Twitter | ట్విట్టర్లో ఇటీవల ఎలాన్ మస్క్ చాలా మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల తొలగింపు జాబితాలో జరిగిన పొరపాటు కారణంగా పలువురు ఉద్యోగులను తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి తిరిగి వచ్చేయాలంటూ ట్విట్టర్ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఓ కథనం వెలువరించింది.
సంస్థలోని మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిని మస్క్ ఇంటికి పంపించేశారు. తొలగించిన ఉద్యోగుల్లో కొంతమంది సేవలు తప్పనిసరని సంస్థ భావిస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. కొంతమంది సేవలు కంపెనీకి అవసరం ఉంటుందని, వారి తొలగింపు విషయంలో పొరపాటు జరిగిందని ట్విట్టర్ యాజమాన్యం భావిస్తున్నట్లు బ్లూమ్బర్గ్ తన కథనంలో పేర్కొంది. ట్విట్టర్లో ఎలాన్ మస్క్ తీసుకురాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగుల అవసరం తప్పనిసరని వెల్లడించింది. ఈ కథనంపై ట్విట్టర్ యాజమాన్యంగానీ, అధినేత ఎలాన్ మస్క్గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు. ఇకపై వారంతా వీధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని మేయిల్స్ పంపించారు. ఉద్యోగాల కోత ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్విట్టర్ ఆఫీసులను మూసే ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
కంపెనీలో మొత్తం 7500 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో సుమారు 50 శాతం మంది అంటే 3700 మందికిపైగా ఉద్యోగులను తొలగించారని ఏఎఫ్పీ నివేదికలు వెల్లడించాయి. వారందరికీ శుక్రవారమే ఈ మెయిల్స్ పంపినట్టు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే భారత్లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్ తన సందేశంలో పేర్కొన్నారు.