US Shutdown | ఆఖరు నిమిషంలో అగ్రరాజ్యం అమెరికాకు షట్డౌన్ ముప్పు తప్పింది. స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ ప్రత్యేక చొరవ తీసుకుని.. మొండి వైఖరి వ్యవహరిస్తున్న రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలించాయి. ఫలితంగా వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు ఆఖరు నిమిషంలో ఆమోదం లభించింది. మొత్తంగా బిల్లుకు 335 మంది అనుకూలంగా.. 91 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆఖరు నిమిషంలో ప్రతినిధుల (దిగువ) సభలో ద్రవ్య బిల్లు పాసైంది. దీంతో 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందులు లేకుండా పోయాయి.
అమెరికాలో ఆర్థిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. అక్టోబర్ 1(ఆదివారం ) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల లోపు ఈ బిల్లు పాసవ్వావలి. అప్పుడే అక్టోబర్ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ ఉద్యోగులకు వేతనాలు, వివిధ పథకాలకు నిధులను అందించడం సాధ్యపడుతుంది. లేదంటే అవన్నీ స్తంభించిపోయే ప్రమాదం ఉండేది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని అదునుగా తీసుకుని జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు భావించారు. ఈ క్రమంలోనే సరిహద్దు భద్రత ఏజెన్సీతో పాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం కోత విధించడాన్ని తప్పుబట్టింది. అలాగే రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు నిధులు ఇవ్వాలనే బిల్లును కూడా రిపబ్లికన్లు తిరస్కరించారు.
దిగువ సభలో మొత్తం 435 మంది సభ్యులకు గానూ ప్రస్తుతం 433 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 221 మంది రిపబ్లికన్ పార్టీకి, 212 మంది అధికారిక డెమోక్రాట్లకు చెందిన వారు ఉన్నారు. దిగువ సభలో బైడెన్ సర్కార్కు మెజార్టీ లేకపోవడంతో కీలకమైన ఈ బిల్లుల ఆమోదానికి డెమోక్రాట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎలాగైనా షట్డౌన్ పరిస్థితులను నివారించాలనే ఉద్దేశంతో స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ రంగంలోకి దిగారు. ప్రతిపక్ష రిపబ్లికన్లతోనూ చర్చలు జరిపారు. చివరి నిమిషంలో ఆయన చర్చలు ఫలించాయి. దీంతో దిగొచ్చిన రిపబ్లికన్లు.. స్పీకర్ ప్రతిపాదించిన స్వల్పకాల బిల్లుకు మద్దతిచ్చారు. రానున్న 45 రోజులకు సరిపడే నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.