వాషింగ్టన్: ఒక యువతి తన ప్రియుడి బిడ్డకు స్క్రూలు, బ్యాటరీలు తినిపించి హత్య చేసింది. (Woman Kills Boyfriend’s Child) ఏడాదిన్నర పాప బెడ్ పైనుంచి పడటంతో తలకు గాయమై అపస్మారక స్థితికి చేరినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మరణించగా పోస్ట్మార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది జూన్ 25న 18 నెలల కుమార్తె ఐరిస్ రీటా అల్ఫెరాను తండ్రి బెయిలీ జాకోబీ తన ప్రియురాలైన 20 ఏళ్ల అలీసియా ఓవెన్స్కు అప్పగించాడు. షాపులో వస్తువులు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే ప్రియురాలు ఓవెన్స్ అతడికి ఫోన్ చేసింది. బెడ్ పైనుంచి కింద పడిన అతడి కుమార్తె అస్వస్థతకు గురైనట్లు చెప్పింది.
కాగా, వెంటనే ఇంటికి తిరిగివచ్చిన జాకోబీ తన బిడ్డ అచేతనంగా పడి ఉండటం గమనించాడు. వెంటనే అత్యవసర నంబర్కు ఫోన్ చేశాడు. తొలుత స్థానిక ఆసుపత్రికి తర్వాత మెరుగైన చికిత్స కోసం పీటర్స్బర్గ్లోని పిల్లల ప్రత్యేక ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించారు. అయితే నాలుగు రోజుల చికిత్స తర్వాత అవయవ వైఫల్యం వల్ల ఆ చిన్నారి చనిపోయింది.
మరోవైపు పోస్ట్మార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చిన్నారికి బటన్ ఆకారపు బ్యాటరీలు, స్క్రూలు, నెయిల్ పాలిష్, వాటర్ బీడ్స్ వంటి విషపదార్థాలు తినిపించినట్లు తెలిసింది. దీంతో అలీసియా ఓవెన్స్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మొబైల్ ఫోన్ను పరిశీలించగా 2023 ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో పిల్లలకు తీవ్రమైన హాని, మరణం కలిగించే వస్తువులు, మందులు, బ్యూటీ ప్రోడక్ట్స్ వంటి సమాచారం కోసం ఆమె సెర్చ్ చేసినట్లు గుర్తించారు.
కాగా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత జాకోబీ బిడ్డ మరణానికి అతడి ప్రియురాలు ఓవెన్స్ కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ నేపథ్యంలో జనవరి 11న ఆమెను అరెస్ట్ చేశారు. చిన్నారి ఐరిస్ తన తల్లి ఎమిలీ అల్ఫెరా, తాత ఇంట్లో ఉండేదని పోలీసులు తెలిపారు. అయితే కేవలను కుమార్తెను చూసే హక్కులు ఉన్న జాకోబీ ఆ పాపను తన ఇంటికి తీసుకువచ్చాడని చెప్పారు. అతడి ప్రియురాలు ఓవెన్స్ నెల రోజులుగా స్క్రూలు, బ్యాటరీలు వంటివి తినిపించి పాపను చంపినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.