డబ్లిన్: పెన్షన్ పొందడం కోసం ఇద్దరు వ్యక్తులు ఒక వృద్ధుడి శవాన్ని ఈడ్చుకుంటూ ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లారు. 1989 నాటి హాస్య చిత్రం వీకెండ్ ఎట్ బెర్నీ సీన్ను తలపించేలా ఉన్న ఈ ఘటన ఐర్లాండ్లో జరిగింది. కార్లో ప్రాంతంలో నివాసం ఉండే 66 ఏండ్ల వృద్ధుడు పీడర్ డోయల్కు వచ్చే పెన్షన్ను కాజేయాలని 30 ఏండ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు భావించారు. శుక్రవారం ఉదయం స్థానిక పోస్టాఫీస్కు వారు వెళ్లారు. పీడర్ డోయల్ రాలేని పరిస్థితిలో ఉన్నారని, ఆయన పెన్షన్ తమకు ఇవ్వాలని వారు అడిగారు. అయితే అక్కడి సిబ్బందికి దీనికి నిరాకరించారు. డోయల్ లేదా ఆయన వారసులు వస్తేనే పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పారు.
దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు తిరిగి డోయల్ ఇంటికి వచ్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఈడ్చుకుంటూ స్థానిక పోస్టాఫీస్కు తీసుకెళ్లారు. మరోవైపు ఆ దారిలో వెళ్లే వారిలో కొందరు దీనిని చూశారు. ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని కొందరు భావించారు. కాగా, ఆరోగ్యం బాగోలేదా అని పోస్టాఫీస్ సమీపంలో నివాసం ఉండే ఒక మహిళ ఆరా తీశారు. దీంతో ఆ వృద్ధుడికి గుండెపోటు వచ్చిందని చెబుతూ ఆయన మృతదేహాన్ని నేలపై ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అంబులెన్స్కు ఆమె ఫోన్ చేశారు.
అయితే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించలేదు. పోలీసులు, అంబులెన్స్ వచ్చే వరకు స్థానిక పోస్టాఫీసులోనే ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తికి డోయల్ బాగా తెలుసని పోలీసులు తెలిపారు. ఆ వృద్ధుడు రెండు రోజుల కిందటే చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయన పెన్షన్ డబ్బులు పొందేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ఇలా ప్రయత్నించారని భావిస్తున్నారు. అయితే వారు అలా ఎందుకు చేశారు అన్నది ప్రశ్నిస్తున్నారు. పోస్ట్మార్టం తర్వాతే డోయల్ మరణానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందన్నారు.
మరోవైపు ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వృద్ధుడు డోయల్ మరణంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు అడుక్కునేవారి మాదిరిగా వృద్ధుడి శవాన్ని పోస్టాఫీస్కు తీసుకెళ్లి ఆయన పెన్షన్ పొందేందుకు ప్రయత్నించడంపై మండిపడ్డారు.