ఇస్లామాబాద్: పాకిస్థాన్ సర్కారుపై ఆ దేశ మాజీ ప్రధాని, ‘పాకిస్థాన్ తెహ్రిక్ – ఎ – ఇన్సాఫ్ (PTI)’ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ సర్కారు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐని నిషేధిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పీటీఐని నిషేధిస్తే మరో కొత్త పార్టీ పెట్టి గెలిచి చూపిస్తానని ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పాకిస్థాన్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (PML) పార్టీ అధికారంలో ఉన్నది. సెహబాజ్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పలు కేసులు పెట్టింది. ఆయన నేతృత్వంలోని పీటీఐని బ్యాన్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని మీడియా ఇమ్రాన్ ఖాన్ ముందు ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు.
‘నా పార్టీని బ్యాన్ చేస్తే మరో కొత్త పేరుతో పార్టీని స్థాపించి ఎన్నికల్లో గెలిచి చూపిస్తా’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ‘నాపై అనర్హత వేటు వేసినా, తప్పుడు కేసులతో తనను జైల్లో పెట్టినా, నా పార్టీ గెలుపు మాత్రం తథ్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు పీటీఐని నిషేధించాలని డిమాండ్ చేస్తుండటంపై ఖాన్ మండిపడ్డారు.