న్యూయార్క్, అక్టోబర్ 16: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న హెచ్అండ్ఎల్ క్యాటగిరీ వీసాల జారీని వేగవంతం చేసింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించనున్నట్టు సంకేతాలిచ్చింది. హెచ్అండ్ఎల్ క్యాటగిరీ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను విడుదల చేసినట్టు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. దీనివల్ల 833 రోజులున్న వీసా నిరీక్షణ సమయం కూడా భారీగా తగ్గనున్నది. ప్రస్తుతం అమెరికా వీసాల కోసం భారతీయులు నిరీక్షించే సమయం ఇతర దేశాల కంటే ఎక్కువ. ఆ సమయం సగానికి తగ్గనున్నది.
‘ఉద్యోగ వీసాల కోసం ఇటీవల భారతీయుల నుంచి వస్తున్న భారీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హెచ్అండ్ఎల్ వర్కర్స్, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను ప్రారంభించాం’ అని యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది. ‘వీసా కోసం ఇప్పటికే వేల మంది అపాయింట్మెంట్ బుక్ చేసుకొన్నారు. ఇంటర్వ్యూ మినహాయింపు, మొదటిసారి అపాయింట్మెంట్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించాం. ఈ బల్క్ అపాయింట్మెంట్ స్లాట్ల ప్రారంభం హెచ్అండ్ఎల్ ఉద్యోగుల పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం’ అని వెల్లడించింది. 2022లో తొమ్మిది నెలల్లో యూఎస్ మిషన్ టు ఇండియా లక్షా 60వేల వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసిందని, వనరులకు అనుగుణంగా హెచ్అండ్ఎల్ ఉద్యోగులకు వీసా అపాయింట్మెంట్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం కొనసాగిస్తామని న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో పనిచేసే మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫిన్ తెలిపారు. ఇందుకోసం అదనపు తాత్కాలిక సిబ్బందితోపాటు డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. కొవిడ్కు ముందున్నంత సిబ్బందిని నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ల్యాప్స్ అయిన యూఎస్ వీసాదారులకు అపాయింట్మెంట్ అవసరం లేదని స్పష్టం చేశారు.