ఐరాస, నవంబర్ 22: ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకో మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నారని, హంతకులు కుటుంబసభ్యులు లేదా సన్నిహితులేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తంచేశారు. విస్తృతంగా సాగుతున్న హక్కుల ఉల్లంఘన ఇదేనని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. ‘మహిళలపై హింస నిర్మూలన’ దినోత్సవాన్ని ఈ నెల 25న జరుపుకోనుండగా గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మహిళలు శారీరక హింస, దూషణకు గురవుతున్నారన్నారు. ఆన్లైన్లోనూ మహిళలపై వేధింపులు, హింస కొనసాగుతున్నాయన్నారు.
మహిళలు అన్ని రంగాలలో సమాన భాగస్వాములు కాలేకపోతున్నారని, హక్కులు, స్వేచ్ఛ కోల్పోతున్నారని ఫలితంగా నేడు ప్రపంచానికి అవసరమైన ఆర్థిక పునరుజ్జీవం, సుస్థిర అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. మహిళలపై హింసకు చరమగీతం పాడేందుకు ఇదే తగిన సమయమని అన్నారు. ప్రభుత్వాలు మహిళా హక్కుల కోసం పోరాడే సంస్థలకు ఇచ్చే నిధులను 50 శాతం పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు మహిళా హక్కులకు మద్దతుగా గళం విప్పాలని, ‘మేము కూడా ఫెమినిస్టులం’ అని గర్వంగా ప్రకటించాలని పిలుపునిచ్చారు.