హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అని పట్టభద్రులు తేల్చిచెప్పారు. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడేది గులాబీ పార్టీయేనని మరోసారి స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను పటాపంచలు చేస్తూ తీర్పునిచ్చారు. టీఆర్ఎస్కు మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉద్యమకారులు దూరమవుతున్నారన్న ప్రచారాన్ని ఓటుతో తిప్పికొట్టారు. ఉద్యమకాలంలో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించింది కేవలం టీఆర్ఎస్సేనని విశ్వసిస్తున్నట్టు తాజా ఫలితాలతో వెల్లడైంది. ఆరున్నరేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి కండ్లముందు కనిపిస్తుంటే.. కావాలనే విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయన్న విషయాన్ని గ్రహించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నిరంతర కరెంట్, పుష్కలమైన నీరు, మిషన్భగీరథ, కేసీఆర్కిట్స్, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని గమనించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిహాసం చేస్తూ నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనన్న టీఆర్ఎస్ వాదనతో మేధావులు ఏకీభవించారు. టీఆర్ఎస్పై బీజేపీ చేసిన ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టి ఓటుతో సీఎం కేసీఆర్కు అండగా నిలిచారు. రోజుకో ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేట్పరం చేస్తున్న కేంద్రంలోని బీజేపీకి ఓటేస్తే వాటిని ఆమోదించినట్టే అవుతుందని, ఈ తరుణంలో తెలంగాణ సమాజం చైతన్యాన్ని ప్రదర్శించాలన్న మంత్రి కేటీఆర్ మాటలతో పట్టభద్రులు ఆలోచించారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం ఏకమై రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తులకు గుణపాఠం చెప్పాలని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్భోదను మననం చేసుకొని టీఆర్ఎస్వైపే ఉంటామని ఫలితాలతో స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓట్లకోసం అడ్డదిడ్డమైన విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు.