వాషింగ్టన్: అమెరికాలోని న్యూ మెక్సికో నగరంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. రెడ్ రివర్ ఏరియాలో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హెలిక్యాప్టర్ ద్వారా డెన్వర్లోని ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన మరో నలుగురిని అల్బుకార్క్లోని హోలీక్రాస్ ఆస్పత్రికి, న్యూ మెక్సికో హెల్త్ యూనివర్సిటీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు. కాల్పులకు పాల్పడిన నిందితులు అందరినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెడ్ రివర్ మెమోరియల్ డే సందర్భంగా రెడ్ రివర్ ఏరియాలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో జనం వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారు. కాగా, న్యూ మెక్సికోలో రెండు వారాల వ్యవధిలోనే రెండు సార్లు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలవరపెడుతున్నది. ఈ నెల 16న జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు.