లబ్ధి కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు
వారిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
బోయినపల్లి, ఆగస్టు 13: రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ప్రతిపక్షాలకు ఇక కాలం చెల్లింది.. వారిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు.. అని చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన 48మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ఒకరికి షాదీముబారక్ ద్వారా 49.6లక్షల విలువైన చెక్కులను అందజేసి, మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ హయాంలో పేద లు, రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరిట కోట్లాది రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్లు చెల్లించి గుత్తేదారుల అవతారమెత్తి దోచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో ముందుగా, చెరువులు, కుంటలను పునరుద్ధరించారని చెప్పా రు. కాళేశ్వరం, శ్రీ రాజరాజేశ్వర జాలాశయం ద్వారా నిండుతున్న చెరువులు, కుంటలు కండ్లకు కనిపించడం లేదా అని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలతో రైతులు సంబురంగా సాగు చేసుకుంటున్నా.. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయ డం సిగ్గుచేటన్నారు. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దనే కల్యాణలక్ష్మి ద్వారా లక్షానూట పదహార్లు అందిస్తున్నారని వివరించారు. అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ తహసీల్దార్ యుగేంధర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్కుమార్, సర్పంచులు ఇల్లందుల శంకర్, బూర్గుల నందయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, ఎంపీటీసీ ఉపేందర్, టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, నాయకులు స్వామి, శంకర్, మల్లారెడ్డి, రాములు, కొండగట్టు ఆలయ కమిటీ సభ్యుడు ముద్దం రవి, ఏఎంసీ డైరెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.