ఇస్లామాబాద్: ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ ఉండదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరీ తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై ఇవాళే ఓటింగ్ నిర్వహించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సమావేశమైన సభ మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు వాయిదా పడింది. కానీ ఓ పాకిస్థాన్ మీడియా సమాచారం మేరకు, ఇవాళ పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగదని స్పష్టమవుతోంది.
మంత్రి ఫవద్ చౌదరీ మాట్లాడుతూ.. ఇమ్రాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను వచ్చే వారం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అవిశ్వాసంపై ఎక్కువ సమయం తీసుకోమని, అయితే ఓటింగ్కు ముందు సభలో బెదిరింపు లేఖ గురించి విదేశాంగ మంత్రి వెల్లడిస్తారని ఫవద్ తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. పీటీఐ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించదని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్లమెంట్లోని పీటీఐ సభ్యులు సుదీర్ఘ చర్చలో పాల్గొనాలన్న ఆదేశాలు ఉన్నాయని, సమయం తక్కువగా ఉన్న కారణంగా ఓటింగ్ జరగకపోవచ్చు అని భావిస్తున్నారు.
అయితే అసెంబ్లీ సెక్రటేరియట్ భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇమ్రాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళే ఓటింగ్ జరగాలని, లేదంటే స్పీకర్పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అవుతుందని అసెంబ్లీ సెక్రటేరియేట్ తెలిపారు.