సురేశ్, పంబాల రాము, బండారి విజయ్, బొడ్ల జగదీశ్, అల్లె గంగసాగర్, బాల ముకుందం, అసోసియేషన్ సభ్యులు పర్వతనేని రమేశ్, సంకె మహేశ్ పాల్గొన్నారు.